ఆత్మకూరు (ఎం), ఆగస్టు 13 : ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన దళితుల బతుకుల్లో దళిత బంధు పథకం వెలుగులు నింపుతున్నది. సర్కారు అందించిన ఆర్థిక సాయంతో కూలీలు ఓనర్లుగా మారి దర్జాగా జీవనం సాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా ఆత్మకూరు(ఎం) మండలంలోని మొరిపిరాల గ్రామంలో ఉన్న మొత్తం 55మంది దళిత కుటుంబాలకు గత ఏడాది మార్చిలో దళిత బంధు మంజూరు చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేయగా.. లబ్ధిదారులు తమకు నచ్చిన యూనిట్లు ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందుతున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకున్న దళితులు సాయం అందజేసిన సర్కారుకు కృతజ్ఞతలు తెలుపుతూ జేజేలు పలుకుతున్నారు.
నచ్చిన యూనిట్ల ఏర్పాటు
ప్రభుత్వం అందజేసిన ఆర్థిక సాయంతో లబ్ధిదారులు తమకు నచ్చిన యూనిట్లు ఏర్పాటు చేసుకొని రాణిస్తున్నారు. ఏడుగురు లబ్ధిదారులు ట్రాక్టర్లు, ముగ్గురు టాటా గూడ్స్ వాహనాలు, ముగ్గురు డోజర్లు కొనుగోలు చేశారు. ఒకరు జిరాక్స్ సెంటర్, ఆరుగురు గొర్రెల యూనిట్లు, ఇద్దరు సెంట్రింగ్ సామగ్రి యూనిట్లు పెట్టుకున్నారు. స్పోర్ట్స్ షాపు, సిమెంట్ ఇటుకల తయారీ, వెల్డింగ్ షాపు, ఎలక్ట్రికల్ షాపు ఒక్కొక్కరు చొప్పున ఏర్పాటు చేసుకున్నారు. ఆరుగురు లబ్ధిదారులు కలిసి హిటాచీ, ఇద్దరు కలిసి డీసీఎం, ఇద్దరు చొప్పున కలిసి 8మంది నాలుగు టిప్పర్లు, మరో ఇద్దరు కలిసి హార్వెస్టర్, ఇద్దరు చొప్పున 8మంది కలిసి నాలుగు టాటా ప్యాసింజర్ వాహనాలు తీసుకున్నారు. ముగ్గురు కలిసి రెండు కోళ్ల ఫారాలు ఏర్పాటు చేసుకొని ఓనర్లుగా మారారు.
ఆరుగురం కలిసి ఇటాచీ కొన్నాం
ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టి ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల సాయం అందించి ఆదుకున్నారు. ఆరుగురం లబ్ధిదారులం కలిసి రూ.60లక్షలతో ఇటాచీ కొనుగోలు చేశాం. మంచిగా నడుస్తున్నది. ఇప్పటికే ఖర్చులు పోను రూ.3లక్షల ఆదాయం వచ్చింది. సంతోషంగా బతుకుతున్నాం. మాకు సాయం అందించిన సీఎం కేసీఆర్ను ఎన్నటికీ మరువం.
– ముప్పిడి రాజయ్య, దళితబంధు లబ్ధిదారుడు, మొరిపిరాల
దళితబంధుతో దర్జాగా ఉన్నాం
దళితుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకం ద్వారా రూ.10లక్షల సాయం అందజేసింది. దీంతో గ్రామంలోని మా సొంత భూమిలో కోళ్లఫారం ఏర్పాటు చేసుకున్నాం. సంవత్సరంలోనే పెట్టుబడులు పోను రూ.లక్షా 80వేల లాభం వచ్చింది. నాడు కూలీలుగా పనిచేసిన మేము నేడు కోళ్ల ఫారానికి ఓనర్లయ్యాం. అందులో పని చేసుకుంటూ దర్జాగా సుఖంగా జీవనం సాగిస్తున్నాం.
– ముప్పిడి స్వామి, దళితబంధు లబ్ధిదారుడు, మొరిపిరాల
ప్యాసింజర్ వాహనంతో సుఖంగా బతుకుతున్నా
దళితబంధు కింద రూ.10లక్షలు మంజూరు కాగా.. రూ.8లక్షలతో సుప్రి ప్యాసింజర్ వాహనం కొనుగోలు చేశాను. మరో రూ.2లక్షలతో 19 గొర్రెలు కొన్నా. భువనగిరి నుంచి ఉప్పల్ వరకు ప్యాసింజర్ వాహనాన్ని నడుపుతుండడంతో నెలకు రూ.40వేలు సంపాదిస్తున్నా. అదేవిధంగా నాడు కొనుగోలు చేసిన 19 గొర్రెలు ఇప్పుడు 30 అయ్యాయి. మా కుటుంబ సభ్యులందరం తమ కాళ్లపై నిలబడి తలెత్తుకొని బతుకుతున్నాం.
– ముప్పిడి వెంకటేశ్, దళితబంధు లబ్ధిదారుడు, మొరిపిరాల
నాడు లారీ డ్రైవర్ను.. నేడు ట్రాక్టర్ ఓనర్నయ్యా
నేను గతంలో లారీ డ్రైవర్గా తక్కువ జీతానికే పనిచేసిన. ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేసిన దళితబంధు డబ్బుతో ట్రాక్టర్ను కొనుగోలు చేసి ఓనర్నయ్యా. వ్యవసాయంతోపాటు ఇతర పనులకు నడుపుతున్నా. ప్రతి రోజూ పని దొరుకుతున్నది. గతంలో నెలకు రూ.25వేల జీతం రాగా.. ఇప్పుడు రూ.45వేల వరకు సంపాదిస్తున్నా. ఇంటిపట్టునే కుటుంబ సభ్యులతో కలిసి సుఖంగా ఉన్నా.
– ముప్పిడి అశోక్, దళితబంధు లబ్ధిదారుడు, మొరిపిరాల