చందంపేట, మార్చి 24 : రైతుల భూ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం చందంపేట మండలంలోని పొగిళ్ల, కంబాలపల్లి గ్రామంలో కలెక్టర్ పర్యటించి భూ సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పొగిళ్ల గ్రామంలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ సమస్యలు నెలకొన్న గ్రామాల్లో త్వరలో భూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. సర్వే నిర్వహించి అర్హులైన రైతులకు అన్ని విధాలుగా పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే రెవెన్యూ, అటవీ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి రైతుల భూ సమస్యలపై ఎటువంటి అభ్యంతరం లేకుండా వెంటనే రైతులకు భూ సమస్యలు పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు.
రైతులతో సమావేశం నిర్వహించి భూముల వివరాలను తెలుసుకున్నారు. భూ సమస్యలు ఉన్న రైతులకు వెంటనే సదరు రెవెన్యూ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించే విధంగా చర్యలు చూసుకుంటామని వెల్లడించారు. అధికారులు భూ సమస్యలపై ఎప్పటికప్పుడు రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం చందంపేట మండలంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. కలెక్టర్ వెంట దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, ఎంపీడీఓ లక్ష్మి, తాసీల్దార్ శ్రీధర్ బాబు, హౌసింగ్ పీడీ, డీఎంహెచ్ఓ శ్రీనివాస్, మాతృ నాయక్, సర్పంచులు రమాదేవి గోవింద్ యాదవ్, సాదిక్, కృష్ణవేణి, వెంకటయ్య, జతవాత్ జయేందర్, బ్రహ్మానంద రెడ్డి, రవి ఉన్నారు.