అన్ని రంగాల అభివృద్ధితోపాటు ఆదాయం పెరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో అందరి జీవితాల్లో వెలుగులు నిండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని.. ఆయన ఆలోచన, మానవీయతతోనే వీఆర్ఏలు, జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు ఉద్యోగ భద్రత దక్కిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలోని ఓ ఫంక్షన్ హాల్లో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ సహాయకులకు ప్రభుత్వ ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జేపీఎస్, వీఆర్ఏలు ఉద్యోగ భద్రత కల్పించి, జీతం పెంచాలని కోరితే సీఎం కేసీఆర్ ఏకంగా శాశ్వత ఉద్యోగులుగా చేశారని అన్నారు. వివిధ కార్యక్రమాలకు దేశ వ్యాప్తంగా పల్లెలకు వచ్చే ఉత్తమ అవార్డుల్లో తెలంగాణ రాష్ర్టానికే 90నుంచి 95 శాతం వస్తున్నాయని, ఆ ఫలితం పంచాయతీ కార్యదర్శులకే దక్కుతుందని తెలిపారు. ఊరికి కష్టమొస్తే ముందు వరుసలో నిలబడి పనిచేసేది వీఆర్ఏలని వారి సేవలను మంత్రి గుర్తు చేశారు. అభివృద్ధిని అడ్డుకోవడంతోపాటు ఉద్యోగుల జీవితాల్లో మట్టి కొట్టేందుకు ప్రతిపక్షాలు కుట్రలు పన్నాయని, కోర్టులో కేసులు వేశాయని మండిపడ్డారు. దేవరకొండ, మునుగోడు తదితర ప్రాంతాలను సస్యశ్యామలం చేయడానికి చేపట్టిన పాలమూరు, డిండి ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేశాయని అన్నారు. సీఎంగా కేసీఆర్ ఉన్నంత వరకూ రాష్ట్ర ప్రగతిని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.
– నల్లగొండ, ఆగస్టు 10
నల్లగొండ, ఆగస్టు 10 : కేంద్ర ప్రభుత్వం పల్లెలకు వివిధ విభాగాల్లో ఉత్తమ అవార్డులు ప్రకటిస్తే అందులో 90 నుంచి 95 శాతం అవార్డులు తెలంగాణ పల్లెలకు సొంతం. ఇందుకు పంచాయతీ కార్యదర్శుల పని తీరు కారణం. అలాగే ఊరికి కష్టమొస్తే మేమున్నామని ముందు వరసలో నిలబడేదీ వీఆర్ఏలే..వీరద్దరి కష్టం తెలుసు కాబట్టి నేడు సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి వారిని శాశ్వత ఉద్యోగులుగా నియమించినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు. జేపీఎస్, వీఆర్ఏలకు శాశ్వత ఉద్యోగులుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో గురువారం నల్లగొండ పట్టణంలోని గుండగోని మైసయ్య కన్వెన్షన్ హాల్లో వారికి సంబంధించిన ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచన చేయడంతో నల్లగొండలో 648 మంది జేపీఎస్లు, 634 మంది వీఆర్ఏలకు శాశ్వత ఉద్యోగులుగా పదోన్నతి లభించిందని ఇక నుంచి వారికి ప్రభుత్వ ఉద్యోగుల్లాగానే అన్ని బెన్ఫిట్స్ అందనున్నాయని తెలిపారు. నాడు విద్యుత్ ఉద్యోగులను రెగ్యులర్ చేసిన సీఎం నిన్న మొన్న ఆర్టీసీ వాళ్లను చేస్తాం అంటే కార్పొరేషన్ ఎలా చేస్తారని కొందరు ఎద్దేవా చేశారన్నారు. వారి నోల్లు మూయిస్తూ ప్రత్యేకంగా చట్టసభలో బిల్లు పెట్టి రెగ్యులర్ చేసిన ఘనత కేసీఆర్ది అన్నారు.
శాశ్వత ఉద్యోగులుగా చేసిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్
అందరి కడుపు నింపాలని సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తుంటే విపక్షాలు దాన్ని అడ్డుకోవడానికి కొందరిని రెచ్చగొట్టడం..కోర్టుల్లో కేసులు వేయడం లాంటివి చేస్తూ అడ్డుకుంటున్నట్లు తెలిపారు. జేపీఎస్, వీఆర్ఏలు ఉద్యోగ భద్రత కల్పించి, జీతం పెంచాలని కోరితే ఏకంగా శాశ్వత ఉద్యోగులుగా చేసిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని ఆయన పట్ల ప్రతి ఒక్కరూ కృతజ్ఞత చూపించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతో ప్రపంచంలోనే గొప్ప కాళేశ్వరం నిర్మాణం చేయడంతో పాటు కృష్ణా, గోదావరి నుంచి సాగు నీరు అందిస్తూ 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి నుంచి 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వరకు ఉత్పత్తి చేస్తుంటే ప్రతిపక్షాలు ప్రాజెక్టులు అడ్డుకుంటున్నాయని అన్నారు. కృష్ణా నీరు సద్వినియోగం చేసుకొని దేవరకొండ, మునుగోడు లాంటి ప్రాంతాలను సస్యశ్యామలం చేయడానికి చేపట్టిన పాలమూరు, డిండి ప్రాజెక్టులు చేపడితే వాటిని అడ్డుకోని రాక్షసానందం పొందుతున్నారన్నారు. నాడు కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోవడం కోసం మూడు నాలుగొందల కేసులు వేసిన వారే నేడు ప్రతి పనికి అడ్డుపడి రాష్ట్రం ఏ పని కూడా సరిగ్గా కానివ్వడం లేదన్నారు.
రాష్ట్రంలో సీఎంగా కేసీఆర్ ఉన్నందునే నేడు తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధ్ది జరుగుతుందని మరోసారి సీఎం అయ్యాక అతి తక్కువ కాలంలో ఎక్కువ అభివృద్ధ్ది పొందిన రాష్ట్రంగా ప్రపంచంలోనే గుర్తింపు పొందుతుందన్నారు. సంపద సృష్టించి పేదలకు పెట్టాలని ఆ పేదల ఆదాయం మెరుగు పరిచిన తర్వాతనే రాష్ట్రం ఎంతో అభివృద్ధ్ది సాధించినట్టుగా ఉంటుందన్నారు. అంతకు ముందు జ్యోతి ప్రజ్వలన చేసిన మంత్రి జేపీఎస్లతో పాటు వీఆర్ఏలకు రెగ్యులర్ చేస్తూ సాధారణ పే స్కేల్ ఆర్డర్స్ను అందజేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్ర కుమార్, గాదరి కిశోర్ కుమార్, నల్లమోతు భాస్కర్ రావు, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నోముల భగత్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎస్పీ అపూర్వరావు,అదనపు కలెక్టర్ శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైది రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని నారాయణ రావు, విద్యావేత్త ఒంటెద్దు నర్సింహారెడ్డి, డీపీఓ విష్ణువర్ధ్దన్ రెడ్డి పాల్గొన్నారు.
రెగ్యులర్ చేయడం సంతోషంగా ఉంది
ప్రస్తుతం నల్లగొండ మండలం ముషంపల్లి వీఆర్ఏగా పని చేస్తున్నా. నాకు కనగల్ తాసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా నియామకం వచ్చింది. మా వీఆర్ఏల గురించి సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి మావి చిన్న జీవితాలు చక్క దిద్దాడు. మావి చిన్న జీవితాలు కాబట్టి మమ్మల్ని గురించి ఆలోచించి రెగ్యులర్ చేయడం చాలా సంతోషం. జీవిత కాలం మా కుటుంబం మొత్తం సీఎం కేసీఆర్కు రుణ పడి ఉంటాం.
-ఎస్కే లతీఫ్, వీఆర్ఏ ముషంపల్లి, నల్లగొండ మండలం
జీవిత కాలంలో సీఎం కేసీఆర్ను మర్చిపోం
వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్న మాకు నెలకు వచ్చే రూ.11 వేల వేతనంతో సరిపోక చాలీ చాలని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. మా కుటుంబాల్లో వెలుగులు నింపాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ మమ్మల్ని రెగ్యులర్ చేశారు. ఇంత గొప్ప సాయం చేసిన ముఖ్యమంత్రిని మా జీవిత కాలంలో మర్చిపోం. నాకు జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇచ్చిన సీఎం నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తా.
-అలివేలు, ఖుదాభక్ష్పల్లి, మర్రిగూడ మండలం
రాష్ట్ర ప్రభుత్వ మేలును మర్చిపోలేం
ఖాజీరామారంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నా. ప్రొబేషనరీ పీరియడ్ నాలుగేండ్లు పూర్తి కావడంతో ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రెగ్యులర్ చేయడం సంతోషంగా ఉంది. మేము పల్లె ప్రగతితో పాటు గ్రామాల్లో చేపట్టే పనుల్లో చిత్త శుద్ధితో పని చేయడం వల్ల దేశ వ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. దీన్ని సీఎం గుర్తించి తగిన ఫలితం ఇవ్వటం సంతోషం. సీఎం మేలును మేము మర్చిపోం. ప్రభుత్వానికి సహకరిస్తూ ప్రగతి సాధిస్తాం.
– బొంత అజయ్ కుమార్, జేపీఎస్, ఖాజీ రామారం,
నాలుగేండ్లుగా ప్రతి టాస్క్ను పూర్తి చేశాం
పని చేసేవాల్లకు సీఎం కేసీఆర్ ఎప్పుడైనా ప్రాధాన్యత ఇస్తాడని మా జేపీఎస్ల రెగ్యులర్తో స్పష్టమైంది. నాలుగేండ్లుగా ప్రభుత్వం ఇచ్చిన ప్రతి టాస్క్ను పూర్తి చేశాం. దాంతో దేశ వ్యాప్తంగా తెలంగాణ పల్లెలకు గొప్ప పేరు వచ్చింది. గ్రామాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో సీఎం ఎంతో దూర దృష్టితో ఆలోచనలు చేసి గొప్ప పథకాలు ప్రవేశపెట్టి మాతో చేయించి విజయవంతం చేయించారు. మమ్మలను రెగ్యులర్ చేసిన సీఎం కేసీఆర్ను మర్చిపోలేం.
– కే.మమత, జేపీఎస్, రాములబండ, నల్లగొండ మండలం