యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు విడుదల చేయకుండా కేంద్ర ప్రభుత్వం పల్లెల ప్రగతిని అడ్డుకుంటున్నది. ఏడాది కాలంగా మెటీరియల్ నిధులు పెండింగ్లో పెట్టి నాన్చుతున్నది. సుమారు 500 పనులకు సంబంధించి రూ. 19 కోట్ల బిల్లులను నిలిపేసింది. దాంతో పనులు చేసిన కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. మరోవైపు ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలు సకాలంలో అందడం లేదు.
జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామాల్లో వివిధ రకాల పనులు చేపడుతుంటారు. ఈ పథకంలో భాగంగా మెటీరియల్ కాంపోనెంట్ కింద 40శాతం నిధులు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఏటా గ్రామ సభలు నిర్వహిస్తూ అవసరమయ్యే పనులు, దాని ఖర్చును ముందుగానే అంచనా వేస్తారు. జిల్లా వ్యాప్తంగా 421 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒక్కో గ్రామంలో 40 నుంచి 50 రకాల పనులు కొనసాగుతున్నాయి. ఇందులో ముఖ్యంగా సీసీ రోడ్లు, ఇంకుడు గుంతలు, వైకుంఠధామాలు, ఫిష్పాండ్స్, మొక్కల నాటకం, నీరు చల్లించడం, గ్రామ పంచాయతీల నిర్మాణాలు తదితర పనులు జరుతుగుతుంటాయి. వీటికి సంబంధించిన పనులు మెటీరియల్ కాంపోనెంట్ కింద గ్రామాల్లో సర్పంచ్లు, కాంట్రాక్టర్లు చేశారు. కానీ ఏడాది కాలంగా నిధులు విడుదల కావడం లేదు.
ఉపాధి హామీ పథకంలో భాగంగా మెటీరియల్ కాంపోనెంట్ కింద చేసిన 500 పనులకు సంబంధించి సుమారు రూ. 19 కోట్లు నిధులు రావాల్సి ఉంది. గతేడాది మార్చి వరకు మాత్రమే బిల్లులు క్లియర్ అయ్యాయి. అప్పటి నుంచి చేసిన పనులకు పైసా విడుదల చేయలేదు. ఇవే కాకుండా 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జనరేట్ కాని మరో రూ. 29 కోట్లు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తున్నది. మరోవైపు ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఉద్యోగులకు కూడా జీతాలు సరిగా రావడం లేదు. జిల్లాలో 417మంది పని చేస్తుండగా, డిసెంబర్, జనవరి జీతాలు రావాల్సి ఉంది. సుమారు రూ. రెండు కోట్లు పెండింగ్లో ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఉపాధి నిధులు విడుదల చేయకపోవడంతో గ్రామాల్లో పనులకు ఆటంకం కలుగుతున్నది. అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కష్టమవుతున్నది. అంతేకాకుండా మెటిరీయల్ కాంపోనెంట్ కింద పనులు చేసిన కాంట్రాక్టర్లు, మాజీ సర్పంచ్లు ఆందోళన చెందుతున్నారు.