చేనేత వస్ర్తాలు, పట్టు చీరెలకు ప్రసిద్ధి చెందిన పోచంపల్లి పట్టణం కొత్తరూపు సంతరించుకున్నది. సమైక్య పాలనలో కనీస వసతులు లేక అధ్వానస్థితిలో ఉండగా స్వరాష్ట్రంలో అన్ని హంగులు అద్దుకుంటున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీగా మార్చి రూ.50 కోట్ల నిధులు విడుదల చేయడంతో సర్వాంగ సుందరంగా మారింది. స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి పట్టణంలోని ప్రధాన రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించి సెంట్రల్లైటింగ్ ఏర్పాటు చేశారు. ప్రతి వీధికి సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారు. ఎక్కడికక్కడ మొక్కలు పెంచడంతోపాటు పార్కులు ఏర్పాటు చేయడంతో పచ్చదనం ఉట్టిపడుతున్నది. వివిధ దేశాలు, ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు కొత్త అనుభూతిని పంచుతున్నది. చౌరస్తాలో ఏర్పాటు చేసిన చేనేత కార్మికుడి విగ్రహం చేనేత ఔన్నత్యాన్ని ఇనుమడింప జేస్తున్నది.
భూదాన్పోచంపల్లి, నవంబర్ 16 : సమైక్య పాలనలో ఏమాత్రం అభివృద్ధికి నోచని భూదాన్పోచంపల్లి స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది. మున్సిపాలిటీగా ఏర్పాటైనప్పటి నుంచి ప్రగతి పరుగులు పెడుతున్నది. నాడు కనీస సదుపాయాలు కరువైన పట్టణంలో నేడు సకల వసతులు అందుబాటులోకి వస్తున్నాయి. సుమారు రూ.50 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులు జరిగాయి. పట్టణంలో ఎకడ చూసినా సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణం, పచ్చదనంతో పరిశుభ్రత పరిఢవిల్లుతుంది. పర్యాటక కేంద్రమైన భూదాన్పోచంపల్లిలో గతుకులుగా ఉన్న రోడ్ల దుస్థితిని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో రూ.50 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు జరిగాయి.
మున్సిపాలిటీలో తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నిధులతో పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ విగ్రహం వరకు(1.60 కిలోమీటర్ల మేర) సుమారు రూ.7.30 కోట్లతో ప్రధాన రోడ్డును విస్తరించారు. మధ్యలో ఐదు 5 వెడల్పుతో డివైడర్, దానికి ఇరువైపులా 50 ఫీట్ల వెడల్పుతో రోడ్లను పునర్నిర్మించారు. రహదారి మధ్య 63 బటర్ఫ్లై లైట్లు అమర్చారు. డివైడర్ మధ్యలో వివిధ రకాల పూలమొకలు నాటారు. పట్టణ పరిధిలోని 13 వార్డుల్లో 19 కిలోమీటర్ల మేర అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. రూ.2.18 కోట్లతో 35 కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టారు. రూ.6.50 కోట్లతో వార్డుల్లో అవుట్ లైట్ డ్రైనేజీ నిర్మాణ పనులు, ఎస్డీఎఫ్ నిధులు రూ.5.15 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు, ఇందిరానగర్ కాలనీలో అంబేదర్ కళాభవన్కు రూ.20 లక్షలు మంజూరు చేశారు. రోడ్ల విస్తరణలో భాగంగా పనులు చేపట్టి మొక్కలు నాటడంతో అవి పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి పేరున ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు పోచంపల్లి పట్టణానికి రూ.5.74 కోట్లు మంజూరు చేసింది. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. పట్టణంలోని మూడు నర్సరీలు, 13 పట్టణ ప్రకృతి వనాలు, ఒక ఫ్రీడం పార్క్, 12 కిలోమీటర్ల మేర అవెన్యూ, మీడియన్, ఎంఎల్ఏపీ ప్లాంటేషన్ చేపట్టి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. పారిశుధ్య నిర్వహణకు 7 వాహనాలను కొనుగోలు చేశారు. పట్టణంలో 2014కు ముందు రెండు మరుగుదొడ్లు మాత్రమే ఉండగా, ఇప్పుడు రూ.25 లక్షలతో ప్రజా మరుగుదొడ్లు నిర్మించారు. మల వ్యర్థాలను శుద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.90 లక్షలతో 15కేఎల్డీ సామర్థ్యంతో ఎఫ్ఎస్టీపీ మంజూరు చేసింది. పట్టణంలోని వీధివీధినా సీసీ రోడ్లు వేశారు. సీసీ రోడ్లతో వీధులన్నీ పరిశుభ్రంగా మారడంతో పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పర్యాటక కేంద్రమైన భూదాన్పోచంపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తా. పట్టణంలో గతుకులు, గుంతలు లేకుండా చూస్తాం. పట్టణ పరిధిలోని 13 వార్డుల్లో అంచలంచెలుగా మౌలిక వసతులు కల్పిస్తాం. పర్యాటక కేంద్రాన్ని ఆహ్లాదంగా తీర్చిదిద్దుతా. రాజకీయాలకతీతంగా భువనగిరి నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పని చేస్తా.
-పైళ్ల శేఖర్రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి సహకారంతో మున్సిపాలిటీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. పోచంపల్లి ప్రధాన రహదారిని విస్తరించాం. బటర్ఫ్లై లైట్లు ఏర్పాటు చేయడంతో పట్టణం విద్యుత్కాంతులతో జిగేల్ మంటుంది. గల్లీగల్లీలో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టాం. ఇంకా మిగిలి ఉన్న పనులను దశలవారీగా చేపడుతాం.
-చిట్టిపోలు విజయలక్ష్మీ శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్