సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం బోనాల పండుగ సంబురంగా సాగింది. ఊర ముత్యాలమ్మ, కోట మైసమ్మతోపాటు పలు ప్రాంతాల్లో అమ్మవారికి పట్టణ ప్రజలు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. డప్పుల దరువులు, శివసత్తుల పూనకాలు, ఆటపాటలతో కోలాహలంగా మారింది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, సునీత దంపతులు ముత్యాలమ్మను దర్శించుకొని పూజలు నిర్వహించారు.
– సూర్యాపేట టౌన్, ఆగసు ్ట13
సూర్యాపేట టౌన్, ఆగస్టు 13 : సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. శివసత్తుల నృత్యాలు, డప్పు చప్పుళ్ల మధ్య మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం పలు కాలనీల్లోని గ్రామ దేవతలకు నైవేద్యం సమర్పించారు.
చంద్రన్నకుంటలో ఊర ముత్యాలమ్మ తల్లి, కురగాయల మార్కెట్లో కోట మైసమ్మ, తిరుమలనగర్లో ముత్యాలమ్మ తల్లి ఆలయాల చుట్టూ ప్రదక్షిణ చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, సునీత దంపతులు, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, నాయకులు బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. ఆలయాల్లో పూజలు నిర్వహించారు.