నల్లగొండ ప్రతినిధి, మే 26 (నమస్తే తెలంగాణ)/ నేరేడుచర్ల : కాంగ్రెస్, బీజేపీతోపాటు ఎవరెన్ని అబద్ధాలతో ప్రచారం చేసినా రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ సర్కారే వస్తుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం వారు మిర్యాలగూడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మిర్యాలగూడ పట్టణం, మఠంపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీది ముగిసిన చరిత్ర అని, అది మంచుకొండలా కరిగిపోతుందన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పాలనలో ఫ్లోరైడ్, కరువు రక్కసికి మారుపేరుగా మారిన ఉమ్మడి నల్లగొండ జిల్లా కేసీఆర్ సారథ్యంలో సస్యశ్యామలంగా మారిందని తెలిపారు. దాంతో జిల్లాలో 12కు 12 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ విజయకేతనం ఎగరవేసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలంతా వృద్ధ సింహాల మాదిరిగా కూర్చుని గర్జించే స్థాయికి చేరారని, ఇక వారికి శాశ్వతంగా ఇంటిబాటేనని ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు లక్షల టన్నుల ధాన్యం పండగా, నేడు 40 లక్షల టన్నుల ధాన్యంతో నల్లగొండ జిల్లా దేశానికే అన్నపూర్ణగా మారిందని అన్నారు. నాటి కాంగ్రెస్ నాయకులు బీఫాంలు, మంత్రి పదవుల కోసం నోర్లు మూసుకుని అన్యాయాలపై ప్రశ్నించలేదని విమర్శించారు.
కాంగ్రెస్, బీజేపీతోపాటు ఎవరెన్ని అబద్ధాలతో గోబెల్స్ తరహా ప్రచారం చేసినా రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ సర్కార్ వస్తుందని రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీశ్రావు, గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ది ముగిసిన చరిత్ర అని, ఆ పార్టీ మంచుకొండలా కరిగిపోతున్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో ఫ్లోరైడ్, కరువు రక్కసిలకు మారుపేరుగా మారిన నల్లగొండ జిల్లా నేడు సీఎం కేసీఆర్ సారథ్యంలో సస్యశ్యామలంగా అద్భుత ప్రగతిని సాధించిందని, అందుకే జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసిందని తెలిపారు. కాంగ్రెస్ నేతలంతా వృద్ధ సింహాల మాదిరిగా కూర్చుని గర్జించే స్థాయికి చేరారని, ఇక వారికి శాశ్వతంగా ఇంటి బాటేనని ఎద్దేవా చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డితో కలిసి మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
అనంతరం ఎన్ఎస్పీ క్యాంపు గ్రౌండ్లో, మఠంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో హరీశ్రావు మాట్లాడుతూ నల్లగొండ జిల్లాకు కాంగ్రెస్ నేతలు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఎందుకు తేలేకపోయారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ జిల్లాకు రెండు మెడికల్ కాలేజీలు ఇచ్చారని, నల్లగొండలో బత్తాయి, నకిరేకల్లో నిమ్మ మార్కెట్లు కూడా ఏర్పాటు చేశారని తెలిపారు. కోట్లాది రూపాయలతో లిఫ్ట్లు ఏర్పాటు చేసి సాగునీరు ఇస్తున్నామని చెప్పారు. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని, పల్లె, బస్తీ దవాఖానలు ప్రారంభించామని అన్నారు. నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరులో వంద పడకల ఆస్పత్రులు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. అందుకే ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటలా మారి 12కు 12 స్థానాలు గెలుచుకుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీది మేకపోతు గాంభీర్యమని, మునుగోడు ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్ కూడా రాలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సగం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులే లేరన్నారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా, గోబెల్స్ ప్రచారం చేసినా మూడోసారి బీఆర్ఎస్దే విజయమని, అందరూ కలిసికట్టుగా పని చేయాలని పార్టీ కార్యకర్తలకు మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు.
