సమైక్య రాష్ట్రంలో కొత్తగా పింఛన్ రావాలంటే పాత పెన్షన్దారుడికి నూకలు చెల్లాల్సిందే!. అది కూడా 200 రూపాయలు ఇస్తే గగనం!! ఇక ఇతర వర్గాల సంక్షేమం గురించి మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు. అలాంటిది అనేక ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఊహించని విధంగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఎన్నికల మ్యానిఫెస్టోతో సంబంధం లేకుండా సీఎం కేసీఆర్ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టారు. ఆసరా పెన్షన్లను భారీగా పెంచారు. ఎవరూ అడుగని రైతుబంధు నుంచి గీత, చేనేత కార్మికులకు పింఛన్లు, రజక, నాయీబ్రాహ్మణ దుకాణాలకు ఉచిత విద్యుత్, విద్యార్థులకు సన్న బియ్యం, కేసీఆర్ కిట్, ఆరోగ్యలక్ష్మి ఇలా ఎన్నో పథకాలు ప్రజలకు అందుతున్నాయి. వృత్తుల వారీగా కూడా ఆర్థిక భరోసా కల్పించేందుకు గొర్రెలు, చేప పిల్లల పంపిణీ వంటి వినూత్న పథకాలు అమలులో ఉన్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఆయా విభాగాల ద్వారా ప్రత్యేకంగా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఏ పథకంలోనైనా అత్యధిక ప్రయోజనం పెద్ద జిల్లాగా ఉన్న నల్లగొండకే దక్కుతుండడం విశేషం. దాంతో గతంలో ఎన్నడూ లేనంతటి ఆర్థిక భరోసా జిల్లా ప్రజల్లో కనిపిస్తున్నది.
– నల్లగొండ ప్రతినిధి, మార్చి16(నమస్తే తెలంగాణ)
నల్లగొండ జిల్లాలో అనేక పథకాల ద్వారా లక్షలాది మందికి సంక్షేమ లబ్ధి చేకూరుతున్నది. రాష్ట్రం ఏర్పాటయ్యాక దశల వారీగా వీటి పరిమితి పెంచుతూ వస్తున్నారు. లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా వీటిని అమలుచేస్తున్నారు. ఎక్కడా కోతలు లేకుండా క్రమం తప్పకుండా విధిగా వీటిని అందజేస్తున్నారు.
– నల్లగొండ ప్రతినిధి, మార్చి16(నమస్తే తెలంగాణ)
దళితబంధు..
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో దళితబంధును తీసుకొచ్చింది. ఒకొక లబ్ధిదారుని కుటుంబానికి 10 లక్షల చొప్పున పూర్తిరాయితీతో కూడిన స్వయం ఉపాధి పథకాలు ఇస్తున్నది. జిల్లాలో 517 లబ్ధిదారులకు రూ.51.17 కోట్లతో ఉపాధి కల్పించింది. తాజాగా ప్రస్తుతం ఒక్కో నియోజకవర్గానికి మరో 1,100 యూనిట్ల గ్రౌండింగ్ కోసం ప్రక్రియ కొనసాగుతున్నది.
గొర్రెల పంపిణీ
గొర్రెల పంపిణీ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 28,234 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు 356 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. రెండో విడుత గొర్రెల పంపిణీలో భాగంగా జిల్లాలో 36,500 యూనిట్లను లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమం చురుకుగా కొనసాగుతోంది. ఇక పాడి పశువుల పంపిణీ పథకం కింద రూ.28.94 కోట్లతో 3,618 పాడి పశువులను అందజేసింది.
ఎస్సీల సంక్షేమం
జిల్లాలో 61 వసతి గృహాల్లో 4,360 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ సన్నబియ్యంతో భోజనం అందజేస్తున్నారు. స్కాలర్ షిప్పుల ద్వారా 8,976 మంది విద్యార్థులకు ప్రతి యేటా రూ.13.93 లక్షల ఆర్థిక సాయం అందుతున్నది. అంబేదర్ విదేశీ విద్యానిధి ద్వారా విదేశాలకు వెళ్లే వారికి ఆర్థిక సాయం అందజేస్తున్నారు. ఇక ఎస్సీ కులాల కుటుంబాలకు 0-101 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం కింద జిల్లాలో 1.41 లక్షల మందికి లబ్ధి చేకూరుతున్నది.
