నీలగిరి, జూన్ 12 : ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉంటేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ అధ్వర్యంలో సోమవారం నల్లగొండ పట్టణంలో నిర్వహించిన 2కే రన్ను ఎన్జీ కళాశాల వద్ద బెలూన్లు వదిలి జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి రన్నింగ్లో పాల్గొన్నారు. అనంతరం క్లాక్టవర్ వద్ద జరిగిన సమావేశంలో సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ నేటి రోజుల్లో వ్యాయామం, ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోవడంతో జీవన ప్రమాణాలు కూడా మారిపోయాయన్నారు. ఇటీవలి కాలంలో యువకులు సైతం గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్యం కోసం ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా, వాకింగ్ వంటివి చేయాలని సూచించారు. తెలంగాణ ఏర్పడ్డాక పట్టణాలు, పల్లెలు గొప్పగా అభివృద్ధి చెందాయన్నారు. జిల్లా కేంద్రంలో అభివృద్ధి పనుల కోసం సీఎం కేసీఆర్ సుమారు వెయ్యి కోట్లకు పైగా నిధులు కేటాయించారని తెలిపారు. అత్యధికంగా మెడికల్ కళాశాలలున్న రాష్ట్రం మన తెలంగాణ అన్నారు.
అభివృద్ధి, సంక్షేమంపై వివరించేందుకే దశాబ్ది ఉత్సవాలు : ఎమ్మెల్యే కంచర్ల
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధ్ది, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికే శాఖల వారీగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. శాంతిభద్రతలు అదుపులో ఉండడంతో తెలంగాణ రాష్ర్టానికి 50వేల కంపెనీలు వచ్చాయన్నారు. నల్లగొండ పట్టణం 20 సంవత్సరాలుగా గోస తీసిందని, ఇప్పుడు 1200 కోట్ల రూపాయలతో సుందరీకరణ, రూ.75 కోట్లతో ఐటీ హబ్, రూ.275 కోట్లతో మెడికల్ కళాశాల నిర్మాణం జరుగుతున్నాయని తెలిపారు. క్లాక్టవర్ సెంటర్లో నాలుగున్నర ఎకరాల్లో కళాభారతి, ఉదయ సముద్రం ట్యాంక్బండ్, వల్లభరావు చెరువు నెక్లెస్ రోడ్, ఛాయా, పచ్చల సోమేశ్వర, వేంకటేశ్వర స్వామి అలయాల అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఐటీ హబ్ నుంచి ఉదయ సముద్రం వరకు 40ఫీట్ల రోడ్డు మంజూరు చేసుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ టి.వినయ్క్రిష్ణారెడ్డి, ఎస్పీ అపూర్వరావు, అదనపు కలెక్టర్ భాస్కర్రావు, అదనపు ఎస్పీ ప్రసాద్రావు, 12వ బెటాలియన్ కమాండెంట్ ఎన్వీ సాంబయ్య, గ్రంథాలయ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ గోలి అమరేందర్రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్, బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, కౌన్సిలర్లు ఎడ్ల శ్రీనివాస్, గోగుల శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.