ఆత్మకూర్.ఎస్, మే 08 : పంటల సాగులో మొదటిగా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని వ్యవసాయ శాస్త్రవేత్తలు అన్నారు. ఆత్మకూర్.ఎస్ మండల పరిధిలోని ఏపూర్ రైతు వేదికలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం నిర్వహించిన రైతు వారోత్సవాలు, రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. భూమి స్వభావం, పోషకాలు, తేమ స్థితి వంటి అంశాలను తెలుసుకోకుండా ఎరువులు వాడడం వల్ల ఖర్చులు పెరిగి దిగుబడి తగ్గే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల ప్రతి రైతు తన పొలానికి మట్టి నమూనాలు సేకరించి పరీక్ష చేయించుకోవాలని, దాని ఆధారంగా పంటలకు అవసరమైన పోషకాలను సరైన మోతాదులు అందించాలని సూచించారు. రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల భూమి శక్తి తగ్గిపోతుందని, దీని ప్రభావం దీర్ఘకాలంలో రైతు దిగుబడిపై పడుతుందని హెచ్చరించారు. అందుకే రైతులు సేంద్రియ పద్ధతులు, ప్రకృతి ఆధారిత వ్యవసాయాన్ని అవలంభించాలని సూచించారు.
పశువుల ఎరువు, జీవ ద్రావణాలు ఉపయోగించడం ద్వారా భూమి సారాన్ని తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ విధానాలు రైతులకు ఖర్చు తగ్గించడమే కాకుండా పంటల నాణ్యతను కూడా మెరుగు పరుస్తాయన్నారు. మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను ఎంపిక చేసుకోవడం కూడా రైతులకు లాభదాయకమని తెలిపారు. ముఖ్యంగా సన్నవరి రకాలను సాగు చేయడం ద్వారా మంచి ధరలు లభించే అవకాశం ఉందని, నీటి వినియోగాన్ని తగ్గించే పద్ధతులను పాటించడం ద్వారా సాగు ఖర్చులు నియంత్రించవచ్చని అన్నారు. అలాగే నీటిని వృథా కాకుండా జాగ్రత్తగా వినియోగించడం, పంటల పెరుగుదల దశల ప్రకారం నీటిని అందించడం ఎంతో ముఖ్యమని సూచించారు. రైతులు కొత్త పద్దతులను భయపడకుండా స్వీకరించాలని, శాస్త్రీయ విధానాలను అనుసరిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించవచ్చు అని స్పష్ట చేశారు.
ప్రభుత్వ శాఖలు ఎప్పుడూ రైతులకు అండగా ఉంటాయని, ఎలాంటి సందేహాలు ఉన్న అధికారులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంకు చెందిన శాస్త్రవేత్తలు డా.జే.అరుణ కుమారి, డా.వి.సునీత, మండల వ్యవసాయ అధికారి డి.దివ్య, ఏపూర్ గ్రామ సర్పంచ్ కల్లెపల్లి చంద్రమోహన్, మిడ్తనపల్లి సర్పంచ్ ఉప్పుల సురేష్, వ్యవసాయ విస్తరణ అధికారి శివమూర్తి, ఎస్.పవన్, భూసార పరీక్ష వాలంటీర్లు, గ్రామ రైతులు పాల్గొన్నారు.