మిర్యాలగూడలో అద్భుత ప్రగతి
ఎమ్మెల్యే భాస్కర్రావు మిర్యాలగూడను అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని మంత్రి హరీశ్రావు అభినందించారు. పట్టణంలో నాలుగు లైన్ల రహదారులు, వెజ్, నాన్వెజ్ మార్కెట్, రవీంద్రభారతి, ఎటు చూసినా ప్రగతి జాడలు కనిపిస్తున్నాయని అన్నారు. రూ.4500 కోట్లతో మిర్యాలగూడలో అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు. మంత్రి జగదీశ్రెడ్డి కృషితో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న నాలుగు వేల మెగావాట్ల పవర్ ప్లాంట్తో మిర్యాలగూడ రూపురేఖలు మారిపోతాయన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. మిర్యాలగూడలో రూ.16 కోట్లతో 200 పడకల ఆస్పత్రి, చిన్న పిల్లల కోసం ఐసీయూ ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమన్నారు. ఎమ్మెల్యే భాస్కర్రావు కోరిక మేరకు మిర్యాలగూడకు బ్లడ్బ్యాంకుతోపాటు సిటి స్కాన్, టిఫా స్కాన్ మిషన్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఒక్క మిర్యాలగూడలోనే 80వేల మందికి సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే.. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ఎలా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు.
అభివృద్ధే మా ఎజెండా
ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఆ తరువాత నియోజకవర్గ అభివృద్ధే తమ ఎజెండా అని, అందరి సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మిర్యాలగూడ పట్టణ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు రూ.4500 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని, ఇందులో 1100 కోట్ల రూపాయలతో పట్టణంలో పనులు చేపట్టామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల సంఘాలకు రూ.3 కోట్లతో భవనాలు నిర్మించినట్లు చెప్పారు. దేశంలోనే అతి పెద్ద యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటును రూ.40 వేల కోట్లతో నిర్మిస్తున్నామని, త్వరలో పూర్తి కానున్నదని తెలిపారు. ప్లాంటు నిర్మాణం పూర్తయితే వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. మిర్యాలగూడ పట్టణంలో సాగర్ రోడ్డును రూ.139 కోట్లతో 100 ఫీట్ల వెడల్పు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రూ.15కోట్లతో నల్లగొండ రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నామని, రెండు వైపులా డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని, రాష్ట్రంలో మూడోసారి సీఎం కేసీఆర్ సారథ్యంలో హ్యాట్రిక్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మిర్యాలగూడలో భారీ విజయం సాధిస్తామని, జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలు గెలిచి సీఎం కేసీఆర్కు బహుమతిగా ఇస్తామని అన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అందించి పేద, మధ్య తరగతి ప్రజలకు, రైతు కూలీలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. ప్రతిపక్షాల పనికిమాలిన విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
కరువు, ఫ్లోరైడ్ పాపం కాంగ్రెస్దే..
35 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఆ పార్టీ నేతలతోపాటు జిల్లాలో కరువు, ఫ్లోరైడ్ మాత్రమే పెరిగాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అందుకే వృద్ధ సింహాల్లాంటి కాంగ్రెస్ నేతలను జిల్లా ప్రజలు పక్కనపెట్టి బీఆర్ఎస్కు పట్టం కట్టారని పేర్కొన్నారు. జిల్లా రాజకీయ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో 12కు 12 అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుందని చెప్పారు. గతంలో ఏ పార్టీకీ ఆరు సీట్లకు మించి రాలేదన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే జిల్లాలో ఫ్లోరైడ్ అడ్రస్ లేకుండా పోయిందని, వ్యవసాయంలో దేశ చరిత్రనే తిరగరాశామని అన్నారు. కాంగ్రెస్ హయాంలో నాలుగు లక్షల టన్నుల ధాన్యం పండితే గగనంగా ఉండేదని, నేడు 40 లక్షల టన్నుల ధాన్యంతో నల్లగొండ జిల్లా దేశానికే అన్నపూర్ణగా మారిందని తెలిపారు. ప్రపంచంలోనే అతి తక్కువ ప్రాంతంలో ఐదు లక్షల బోరుబావులు కలిగిన జిల్లాగా నల్లగొండ అవతరించిందని, ఇదంతా కాంగ్రెస్ నేతల పాపమే కదా అని ప్రశ్నించారు. వ్యవసాయాన్ని నాశనం చేసి, రైతుల నడ్డి విరగ్గొట్టారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో నల్లగొండ జిల్లా దేశానికే అన్నం పెట్టే ఘనత సాధించడం గర్వకారణమన్నారు.
