తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాతే గిరిజన జీవితాల్లో వెలుగులు నిండాయని, సీఎం కేసీఆర్ వారి అభివృద్ధి, సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండ కలెక్టరేట్లో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో 2,928 మందికి 5,577.78 ఎకరాల పోడు భూమికి పట్టాలు అందజేస్తున్నామన్నారు. తండాలను పంచాయతీలుగా మార్చి అభివృద్ధికి బాటలు వేశారని, 10 శాతం రిజర్వేషన్తో గిరిజనులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. జిల్లాలో ఆరేండ్లలోనే మిషన్ భగీరథ పథకంతో ఫ్లోరోసిస్ను రూపుమాపిన ఘనత సీఎం కేసీఆర్దేనని చెప్పారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా వెయ్యి రూపాయల పింఛన్ ఇవ్వడం లేదని, తెలంగాణలో నాలుగు వేల పింఛన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు జీవధార అని, దానిపై అనుమానాలు ఉంటే మేడిగడ్డ మీద నుంచి దూకితే కట్టింది లేనిది తేలి పోతుందని మంత్రి ఎద్దేవా చేశారు. 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాపై అపోహలు ఉన్నవారు విద్యుత్ వైర్లను ముట్టుకుంటే తెలుస్తుందన్నారు.
– నల్లగొండ, జూలై 3
నల్లగొండ, జూలై 3 : స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గిరిజనుల జీవితాల్లో వెలుగులు నిండాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో సోమవారం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ వినయ్క్రిష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి గిరిజనులకు పోడు భూముల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్కు గిరిజనులపై ఉన్న ప్రేమ, దార్శనికత కారణంగానే అడవి బిడ్డలకు హకులతో కూడిన పోడు భూముల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. నల్లగొండ జిల్లాలో అర్హులైన 2,928 మంది గిరిజనులకు 5,577.78 ఎకరాల అటవీ భూమికి పట్టాలు పంపిణీ చేస్తున్నామన్నారు. నేడు పట్టాలు పొందిన రైతులందరికీ రైతుబంధు, రైతు బీమా, ఇతర రైతుల మాదిరిగానే అన్ని రకాల సంక్షేమ ఫలాలు అందుకుంటారని చెప్పారు.
గిరి వికాస్ ద్వారా కరెంటు, బోరు సౌకర్యం కూడా ప్రభుత్వమే కల్పిస్తున్నదన్నారు. గిరిజనులకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్న ప్రభుత్వం కూడా తమదేనని చెప్పారు. గిరిజనుల కోసం ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,146 తండాలను గ్రామపంచాయతీలుగా మార్చినందునే 3,146 మంది గిరిజనులు సర్పంచులు అయ్యారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరేండ్లలోనే ఫ్లోరోసిస్ను పారదోలామన్నారు. ప్రజల ఆశలను నిజం చేస్తూ నేడు ఇంటింటికీ మంచినీరు, 24 గంటల విద్యుత్తు, రోడ్లు, కోటి ఎకరాలకు సాగునీరు, వైద్యరంగంలో సమూల మార్పులు తీసుకురావడంతో తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నదని తెలిపారు.
గిరిజనులు సాగు చేస్తున్న భూమికి పట్టాలు కావాలని గతంలో ప్రజాప్రతినిధులు, అధికారులకు అనేక సార్లు విన్నవించినా సమస్య పరిషరించలేదని విమర్శించారు. 2014కు ముందు రైతులు అరగోస పడ్డారని, మన ప్రాంతంలో రెండు నదుల్లో నీళ్లు ఉన్నా తెలంగాణ ప్రజలు ఆకలితో అలమటించి మరణించారని పేర్కొన్నారు. గతంలో గంజి కేంద్రాలు నడుపగా.. తెలంగాణ ఏర్పడ్డాక ఆకలి, దారిద్య్రం లేకుండా చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని చెప్పారు. మన రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్ రూ.2వేలు, దివ్యాంగులకు రూ.3వేలు ఇస్తున్నామని, ఏ రాష్ట్రాల్లోనూ ఇంత పెద్ద మొత్తంలో ఇస్తలేరని తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో కనీసం వెయ్యి రూపాయల పెన్షన్ ఇవ్వకుండా తెలంగాణలో రూ.4వేలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు జీవధార అని, ఆ ప్రాజెక్ట్పై అనుమానాలు ఉంటే మేడిగడ్డ మీది నుంచి దూకితే కట్టింది, లేనిది తేలిపోతుందని మంత్రి ఎద్దేవా చేశారు.
