యాదగిరిగుట్ట : కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం 9 ఏండ్లలోనే ఎంతో అభివృద్ధి సాధించిందని మహారాష్ట్రకు చెందిన రైతు సంఘం నాయకులు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుత నిర్మాణాలు, సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు కావడం గొప్ప విషయమని కితాబునిచ్చారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డితో కలిసి మహారాష్ట్రలోని విదర్భ రైతు సంఘం అధ్యక్షుడు నానా బోండే, అమరావతి జిల్లా ఫార్మర్స్ యూనియన్ అధ్యక్షుడు విజయ్ యశ్వంత్ విల్దేఖర్, ఫార్మర్స్ యూనియన్ తాసీల్ అధ్యక్షుడు నందకుమార్ కెరడే, అమరావతి జిల్లా ఫార్మర్స్ మాజీ అధ్యక్షుడు సంజయ్ థాయ్డే, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు స్వప్నిల్ వాఖోడే, మాజీ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్గాడేతోపాటు 20 మంది రైతు సంఘం నాయకులు గురువారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు.
సీఎం కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడు కావాలని దేశం కోరకుంటుందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడంతో పాటు దేశంలో గొప్ప నాయకుడిగా సీఎం కేసీఆర్ వెలుగొందుతారని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ‘మేం రైతులం.. దేశానికి మూలం మేమే.. ప్రస్తుత దేశంలో రైతులు బతికే పరిస్థితి లేదని.. ముఖ్యమంత్రి కేసీఆర్ను ఢిల్లీకి పంపి, రైతు రాజ్యాన్ని తీసుకురావాలి’ అంటూ పాటను ఆలపించారు. తెలంగాణలో రైతు రాజ్యం వచ్చిందని, ఇక దేశంలో మిగిలి ఉందని అన్నారు. దేశంలో రైతురాజ్యం రావాలంటే ఒక్క కేసీఆర్తోనే సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ను చూస్తుంటే.. తమ రైతు నాయకుడు శంకర్రావు దోన్కే గుర్తుకొస్తున్నాడని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధాహేమేందర్గౌడ్, రైతు బంధు సమితి డైరెక్టర్ మిట్ట వెంకటయ్య, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పెలిమెల్లి శ్రీధర్గౌడ్, మాజీ ఉప సర్పంచ్ గుండ్లపల్లి భరత్గౌడ్ పాల్గొన్నారు.