బీఫామ్, మంత్రి పదవుల కోసం నోర్లు మూసుకుని అన్యాయాలపై ప్రశ్నించలేదని విమర్శించారు. సాగర్ ఎడమ కాల్వకు నీళ్లు ఇవ్వకున్నా, రాజవరం మేజర్కు నీళ్లు పారకున్నా పట్టించుకోలేదని, అందుకే జానారెడ్డి లాంటి వాళ్లంతా ఇంటికే పరిమితం కాకతప్పలేదని అన్నారు. సాగర్ ఆయకట్టులో వరుసగా 16వ పంటకు నీళ్లిస్తున్నామని, చివరి పొలానికి నీళ్లు పారుతున్నాయని, లో లెవల్ కెనాల్ను మనమే ప్రారంభించుకున్నామని చెప్పారు. జిల్లాలో ఎటుచూసినా పచ్చని పంట పొలాలు కనిపిస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిఖార్సైన ప్రజాప్రతినిధులని, రోజుకు 18గంటలు ప్రజల మధ్యనే ఉంటున్నారని అభినందించారు. నీళ్లను వదిలి చేపలు ఎలా బతుకలేవో.. ప్రజలను వదిలి ఉండలేనంతటి అనుబంధాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏర్పరుచుకున్నారని ప్రశంసించారు. అప్పట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వారానికి ఒక్క రోజు కూడా కనిపించేవాళ్లు కాదని విమర్శించారు. రూ.40వేల కోట్లతో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతున్నదని, అది పూర్తయితే మిర్యాలగూడ రూపురేఖలు మారిపోతాయని అన్నారు.
రాబోయే రోజుల్లో మిర్యాలగూడ పట్టణం కార్పొరేషన్ అవుతుందని చెప్పారు. పవర్ ప్లాంట్ను మూసేస్తామంటున్న కాంగ్రెస్ నేతలు అభివృద్ధి నిరోధకులన్నారు. అందుకే గులాబీ జెండా బతికి ఉన్నంత కాలం సీఎం కేసీఆర్ వెంటే జిల్లా ఉంటుందని, ఆయన నాయకత్వాన్ని నిలబెట్టుకుంటుందని చెప్పారు. ఎమ్మెల్యే భాసర్రావు ఆధ్వర్యంలో మిర్యాలగూడ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఎమ్మెల్యే భాస్కర్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాల్లో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ చైర్మన్లు బండా నరేందర్రెడ్డి, గుజ్జ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, శానంపూడి సైదిరెడ్డి, చిరుమర్తి లింగయ్య నోముల భగత్, కంచర్ల భూపాల్రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, కాసోజు శంకరమ్మ, యువ నేత నల్లమోతు సిద్దార్థ పాల్గొన్నారు.
–మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి
పోడు భూములు, పులిచింతల ముంపు సమస్య పరిష్కారానికి
పోడు భూములు, పులిచింతల ముంపు ప్రజల సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు హామీనిచ్చారు. గత పాలకులు గిరిజనులను ఓటు బ్యాంకుగానే చూశారని, సీఎం కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతోపాటు బంజారా భవనాలను నిర్మించారని, సంత్ సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ కల్పించడంతో వైద్య విద్యలో 8లక్షల ర్యాంకులు వచ్చిన వారికి సైతం మెడిసిన్ సీటు లభించిందన్నారు. గతంలో తండాల్లో ఆడబిడ్డ పుడితే అమ్ముకునే పరిస్థితి ఉండేదని, నేడు వారికి ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టి అండగా నిలుస్తున్నదని తెలిపారు. గతంలో ఎండాకాలం వస్తే తాగునీటి కోసం ఆడబిడ్డలు బిందెలు పట్టుకుని రోడ్ల మీదకు వచ్చేవారని, నేడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. సూర్యాపేట జిల్లాలోని పెద్ద ఆస్పత్రిని 5వేల పడకల దవాఖానగా తీర్చిదిద్దడంతోపాటు 150మంది వైద్యులు పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలను గడపగడపకూ తీసుకుపోయి కాంగ్రెస్, బీజేపీ నాయకుల దుష్ప్రచారాలను, జూఠా మాటలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి విజ్ఞప్తి మేరకు నియోజకవర్గానికి ఐటీ కళాశాలతోపాటు, మఠంపల్లి మండలంలోని కామంచికుంట తండాలో పల్లె దవాఖాన ఏర్పాటు చేయడానికి సహకరిస్తానన్నారు.
మఠంపల్లిలో మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మళ్లీ సాగునీటి, ఫ్లోరోసిస్ సమస్యలు పురుడు పోసుకుంటాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో నడుస్తున్న రోడ్డునడుగు, తాగుతున్న నీటినడుగు, వెలుగుతున్న లైటును అడగమని హితవు పలికారు. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి, ఆ పార్టీ నాయకులు నిద్రపోవడానికి జనరేటర్లు వాడి డీజిల్ కోసం వేల రూపాయలు ఖర్చు చేశారన్నారు. నేడు 24గంటల విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. అంతకుముందు మఠంపల్లిలో తెలంగాణ మలిదశ తొలి అమరుడు శ్రీకాంతాచారి, తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించారు.
నేను మీ బిడ్డను.. మీ శ్రేయస్సే నా ధ్యేయం
ఇక్కడే పుట్టి మీ మధ్యలో పెరిగినవాడిని. మీ శ్రేయస్సు కోసం రాత్రి, పగలు తేడా లేకుండా కష్టపడుతున్నా. మీ ఆశీర్వాదం ఎళ్లవేలలా ఉంచాలి.’ అని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మూడున్నరేండ్లలో రూ.3,500 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు. గత పాలకులు నియోజకవర్గాన్ని, ప్రజా సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారాలతో ప్రజలను పక్కదోవ పట్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. వారి మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. పులిచింతల ముంపు బాధితుల సమస్యల పరిష్కారంలో విఫలమైన కాంగ్రెస్ నాయకులు.. బ్రోకర్లను ఏర్పాటు చేసుకుని మునిగిపోయిన గ్రామాలకు కాకుండా ఇతరులకు ప్యాకేజీలు ఇచ్చి నిజమైన లబ్ధిదారులకు మొండి చేయి చూపారని విమర్శించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న తనపై తప్పుడు ఆరోపణలు చేయడం తగదన్నారు. గత ఎమ్మెల్యే వారంలో ఒక్క రోజు హుజూర్నగర్లో, ఆరు రోజులు హైదరాబాద్లో ఉండేవారని, వారిని ప్రజలు ఏనాడో మరిచిపోయారని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్లో వంద మంది చేరిక
మఠంపల్లి మండలంలోని రఘునాథపాలెం గ్రామ మాజీ సర్పంచ్ సర్వాది సీతారామయ్య, గుండ్లపల్లికి చెందిన కొండల్, మఠంపల్లికి చెందిన కొండేటి శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో ఆయా గ్రామాలకు చెందిన వంద మంది కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రుల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
-ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు