సర్కారు దవాఖానలపై పెరిగిన విశ్వాసం
‘2014- 2018 సంవత్సరంలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సారథ్యంలో మునుగోడు అభివృద్ధి జరిగింది. మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. మళ్లీ నాలుగేండ్లకు ప్రగతి పరుగులు పెడుతున్నది. మెరుగైన వైద్య సేవలు అందించాలని మర్రిగూడలో 30 పడకల దవాఖాన ఏర్పాటు చేశాం. గతంలోనే ఆస్పత్రి నిర్మాణం పూర్తయినా ప్రభుత్వానికి మంచి పేరొస్తదని మాజీ ఎమ్మెల్యే నిర్లక్ష్యంగా వదిలేశాడు. ఉప ఎన్నికల హామీలన్నింటినీ దశల వారీగా నెరవేరుస్తాం. స్వరాష్ట్రంలో కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందుతుండడంపై సర్కారు ఆస్పత్రులపై ప్రజలకు విశ్వాసం పెరిగింది’
– మర్రిగూడ ఆస్పత్రి ప్రారంభంలో మంత్రి జగదీశ్రెడ్డి
మునుగోడు ఉప ఎన్నికలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మర్రిగూడ మండల కేంద్రంలో మంగళవారం 30 పడకల ప్రభుత్వ దవాఖానను జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల వచ్చిందని, వైద్యశాఖలో ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తున్నామని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికలో ఇచ్చిన మాట ప్రకారం 30 పడకల దవాఖానను ప్రారంభించామన్నారు. ఆగిపోయిన పనులు పూర్తి చేసేలా, స్థానిక సమస్యలను తక్షణమే పరిష్కరించేలా కలెక్టర్కు సూచించారు. 60 ఏండ్లలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు మునుగోడుకు చేసిందేమీ లేదని విమర్శించారు. మునుగోడు నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటుకు కొబ్బరికాయ కొట్టిన బీజేపీ నేత నడ్డా పత్తా లేకుండా పోయాడని దుయ్యబట్టారు. శివన్నగూడెం, లక్ష్మణాపురం ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు వారం రోజుల్లో ప్లాట్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. రెండు మూడు రోజుల్లో గొల్లకుర్మలకు గొర్రెలను పంపిణీ చేస్తామని ప్రకటించారు.
మర్రిగూడ, జనవరి 3 : పేదలకు పైసా ఖర్చు లేకుండా వైద్యం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఎన్ఎంలు, ఆశలు పని చేయాలని సూచించారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన 30 పడకల ప్రభుత్వ దవాఖానను రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి మంచి మెజారీటీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వైద్యులను నియమించాకే ఆస్పత్రిని ప్రారంభించాలని అనుకున్నామన్నారు. డిసెంబర్ 31న రాష్ట్ర వ్యాప్తంగా 950 మంది డాక్టర్లకు ఆర్డర్లు ఇచ్చామని, జనవరి 1న మర్రిగూడ నూతన దవాఖానకు 8 మంది వైద్యులను కేటాయించామన్నారు. వైద్యులు రెగ్యులర్గా అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆపరేషన్ల సంఖ్యను తగ్గించి సహజ ప్రసవాల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. పుట్టిన బిడ్డకు మొదటి గంటలో తల్లిపాలు అమృతంతో సమానమని, ఆ సమయంలో బిడ్డకు తల్లిపాలు అందేలా ఆశకార్యకర్తలు చర్యలు తీసుకోవాలని సూచించారు.
దవాఖానలో జనరేటర్, స్కానింగ్ మిషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. క్యాటరాక్ట్ ఆపరేషన్లతోపాటు గైనకాలజిస్ట్ను నిమిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రం వచ్చాక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.ఈ ప్రాంత రైతుల కోసం బత్తాయి, నిమ్మ మార్కెట్లను ఏర్పాటు చేశామని వెల్లడించారు. 60 ఏండ్లలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు చేసిందేమీ లేదని విమర్శించారు. మునుగోడు నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటుకు కొబ్బరికాయ కొట్టిన నడ్డా పత్తా లేకుండా పోయాడని దుయ్యబట్టారు. వైద్యశాఖలో ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామన్నారు.ఉద్యోగాలు ఇచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. ఉద్యోగాలు ఊడగొట్టేది మాత్రం బీజేపీ ప్రభుత్వమని విమర్శించారు. ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కేంద్రం కార్పొరేట్లకు అమ్ముతుందని దుయ్యబట్టారు. రైతుల బావుల దగ్గర మోటర్లు, మీటర్లు పెట్టనందుకు తెలంగాణకు రావాల్సిన 30వేల కోట్ల రూపాయలను కేంద్రం నిలిపివేసిందన్నారు. ఒక వైపు కరోనాతో ఇబ్బంది కలిగినప్పటికీ నిరాటంకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. సంక్షేమంలో ఎదురులేకుండా తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచినందన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ఇచ్చిన మాట ప్రకారం 30 పడకల దవాఖానను ప్రారంభించామన్నారు. ముస్లింల ఖబ్రస్తాన్కు దారి, ఆగిపోయిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం, స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసేలా తక్షణం చర్యలు తీసుకోవాలని మంత్రి జిల్లా కలెక్టర్కు సూచించారు. శివన్నగూడెం, లక్ష్మణాపురం ప్రాజెక్టుల్లో భూ నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు భూమిని కేటాయించామని, వారికి వారం రోజుల్లో ప్లాట్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. రెండు, మూడు రోజుల్లో గొల్లకుర్మలకు గొర్రెలను పంపిణీ చేస్తామన్నారు.