24 గంటల విద్యుత్ సరఫరాపై అనుమానాలుంటే ఏ నిమిషం అయినా వైర్లను ముట్టుకుంటే సరఫరా ఉన్నది, లేనిది తెలుస్తుందన్నారు. స్వరాష్ట్రంలో సూపరిపాలన అంటే ఏమిటో తెలియజెప్పడమే కాకుండా పరిపాలనలో అద్భుతాలు సృష్టించామని చెప్పారు. 24 గంటల విద్యుత్, ఇంటింటికీ మంచినీళ్లు, మిషన్ కాకతీయతో మత్తడి దుంకుతున్న చెరువులు, సస్యశ్యామలంగా మారిన భూములు, ఆధునిక దేవాలయాలుగా బాసిల్లుతున్న రైతు వేదికలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, గురుకులాల ఏర్పాటు, పాలనా వికేంద్రీకరణ కోసం కొత్త జిల్లాల ఏర్పాటు, ప్రతి జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన పాలన అందిస్తున్నారని కొనియాడారు. అంతకుముందు జిల్లా వ్యాప్తంగా 2,928 మంది రైతులకు 5,577 ఎకరాలకు సంబంధించి పోడు పట్టాల పంపిణీని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎంసీ కోటిరెడ్డి, ఎ.నర్సిరెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, ఎస్పీ అపూర్వరావు, ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, అదనపు కలెక్టర్ భాస్కర్రావు, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, ఆర్డీఓ చెన్నయ్య, అధికారులు గోశిక బాలకృష్ణ, రాజ్కుమార్ పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో 128మందికి పట్టాలు
యాదాద్రి భువనగిరి, జూలై 3 (నమస్తే తెలంగాణ) : యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో సోమవారం గిరిజన రైతులకు పోడు భూముల పట్టాల పంపిణీని మంత్రి జగదీశ్రెడ్డి ప్రారంభించారు. చౌటుప్పల్, తురపల్లి, సంస్థాన్ నారాయణపురం మండలాల్లోని తొమ్మిది గ్రామాలకు చెందిన 205 మంది లబ్ధిదారులకు 213 ఎకరాలకు సంబంధించిన పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు. సోమవారం 128 మందికి పట్టాలు పంపిణీ చేయగా.. మిగతా 77 మందికి త్వరలో అందిస్తామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, భువనగిరి, మునుగోడు ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డ్డి, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ బీకూనాయక్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి.శ్రీనివాస్రెడ్డి, డీసీపీ రాజేశ్చంద్ర, డీఎఫ్ఓ పద్మజ, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ కొలుపుల అమరేందర్ తదితరులు పాల్గొన్నారు.
పట్టా రాకముందే రైతు బంధు
గిరిజనులకు పోడు పట్టాలు ఇవ్వకముందే వారి బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు వేసేలా చర్యలు చేపట్టింది. ఇక నుంచి వారికి రైతు బీమా కూడా వర్తించనుంది. అందరి గిరిజనులకు గిరి వికాస్ కింద బోరు, మోటరు, కరెంటు సౌకర్యం రానుంది. కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ అమలు చేయకపోయినప్పటికీ రాష్ట్ర సర్కారు మాత్రం విద్య, ఉద్యోగాల్లో గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ అమలు చేయడం అదృష్టం.
పోడు పట్టాలు వస్తాయని ఎవరూ ఊహించలేదు
పోడు వ్యవసాయం చేసుకునే గిరిజనులకు 2007లో చెట్టు పట్టా పేరు మీద పట్టాలు ఇచ్చారు. నేడు సీఎం కేసీఆర్ లాగా స్వంత భూమి పట్టాలు ఇవ్వలేదు. ఇన్నేండ్లలో గిరిజనుల గురించి పట్టించుకున్న పాలకులు లేరు. ఈ పట్టాలు వస్తాయని ఎవరూ ఊహించలేదు. సీఎం కేసీఆర్ గిరిజనుల గురించి ఆలోచించి పట్టాలు ఇవ్వడంతోపాటు పట్టాలు అందకముందే రైతు బంధు పడేవిధంగా చర్యలు తీసుకున్నారు. గిరిజనులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉంటే రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తారు.