మహిళలకు రుణాలు
స్త్రీనిధి పథకం ద్వారా ప్రతి ఏటా 31 మండలాల్లోని 661 గ్రామ సమాఖ్యల ద్వారా 4,088 స్వయం సహాయక సంఘాల్లోని 11,051 సభ్యులకు రుణ సౌకర్యం కల్పిస్తున్నది. ఈ ఏడాది కూడా రూ.87.97 కోట్ల రూపాయల రుణ సౌకర్యం కల్పించింది. ఈ ఒక్క ఏడాదిలోనే బ్యాంక్ లింకేజీ ద్వారా 11,581 స్వయం సహాయక మహిళా సంఘాలకు రూ.709.84 కోట్ల రుణం మంజూరు చేసింది.
గిరిజన సంక్షేమం
జిల్లాలో 42 గిరిజన హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాల్లో 9 వేల మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. వీరి కోసం ప్రతి ఏటా 10 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. ప్రతి యేటా మూడు వేల మంది వరకు స్కాలర్షిప్పులు అందిస్తున్నది.
హాస్టళ్లలో వసతి
జిల్లాలో 46 హాస్టళ్లల్లో 4,500 మందికి వసతి కల్పిస్తున్నది. వీటి నిర్వహణకు ప్రతి యేటా ఐదు నుంచి ఆరు కోట్ల వరకు ఖర్చు చేస్తున్నది. స్కాలర్ షిప్పులు, ఫీజు రీయింబర్స్మెంట్ కింద ప్రతి యేటా సుమారు 40 కోట్ల వరకు లబ్ధి చేకూరుతున్నది.
డబుల్ బెడ్రూం ఇండ్లు
డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో ప్రతి నియోకవర్గానికి 1,400 చొప్పున ఇప్పటి వరకు మొత్తం 8,155 ఇండ్లను నిర్మించింది. ఇందుకోసం రూ.375 కోట్లను వెచ్చించింది. ఇప్పటివరకు 2,981 డబుల్ బెడ్రూంలను దశలవారీగా లబ్ధిదారులకు అందజేసింది.
చేపపిల్లల పంపిణీ
2016 నుంచి మత్స్యకారులకు 100 శాతం రాయితీపై 1400 చెరువుల్లో 5 కోట్ల చేప పిల్లలను వదులుతున్నారు. 9 రిజర్వాయర్లలో 45.59 లక్షల రొయ్య పిల్లలను వదిలారు. ప్రతి ఏటా ఇందుకోసం సగటున 5.50 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చిస్తున్నది.
ఆరోగ్యలక్ష్మి
మహిళా శిశు వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమం కింద జిల్లాలోని 2,093 అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆరోగ్యలక్ష్మి పథకంలో భాగంగా 1.14 లక్షల మంది గర్భిణులు, బాలింతలు, శిశువులకు సేవలు అందుతున్నాయి.
కల్యాణలక్ష్మి..
స్వరాష్ట్రంలో ఆడపిల్లల పెండ్లిళ్ల కోసం కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నది. ఒక్కో లబ్ధిదారుడికి 1,00,116 రూపాయలు అందజేస్తున్నది. ఇప్పటివరకు జిల్లాలో కల్యాణలక్ష్మి కింద 45,992 మందికి, షాదీముబారక్ ద్వారా 2,996 మందికి చెక్కులు అందజేసింది.
నేతన్నల కోసం
చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేనేత త్రిఫ్ట్ పథకాన్ని అమలు చేస్తున్నది. ప్రభుత్వం తరఫున ఆర్డీ-2 ఖాతాలో 4,368 మంది చేనేత కార్మికులకు రూ.8.87 కోట్ల రూపాయలు జమ చేసింది. చేనేత కార్మికుల వ్యక్తిగత రుణమాఫీ పథకం కింద 551 మంది కార్మికులకు కోటి 90 లక్షల రూపాయలు అందజేసింది. చేనేత మిత్ర పథకం ద్వారా 3,811 మంది కార్మికులకు రూ.2.13 కోట్ల రూపాయల సబ్సిడీని వారి ఖాతాల్లో జమ చేసింది. నేతన్న బీమా పథకం కింద 5,678 మంది చేనేత, మరమగ్గ కార్మికులు నమోదయ్యారు. ఈ పథకంలో ఇప్పటి వరకు ఏడుగురు మరణించగా వారి కుటుంబసభ్యులకు ఐదు లక్షల చొప్పున ప్రభుత్వం సాయమందించింది.
రైతుబంధు, రైతుబీమా..
