తుంగతుర్తి, జూలై 18 : భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ ఈ నెల 20న సూర్యాపేట కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అనంతుల మల్లయ్య, యల్క సోమయ్య గౌడ్ పిలుపునిచ్చారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం (సీఐటీయూ అనుబంధం) మండల కమిటీ సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు మళ్లించే నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని, కార్మికులకు భారంగా మారిన సీఎస్సీ హెల్త్ టెస్టులను పూర్తిగా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే 60 సంవత్సరాలు నిండిన ప్రతి భవన నిర్మాణ కార్మికునికి నెలకు రూ.9 వేల పెన్షన్ అందించాలన్నారు. అర్హత కలిగిన ప్రతి కార్మిక కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలన్నారు. జి.ఓ. నెం.12లోని కార్మిక వ్యతిరేక నిబంధనలను సవరించాలని, సంక్షేమ బోర్డు ద్వారా పెండింగ్లో ఉన్న వివాహ, ప్రసూతి, విద్య, ప్రమాద, సహజ మరణం, వైద్య సహాయం తదితర అన్ని క్లెయిమ్లను వెంటనే మంజూరు చేయాలని కోరారు.
అదేవిధంగా సంక్షేమ బోర్డు నమోదు, రెన్యువల్ ప్రక్రియను సులభతరం చేయాలని, నిర్మాణ కార్మికులకు భద్రతా పరికరాలను ఉచితంగా అందించాలని, ఈఎస్ఐ, పీఎఫ్, సామాజిక భద్రతా పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని, కార్మికుల పిల్లలకు విద్యా సహాయం, స్కాలర్షిప్లను పెంచాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మిక హక్కులను పరిరక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ నెల 20న సూర్యాపేట కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాకు భవన నిర్మాణ కార్మికులు, మహిళా కార్మికులు,యువ కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కోశాధికారి కొత్తపల్లి శివకృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు కరిమల శేఖర్, మండల ప్రధాన కార్యదర్శి బొంకూరి జలంధర్, షేక్ అబ్బాస్, మోహన్, సతీష్, సోమయ్య, నాగయ్య, నరేష్, రహీం, సైదమ్మ పాల్గొన్నారు.