గిరిజన బిడ్డగా గర్విస్తున్నా
గిరిజన బిడ్డలను గతంలో ఏ పాలకులూ పట్టించుకోలేదు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేయాలని కోరినా గతంలో ఎవరూ పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ వల్ల మన తండాల్లో మన పాలన వచ్చింది. దాంతో తండాల్లో సీసీ రోడ్లు, వీధిలైట్లు ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్రంలో అన్ని వర్గాల కంటే గిరిజన బిడ్డలకే ప్రాధాన్యత దక్కడం పట్ల నేను గిరిజన బిడ్డగా గర్విస్తున్నా. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ వచ్చినందున ఇక నుంచి మన బిడ్డలకు ఎంతో ప్రాధాన్యత దక్కుతుంది.
ఏండ్లనాటి కల నెరవేరింది
నమ్ముకొని వ్యవసాయం చేసుకొని బతుకుతున్నం. పట్టా పుస్తకం వస్తదని కలలో కూడా అనుకోలె. నా పేరున రెండెకరాల పట్టా పాసుబుక్కు ఇచ్చిండ్రు. పట్టా బుక్ చేతికి రాకమందే నాకు రైతుబంధు పైసలు పడ్డయి. ఇన్నాళ్లు మాకు ఎలాంటి భరోసా లేకుండె. ఇప్పుడు రైతు బంధు, రైతు బీమా ఇస్తుండ్రు. 18 ఏండ్లుగా పట్టాలు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డం. ఏండ్ల నాటి కలను నెరవేర్చిన కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం.
– చాంప్లా, జాలువాయి తండా, మిర్యాలగూడ మండలం
పట్టా పుస్తకం వస్తదనుకోలేదు
పోడు భూములకు పట్టాలిస్తరనుకోలె. నా పేరుపై పట్టా పుస్తకాన్ని చూస్తాననుకోలేదు. ఎన్నో ఏండ్ల నుంచి పోడు భూముల సమస్య పరిష్కారం కోసం మా తాత, తండ్రులు ఎదురుచూస్తుండేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత తొందరగా పోడు భూముల సమస్య పరిష్కారమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలు గిరిజనులతోపాటు యావత్ తెలంగాణ సమాజానికి ఎంతో ఆదెరువుగా ఉన్నాయి. తండాల్లో పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కారమయ్యాయంటే అది సీఎం కేసీఆర్ వల్లే సాధ్యపడింది.
– బానోతు తాల, పల్లగుట్టతండా, సంస్థాన్ నారాయణపురం మండలం
గింత మంచి ప్రభుత్వం ఎప్పుడూ చూడలే
నేను పుట్టిన కాన్నుంచి ఎంతో మందిని చూసిన గానీ.. గిలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు. మారుమూల తండావాసుల కష్టాలను గుర్తించి సకల సౌలత్లు కల్పించారు. మా తాతలు, తండ్రులు గీ భూములనే నమ్ముకుని పంటలు పండించి జీవనం సాగించేవాళ్లు. ఇప్పుడు సీఎం కేసీఆర్ పుణ్యమాని సొంత పట్టాదారులమయ్యాం. ముఖ్యమంత్రి కేసీఆర్ రుణం తీర్చుకోలేనిది.
– గుగులోతు సాలమ్మ, గీల్యాతండా, సంస్థాన్ నారాయణపురం మండలం
కేసీఆర్ సార్ సల్లంగుండాలె
మేము పొద్దునలేస్తే అడవిలో బతికేటోళ్లం. మాకంటూ ప్రత్యేకంగా బతుకుదెరువు ఏమీ ఉండదు. పొట్ట కూటి కోసం కొద్దిపాటి భూమిని సాగు చేసి కడుపు నింపుకుంటున్నం. పంటలు వేద్దామంటే ఫారెస్టోళ్లు మస్తు ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టేది. దీనికి పరిష్కారం ఎప్పుడు దొరుకుతదోనని మా కులదైవాన్ని ఆరాధించేటోళ్లం. నాకున్న 11 గుంటల భూమిలో వరి పంట పండించేవాళ్లం. ఆ దైవం కేసీఆర్ రూపంలో వచ్చి మాకు పట్టాబుక్కులు ఇచ్చి పెట్టుబడి సాయం వేసిండు. కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం. ఆయన సల్లంగా ఉండాలె. మళ్లీ సారే ముఖ్యమంత్రి కావాలి.