రైతుబంధు పథకం ద్వారా ప్రభుత్వం ఎకరాకు 5 వేల చొప్పున అందజేస్తున్నది. 2018 వానకాలం నుంచి నిరాటంకంగా అమలవుతున్నది. పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న ప్రతి ఒక్కరికీ ఆ సాయం అందుతున్నది. ఇప్పటివరకు ఒక్కో సీజన్లో సగటున 4.50 లక్షల మందికి అన్ని విడుతల్లో కలిపి జిల్లాలో రూ.5,313 కోట్లను రైతుబంధు సాయంగా అందింది. రైతుబీమా పథకం ద్వారా రైతు ఏ కారణంతో చనిపోయినా బాధిత కుటుంబానికి ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నది. ఇప్పటివరకు జిల్లాలో ఐదేండ్లల్లో కలిపి 5,919 మంది రైతులు వివిధ కారణాలతో చనిపోగా వారికి రూ.296 కోట్లు పరిహారంగా అందింది. రుణమాపీ పథకం కింద జిల్లాలో మొత్తం 2.76 లక్షల మంది రైతులకు సంబంధించి 1,402 కోట్ల రుణమాఫీ చేసింది.
కేసీఆర్ కిట్స్
కేసీఆర్ కిట్ పథకంలో భాగంగా 4 విడుతలుగా గర్భిణులకు 27.30 కోట్ల రూపాయల ప్రోత్సాహం అందించింది. ఇప్పటి వరకు 53 వేల 101 కిట్లు పంపిణీ చేయడం జరిగింది.
ఆసరా పెన్షన్లు
జిల్లాకు ఆసరా పెన్షన్ల ద్వారా భారీ లబ్ధి చేకూరుతున్నది. ప్రస్తుతం జిల్లాలో 2.15 లక్షల మందికి అన్ని రకాల పెన్షన్లు అందుతున్నాయి. ఆసరా పింఛన్ల మంజూరుకు కనీస అర్హత వయస్సును 57 ఏండ్లకు తగ్గించారు. వృద్ధాప్య, వితంతు, ఒంటరి, కల్లుగీత, బీడీ, చేనేత కార్మికులకు నెలకు రూ.2,016, దివ్యాంగులకు రూ.3,016 అందుతున్నాయి. ప్రతి నెలా వీరందరికీ కలిపి రూ.50.69 కోట్ల లబ్ధి చేకూరుతున్నది.
రూపాయికి కిలోబియ్యం
జిల్లాలో 991 రేషన్ దుకాణాల ద్వారా జనవరి 2015 నుంచి రూపాయికి కిలో బియ్యం పథకం అమలవుతోంది. కుటుంబంలోని ఒక్కో సభ్యుడికి 5 కేజీల చొప్పున కుటుంబంలోని అందరికీ అందజేస్తున్నారు. జిల్లాలోని 4.66 లక్షల కుటుంబాలకు ప్రతి నెలా 4,470 మెట్రిక్ టన్నుల సబ్సిడీ బియ్యం పంపిణీ చేస్తున్నారు.
గీత కార్మికుల కోసం
గీత కార్మికులు చెట్టు పైనుంచి పడి గాయపడిన లేదా చనిపోయిన 404 కుటుంబాలకు గానూ రూ.4.16 కోట్ల ఎక్స్గ్రేషియా అందజేసింది. 50 సంవత్సరాలు పైబడిన 7,098 మంది కార్మికులకు 2016 రూపాయలు ఆసరా పెన్షన్ అందజేస్తున్నది. సారా ఆధారిత కుటుంబాలకు పునరావాస పథకం కింద జిల్లాలో 226 కుటుంబాలకు రూ.4.52 కోట్లను అందజేసింది.
అర్చకుల కోసం
ధూప, దీప, నైవేద్యం కింద జిల్లాలో 182 మంది అర్చకులకు ప్రభుత్వం నుంచి నెలకు 6 వేల చొప్పున ధూప, దీప, నైవేద్య పథకం నుంచి వేతనం అందుతున్నది.
ఉచిత విద్యుత్
నల్లగొండ జిల్లాలో అర్హులైన 995 నాయీబ్రాహ్మణులు, 5,131 మంది రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను ప్రతి నెలా సరఫరా చేస్తున్నది.
పంటల ప్రోత్సాహకం
జిల్లాలో ‘జాతీయ ఆయిల్పామ్ మిషన్’ ద్వారా రాయితీ కల్పిస్తూ 3,500 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఇందుకోసం ఇప్పటివరకు 389 మంది లబ్ధిదారులకు గానూ 1.59 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్ర సూక్ష్మ నీటి పారుదల పథకం ద్వారా 611 మంది రైతులకు 3,046 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుకు డ్రిప్ పరికరాల కోసం రాయితీ ఇస్తున్నది.
కంటి వెలుగు
జిల్లాలో ఇప్పటికే తొలి విడుత కంటి వెలుగు విజయవంతమైంది. రెండో విడుత కంటి వెలుగు ముమ్మరంగా కొనసాగుతున్నది. జిల్లాలోని 74 వైద్య బృందాలతో 1,026 క్యాంపుల ద్వారా 100 రోజుల్లో 18 ఏండ్లు పైబడిన వారికి కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. తొలి విడుతలో 6.33 లక్షల మందికి కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి అద్దాలు, మందులు అందజేస్తున్నారు.
చింతలేకుండా బతుకుతున్నాం
గతంలో పంట పెట్టుబడికి డబ్బులు లేక అప్పులు తెచ్చి సాగు చేయాల్సిన పరిస్థితి. సాగునీరు, కరెంటు సరిగా ఉండక అప్పుల పాలైనం. ఇప్పుడు రైతుబంధుతోపాటు సాగునీరు పుష్కలంగా అందుతుంది. నాకు గ్రామంలో ఉన్న రెండెకరాల భూమిని సాగు చేసుకుంటున్నా. వ్యవసాయానికి రైతుబంధు కింద రూ.10 వేలు వస్తున్నయ్. నేను వికలాంగుడిని కావడంతో పింఛన్ కింద నెలకు రూ.3,016 ఇస్తున్నరు. నాలాంటి నిరుపేద రైతు బతికేందుకు సీఎం కేసీఆర్ సారు ధైర్యాన్ని ఇచ్చిండు. నా భార్య అంగన్వాడీలో ఆయాగా పనిచేస్తున్నది. ఆమెకు జీతం పెంచడంతో మా కుటుంబమంతా చింతలేకుండా బతుకుతున్నాం.
-లావూరి నారాయణ, వాచ్యాతండా, దామరచర్ల
కల్యాణలక్ష్మి ఆదుకున్నది
మాది నల్లగొండ మండలం చిన్నసూరారం గ్రామం. నాకు కూతురు, కుమారుడు ఉన్నారు. కూలి చేసుకుంటూ జీవనం గడుపుతున్నాం. నా బిడ్డ పెండ్లికి ఎదిగింది. కానీ, పెండ్లి చేయలేని పరిస్థితి. ఈ సమయంలో సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన కల్యాణలక్ష్మి పథకం మాలో ధైర్యం నింపింది. గత ఏడాది ఫిబ్రవరిలో నాబిడ్డ పెండ్లి చేసిన. కల్యాణలక్ష్మి పథకంలో నా బిడ్డ పేరున ఇటీవల రూ.1,00,116 చెక్కు వచ్చింది. చెక్కు మంజూరు చేసిన ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
-గజ్జి నాగమ్మ, చిన్నసూరారం, నల్లగొండ మండలం
మత్స్యకారులను ఆదుకున్నది సీఎం కేసీఆరే..
మత్స్యకారుల జీవనోపాధి గురించి గత ప్రభుత్వాలు ఏమాత్రమూ పట్టించుకోలేదు. చెరువులు, కుంటల్లో చేపలు పట్టి వాటిని అమ్మేందుకు ఇబ్బందులు పడేవాళ్లం. రోజుల తరబడి ఒకే దగ్గర ఉండి అమ్ముకోవాల్సిన పరిస్థితితో అవి చనిపోయి నష్టం వచ్చేది. స్వరాష్ట్రంలో మత్స్యకారులకు ఆర్థిక చేయూత అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది. ప్రభుత్వం నూరు శాతం సబ్సిడీతో చేప పిల్లలను చెరువుల్లో వదలడంతోపాటు మత్స్యకార్మికులకు 75 శాతం సబ్సిడీతో ఆటో ఇచ్చారు. చేపలను ఆటోలో వేసుకొని గ్రామాలు, పట్టణాల్లో తిరిగి వ్యాపారం చేసుకుంటూ ఉపాధి పొందుతున్నా.
-గుడిసె రమేశ్, మత్స్యకార్మికుడు, ఈదులూరు, కట్టంగూర్
దళితుల జీవితాల్లో వెలుగులు
తమ బతుకులు ఉన్నతంగా ఉండాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రవేశపెట్టి మా జీవితాల్లో వెలుగులు నింపారు. నేను గతంలో డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగించేవాడిని. ఇప్పుడు నాకు మంజూరైన దళితబంధు యూనిట్లో బొలెరో ట్రాలీ ఆటో తీసుకున్నాను. ఒకరి దగ్గర పని చేయకుండా నా సొంత కాళ్లపై నిలబడ్డాను. నెలకు సుమారు 25 నుంచి 35 వేల దాకా సంపాదిస్తున్నా. దళితుల కోసం దళితబంధు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ సారుకు దళితులమంతా అండగా ఉంటాం.
-కొప్పుల అశోక్, జమస్థాన్పల్లి, దళితబంధు లబ్ధిదారుడు, మునుగోడు రూరల్