చౌటుప్పల్లో డయాలసిస్ కేంద్రం ప్రారంభం
యాదాద్రి భువనగిరి, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కిడ్నీ రోగులకు ఉచిత డయాలసిస్ సెంటర్లు గొప్ప వరమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో డయాలసిస్ బాధితులకు బస్పాస్, ఆసరా పింఛన్లతోపాటు పల్లెల్లోనూ డయాలసిస్ సెంటర్లు ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. మంగళవారం చౌటుప్పల్లో ఏర్పాటు చేసిన ఉచిత డయాలసిస్ కేంద్రాన్ని జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పేదలపై భారం పడకుండా వారానికి రెండు, మూడుసార్లు ఉచితంగా డయాలసిస్ సేవలను అందిస్తూ సీఎం కేసీఆర్ తల్లిప్రేమను చాటుకున్నారని చెప్పారు.
కిడ్నీ రోగులకు సింగిల్ యూజ్ ఫిల్టర్ మెథడ్ ద్వారా ప్రతి పేషెంట్కు ఫిల్టర్ మార్చుతూ వైద్య సేవలు అందిస్తున్న ఒకే రాష్ట్రం మన తెలంగాణ అని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 50 లక్షల డయాలసిస్ సెషన్లు పూర్తి చేసుకున్నామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడక ముందు ఉస్మానియా, గాంధీ, వరంగల్ ఎంజీఎంలో మాత్రమే డయాలసిస్ సెంటర్లు ఉండేవని, ఇప్పుడు ఆ సంఖ్య 102కు పెరిగిందన్నారు. డయాలసిస్ కేంద్రాల కోసం ప్రభుత్వం ఏటా రూ.100కోట్లు ఖర్చు చేస్త్తున్నదని వెల్లడించారు. రాష్ట్ర సర్కారు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న చికిత్స చూసి.. తమిళనాడులో కూడా మన విధానాన్ని ప్రారంభించుకోవడం గర్వకారణమన్నారు. మంచి వైద్యం అందించే పాలియేటివ్ సెంటర్ను కూడా చౌటుప్పల్లో ఏర్పాటు చేసుకున్నామని, క్యాన్సర్ రోగులకు, వారి వెంటే ఉండే సహాయకులకు భోజన వసతి కల్పిస్తూ మంచి వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు మునుగోడు నియోజకవర్గానికి త్వరలో వంద పడకల ఆస్పత్రిని మంజూరు చేయనున్నట్లు తెలిపారు. వైద్య, విద్యా రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
మునుగోడులో అభివృద్ధి మళ్లీ మొదలైంది : మంత్రి జగదీశ్రెడ్డి
ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం 30 పడకల దవాఖాన ఏర్పాటు చేసిందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఆస్పత్రి నిర్మాణం పూర్తిచేసిన ప్రభుత్వానికి మంచి పేరొస్తదని, ప్రభుత్వాన్ని నిందించాలని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పట్టించుకోలేదని ఆరోపించారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేసే వారిని గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందని గ్రహించిన ప్రజలు బీఆర్ఎస్ పార్టీని గెలిపించారని అన్నారు. 2014 నుంచి 2018 మధ్యకాలంలో కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి హయాంలో మాత్రమే మునుగోడు అభివృద్ధి జరిగిందన్నారు.
నాలుగేండ్లు ఆగిపోయిన అభివృద్ధి తిరిగి కూసుకుంట్ల గెలుపుతో ప్రారంభమైందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులు ఎంతో మెరుగుపడ్డాయన్నారు. ప్రజలంతా ప్రభుత్వ దవాఖాన వైద్యం కోరుకుంటున్నారని పేర్కొన్నారు. పక్క రాష్ర్టాల ప్రజలు కూడా మన ఆస్పత్రులకు వస్తున్నారని తెలిపారు. నాడు గుండె సంబంధ వైద్యానికి తమిళనాడు రాష్ర్టానికి పోవాల్సి వచ్చేదని గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో గుండె, లివర్, కిడ్నీల మార్పిడికి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యల కారణంగా యావత్ భారతదేశం తెలంగాణ వెనుక పరుగులు పెరుగులు పెడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేనప్పటికీ తెలంగాణ అగ్రగామిగా ఎదిగిందని చెప్పారు.
గుజరాత్, ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ర్టాల ప్రజలు తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కావాలని కోరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోల్ల శ్రీనివాస్, రాష్ట్ర వైద్య విధాన పరిషత్ చైర్మన్ డాక్టర్ అజయ్, కలెక్టర్ వినయ్క్రిష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ ఖుష్బూగుప్తా, బాలల హక్కుల కమిషన్ సభ్యుడు పొనుగోటి అంజన్రావు, డీఎంహెచ్ఓ కొండల్రావు, ఎంపీపీలు మెండు మోహన్రెడ్డి, ఏడుదొడ్ల శ్వేతారవీందర్రెడ్డి, జడ్పీటీసీలు పాశం సురేందర్రెడ్డి, ఎలుగోటి వెంకటేశ్వర్రెడ్డి, మార్కెట్ చైర్మన్ దంటు జగదీశ్, రైతుబంధు సమితి కన్వీనర్ బచ్చు రామకృష్ణ, సర్పంచ్, ఎంపీటీసీలు నల్ల యాదయ్య, కట్కూరి వెంకటేశ్గౌడ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.