– శారద, వాచ్యాతండా, దామరచర్ల మండలం
సర్కారోళ్లు జేసిన మేలు మర్చిపోం
సర్కార్ పోడు భూములకు పట్టా పత్రాలు ఇవ్వడం సంతోషంగా ఉన్నది. ఏడ్ల సంది గివే భూములను సాగు చేసుకుంటున్నాం. ఇన్నాళ్లు పట్టా లేక మస్తు ఇబ్బందులు పడ్డం. పంట దున్నెసుకుంట, కేసులు పెట్టుకుంట బాగా సతాయించేటోళ్లు. ఇప్పటికీ నా కొడుకుల మీద కేసులు ఉన్నాయి. ఇప్పుడా కేసులు కూడా కొట్టేస్తానన్నారు. కేసీఆర్ సార్ మా కష్టాలను దూరం చేసిండు. నాకు 27 గుంటలకు పట్టా పత్రం వచ్చింది. ఇప్పటికే నాకు రైతు బంధు 3,375 రూపాయలు నా ఖాతాలో పడ్డాయి. గిట్ల సర్కార్ మాకు జేస్తున్న మేలును మర్చిపోం.
– డేగావత్ సత్రి, పాల్తితండా, త్రిపురారం మండలం
మా గిరిజనులకు ఇదే అసలైన పండుగ
మాది నాగార్జున సాగర్ పరిధిలోని రాంనగర్ గ్రామం. ఎన్నో ఏండ్లుగా ఎకరం 18గుంటల పోడు భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నాం. మమ్మల్ని ఫారెస్టు అధికారులు ఎన్నో ఇబ్బందులకు గురి చేసి కేసులు పెట్టిండ్రు. మాకు పట్టా పాస్బుక్లు వస్తాయని నమ్మకం లేకుండె. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి మాకు ఇయ్యాల పాసుబుక్కులు ఇవ్వడం సంతోషంగా ఉన్నది. రైతు బంధు పైసల్ కూడా పడ్డయి. ఈ పట్టాలు పొందడమే మా గిరిజనులకు అసలైన పండుగ.
– రమావత్ లక్ష్మి, రాంనగర్, నిడమనూరు మండలం
జిల్లాలో 2,928 మందికి పట్టాలు
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 2,928 మంది గిరిజనులకు 5,577 ఎకరాలకు సంబంధించిన పోడు పట్టాలు అందజేశాం. పోడు భూముల్లో వ్యవసాయం చేసుకునే వారిలో కొందరు గిరిజనేతరులు కూడా ఉన్నారు. త్వరలో వారి భూములు విచారణ చేసి వారికి కూడా పట్టాలు అందజేస్తాం. అనివార్య కారణాల వల్ల మరికొందరి గిరిజనుల భూములు విచారణ చేయలేదు. త్వరలో అవి కూడా పూర్తి చేసి అర్హులకు పట్టాలు అందజేస్తాం. వీరందరికీ త్వరలో రైతు బంధు డబ్బులు వారి ఖాతాల్లో జమ అవుతాయి.
– వినయ్క్రిష్ణారెడ్డి, నల్లగొండ జిల్లా కలెక్టర్
మిగిలిన వారికి త్వరలో అందజేత
పోడు భూములను సాగు చేసుకుంటూ దరఖాస్తు చేసుకున్న వారికి సాధ్యమైనంత వరకు పట్టాలు అందజయడం జరిగింది. ఇంకా దరఖాస్తు చేసుకొని మిగిలిపోయిన వారి భూములు సైతం త్వరలో క్షేత్రస్థాయి పరిశీలన చేసి వారందరికీ పట్టాలు అందజేసేలా చర్యలు తీసుకుంటాం. ఈ పోడు పట్టాలకు స్థానిక తాసీల్దార్లు, పోలీసులు, కలెక్టర్ పూర్తి స్థాయిలో సహకరించినందున అర్హులకు అందజేశాం. ఈ పట్టాల విషయంలో మంత్రి జగదీశ్రెడ్డి చూపిన చొరవ మరువలేనిది. సీఎం కేసీఆర్ నిర్ణయం వల్లే గిరిజనులందరికీ పోడు భూముల పట్టాలు వచ్చాయి.
– నోముల భగత్కుమార్, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే