గులాబీ జెండాతోనే తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. దశాబ్దాల తరబడి మునుగోడు నియోజకవర్గాన్ని పట్టి పీడించిన ఫ్లోరైడ్ సమస్యను కేవలం ఆరేండ్ల వ్యవధిలోనే రూపుమాపిన శక్తి గులాబీ జెండాది అని స్పష్టం చేశారు. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు యావత్ భారతదేశం మొత్తంలో ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే అమలవుతున్నాయంటే అది బీఆర్ఎస్ జెండాకు ఉన్న పవర్ అని చెప్పారు. మునుగోడు మండల కేంద్రం, నల్లగొండ మండలంలోని అప్పాజీపేటలో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలకు మంత్రి జగదీశ్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథతో ఇంటింటికీ మంచినీరు అందుతున్నదని తెలిపారు. చీకట్లను పారదోలి 24 గంటల విద్యుత్ ప్రసారం అవుతున్నది ఒక్క తెలంగాణలోనేనని, గులాబీ జెండాను అక్కున చేర్చుకున్నందునే వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా జరుగుతున్నదని పేర్కొన్నారు. 2014కి ముందు 75 ఏండ్లుగా మోసిన జెండాలు ఈ పథకాలను ఎందుకు ఇవ్వలేకపోయాయో అందరూ ఆలోచించాలని కోరారు. సీఎం కేసీఆర్తోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్నాయని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఇప్పటికీ మన దగ్గరున్న పథకాలు లేవన్నారు. తెలంగాణ పథకాలపై ఆయా రాష్ర్టాల ప్రజలు చర్చకు పెడుతుండడంతో కమలనాథుల్లో వణుకు మొదలైందన్నారు. హస్తిన పీఠం కదులుతుందన్న భయం మోదీని వెంటాడుతున్నదని, అందుకే తెలంగాణను మళ్లీ చీకట్లోకి నెట్టే కుట్రలకు బీజేపీ తెర లేపిందని మండిపడ్డారు. ఆ కుట్రలను తెలంగాణ సమాజం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
ఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మంగళవారం పండుగలా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు జరిగాయి. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. అభిమానులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. బోనాలు, కోలాటాలు, భారీ ర్యాలీలు, పటాకులు, ఈలలు, చప్పట్లతో హోరెత్తించారు. మునుగోడు, అప్పాజీపేటలో మంత్రి జగదీశ్రెడ్డితోపాటు జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రభాకర్రెడ్డి, భూపాల్రెడ్డి, మిర్యాలగూడలో ఎమ్మెల్యే భాస్కర్రావు, నిడమనూరులో ఎమ్మెల్యే నోముల భగత్కుమార్, చిట్యాలలో ఎమ్మెల్యే చిరుమర్తి, సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయిలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, హుజూర్నగర్లో బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి మెట్టు శ్రీనివాస్, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, జడ్పీ చైర్మన్ సందీప్రెడ్డి పాల్గొన్నారు.
మునుగోడు/నల్లగొండ రూరల్, మార్చి 28 : గులాబీ జెండాతోనే పేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని, అంతా ఆ జెండాకు అండగా నిలువాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మునుగోడు, నల్లగొండ మండలాల బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాల్లో మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి జరుగుతున్నదని, సీఎం కేసీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాల అమలు చేస్తుంటే.. కేంద్రం ఓర్వలేకపోతున్నదని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఇక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాలు ఉన్నాయా? అని మంత్రి ప్రశ్నించారు.
మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం జోడెడ్ల బండిగా సాగుతున్నదని, దేశం మొత్తం కేసీఆర్ పాలన కోరుకుంటున్నదని చెప్పడానికి మహారాష్ట్రలో ఇటీవల జరిగిన భారీ బహిరంగ సభ విజయవంతమే నిదర్శనమన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దోపిడీని, ప్రజా సంపదను అదానీ, అంబానీలకు ధారాదత్తం చేస్తున్న విధానాన్ని ప్రచారం చేయాలని కోరారు. బీఆర్ఎస్ తిరుగులేని పాలనతో విపక్షాలకు వణుకు మొదలైందని, అందుకే ఆయా పార్టీల నాయకులు దిక్కుతోచని స్థితిలో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.
బీజేపీ మీటింగ్లతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని, గ్రామాల్లో తిరుగుతున్న బీజేపీ మంత్రులకు రైతులే తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. గులాబీ జెండాతోనే ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయని మంత్రి పేర్కొన్నారు. రాష్టంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే తెలంగాణను చీకట్లోకి నెట్టే కుట్రలు జరుగుతున్నాయన్నారు. చీకట్లను పారదోలి 24 గంటల నిరంతర విద్యుత్ ప్రసారమయ్యేది ఒక్క తెలంగాణలోనేనని తెలిపారు.
బీజేపీ, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ తరహా పథకాల ఊసే లేదన్నారు. తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన 30 వేల కోట్లు ఇవ్వకుండా అడ్డుతగులుతున్నారని ఆయన మండిపడ్డారు. రేపో, మాపో ఉదయం 5 నుంచి 10 గంటల వరకు, సాయంత్ర 6 నుంచి రాత్రి 10 గంటల వరకు విద్యుత్ని వినియోగించే వినియోగదారులపై 20 శాతం చార్జీలు పెంచాలంటూ మోదీ సర్కార్ రాష్ర్టానికి తాఖీదులు పంపిందన్నారు. అంతేకాకుండా మోటర్లకు మీటర్లు పెట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వంపై కత్తి పెట్టి మరీ ఒత్తిడి తెస్తున్నారని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు అబద్ధాలను నిజంలా నమ్మించేందుకు ప్రయత్నం చేస్తున్నాయన్నారు. సీఎం కేసీఆర్కు దేశంలోని పలు రాష్ర్టాల ప్రజలు నీరాజనం పలుకుతున్నారన్నారు.
మోదీ దుర్మార్గపు పాలనను రాబోయే రోజుల్లో అంతమొందించేది కేసీఆరే అని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో టీఎస్ఈడబ్ల్యూడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిరంజన్ వలీ, కటికం సత్తయ్యగౌడ్, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, ఎంపీపీలు కర్నాటి స్వామి యాదవ్, పల్లె కల్యాణీరవికుమార్, జడ్పీటీసీలు నారబోయిన స్వరూపరాణీరవిముదిరాజ్, పాశం సురేందర్రెడ్డి, వైస్ ఎంపీపీ అనంతవీణాలింగస్వామిగౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు బండ పురుషోత్తంరెడ్డి, దేప వెంకట్రెడ్డి, నాయకులు మునగాల నారాయణరావు, ఎడ్ల రవీందర్రెడ్డి, వెంకటేశ్వర్రావు, డోకూరి శ్రీనివాస్రెడ్డి, బకరం వెంకన్న, రాంరెడ్డి, మన్నె కృష్ణార్జున్రెడ్డి, మల్లేశ్గౌడ్, ఆలకుంట్ల నాగరత్నం రాజు, తవిట కృష్ణ, బడుపుల శంకర్, సంకు ధనలక్ష్మి, కొప్పుల విమలమ్మ, ఐతగోని విజయ్, గాదె రాజశేఖర్రెడ్డి సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ శాఖల అధ్యక్షులు పాల్గొన్నారు.
సంక్షేమం, అభివృద్ధి పరుగులు
రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో దాదాపు 5 నుంచి 10 కోట్ల వరకు అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఖర్చు చేసింది. గత ప్రభుత్వాల హయాంలో జరుగని అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిందనేది ప్రజలందరికీ తెలుసు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెడుతున్నది. రాష్ట్రంలో జరుగుతున్న పాలను చూసి పక రాష్ట్రాలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాయి.
– జడ్పీ చైర్మన్ నరేందర్రెడ్డి
పేదల కడుపు కొట్టింది కాంగ్రెస్, బీజేపీలే
70 ఏండ్లుగా పేదల కడుపు కొట్టింది కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలే. నల్లగొండ నియోజకవర్గంలో 20 ఏండ్లుగా ఉన్న దరిద్రాన్ని 2018 ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పుతో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి భువనగిరి పారిపోయేలా చేసింది. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు తదితర పథకాలు అందుతున్నాయి. ఈ పథకాలు ఇలాగే కొనసాగాలంటే రాబోయే రోజుల్లో ప్రజలంతా సీఎం కేసీఆర్కు అండగా నిలువాలి. సీఎం కేసీఆర్ నల్లగొండ నియోజకవర్గానికి ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే 1500 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చివరి దశకు చేరాయి. త్వరలోనే సొంత స్థలం ఉన్నావారికి రూ.3 లక్షల చొప్పున ప్రతి గ్రామానికి 25 ఇండ్ల చొప్పున అందజేస్తాం.
-ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి
మీ దీవెనలే కొండంత బలం
తెలంగాణ రాష్ట్రం రాక ముందు మునుగోడు నియోజకవర్గం ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా ఉందో మీరు చూస్తున్నారు. అగిపోయన అభివృద్ధిని ఉప ఎన్నికలో నన్ను గెలిపించుకొని చేయించుకుంటున్నారు. మీ దీవెనలే మాకు కొండంత బలం. ఎప్పటిలాగే ప్రతి ఒక్కరూ సీఎం కేసీఆర్కు అండగా నిలిచినప్పుడే భావితరాలు బాగుంటాయి. 75 ఏండ్ల దారిద్య్రాన్ని తొమ్మిదేండ్లలోనే పారదోలిన ఘనత సీఎం కేసీఆర్ది. ఇప్పటికే ఎన్నో పనులు ప్రారంభించి పూర్తి చేశాం. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవకుడుగా పని చేస్తా.
-ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి