సూర్యాపేట టౌన్, మార్చి 19 :ధైర్య సాహసాలు, పోరాటాలకు స్ఫూర్తి మల్లు స్వరాజ్యం అని,ఆడవాళ్లు ఎందులోనూ తక్కువకాదని నిరూపించిన ధీర వనిత అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేటలోని రాయినిగూడెంలో నిర్వహించిన మల్లు స్వరాజ్యం ప్రథమ వర్ధంతి సభకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆమె చిత్ర పటానికి నివాళులర్పించి మాట్లాడారు. తెలంగాణను దేశానికి పరిచయం చేసింది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమేనని, నిజాం సర్కార్ నుంచి విముక్తి కల్పించేందుకు తుపాకీ పట్టిన తొలి మహిళగా మల్లు స్వరాజ్యం చరిత్రలో నిలిచారని అన్నారు. ఆమె పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. బీజేపీ దేశానికి అత్యంత ప్రమాదకరంగా మారిందని, దేశంలో పేదలను మరింత పేదరికంలోకి నెట్టుతున్న పాపం మోదీదేనని దుయ్యబట్టారు. అదానీ, అంబానీల ఆస్తులను పెంచడమే లక్ష్యంగా బీజేపీ వ్యవహరిస్తున్నదని, దేశంలో ఆకలి, పస్తులు పెరిగాయంటే మోదీ పాలన ఎంత రాక్షసంగా ఉందో అర్థమవుతుందని అన్నారు. దేశ స్థితిగతులను మార్చే యువతలో చైతన్యం పెరుగాలని, అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని
పిలుపునిచ్చారు.
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం జీవితం ఆదర్శప్రాయమని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం మల్లు స్వరాజ్యం ప్రథమ వర్ధంతి సందర్భంగా సూర్యాపేటలోని రాయినిగూడెంలో నిర్వహించిన సభలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణను దేశానికి పరిచయం చేసింది సాయుధ పోరాటమే అని, నిజామ్ సర్కారు నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు తుపాకీ పట్టిన తొలి మహిళగా మల్లు స్వరాజ్యం చరిత్రలో నిలిచిపోయారన్నారు. ఆనాటి పాలకుల అరాచకాలను ఎదురించి, చివరి వరకూ జెండా వదలకుండా పోరాడిన ధీర వనిత అన్నారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టి ఎంతటి నాయకుడినైనా ఎదిరించి నిలదీసిన ధైర్యశాలి మల్లు స్వరాజ్యం అన్నారు. ఆమె పోరాట స్ఫూర్తి భావి తరాలకు అందించాలన్నారు.
బీజేపీది రాక్షస పాలన
బీజేపీ దేశానికి అత్యంత ప్రమాదకరంగా మారిందని, ఆర్ఎస్ఎస్ భావజాలం అంతకంటే ప్రమాదకరంగా మారాయని మంత్రి మండి పడ్డారు. దేశంలో పేదలను మరింత పేదరికంలోకి నెడుతున్న పాపం ప్రధాని మోదీదే అన్నారు. 2014కు ముందు గుజరాత్ మాదిరిగా దేశాన్ని అభివృద్ధి చేస్తామన్న ఆయన మాయ మాటలు ప్రజలకు ఆనాడు అర్ధం కాలేదని.. నేడు కళ్లారా చూస్తున్నారరని పేర్కొన్నారు. ఎన్నో ఏండ్లుగా గుజరాత్ ప్రజలను మోసం చేస్తున్న మాదిరిగానే యావత్ దేశ ప్రజానికాన్ని మోసం చేస్తున్నారన్నారు. 2014కు ముందు 6.5 శాతం ఉన్న పేదరికాన్ని మోదీ వచ్చినంక 8.5 శాతానికి పెంచి అత్యంత విఫల ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారన్నారు. కనీస వేతనాల అమలు లేదు.. సంఘాలు పెట్టుకునే స్వేచ్ఛ లేదు.. దేశంలో ఆకలి, పస్తులు పెరిగినై అంటే మోదీ పాలన ఎంత రాక్షసంగా మారిందో ప్రజలందరికీ అర్ధమవుతుందన్నారు.
ఈ పరిస్థితుల్లో యువత మౌనంగా ఉండటం దేశానికి మరింత ప్రమాదకరని అందరిలో చైతన్యం పెంచుకొని దేశ భవిష్యత్లో మార్పులు తీసుకురావడంలో భాగస్వాములు కావాలన్నారు.సీపీఎం పొలిట్ బూర్యో సభ్యుడు బీవీ రాఘవులు మాట్లాడుతూ దేశంలో బీజేపీ అరాచకాలకు చరమగీతం పాడే సమయం ఆసన్నమమైందన్నారు. అందకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అదానీ, అంబానీల ఆస్తులను పెంచడమే లక్ష్యంగా ప్రధాని మోదీ పాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. పేదల ఉసురు తప్పక మోదీకి, బీజేపీ నాయకులకు తగులుతుందన్నారు. రైతులతో పాటు అన్ని రంగాల ప్రజలను నమ్మిస్తూ మోసం చేస్తున్న వారి అరచకాలు ఎంతోకాలం సాగవన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, సీపీఎం నాయకులు చెరుకుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నర్సింహారెడ్డి, మల్లు లక్ష్మి, మల్లు నాగార్జున్రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్య నారాయణ, నెమ్మాది వెంకటేశ్వర్లు, కోట గోపి పాల్గొన్నారు.