అలుగుపోస్తున్నవి 133.. నిండుకుండల్లా మరో 447
నల్లగొండ, జూలై 13 : అల్పపీడనం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు చెరువులు మత్తడి దుంకుతున్నాయి. బుధవారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ వర్షం పడగా, అత్యధికంగా గుండ్లపల్లిలో 12 మిల్లీమీటర్లు, అత్యల్పంగా తిరుమలగిరి(సాగర్)లో 1.3 మిల్లీమీటర్లు నమోదైంది. వదలని వర్షంతో జిల్లాలో 133 చెరువులు మత్తడి దుంకుతుండగా, మరో 447 చెరువులు నిండుకుండల్లా మారాయి.
జిల్లా వ్యాప్తంగా మిషన్ కాకతీయ కింద ఇప్పటికే 1927 చెరువులను పునరుద్ధరించడంతో ఆ చెరువుల్లోకి నీరు చేరి నిండుకుండల్లా మారాయి. వీటిలో 395 చెరువులు 25శాతం లోపు నీరు నిల్వ ఉండగా, 450 చెరువుల్లో 25 నుంచి 50 శాతం, 502 చెరువులు 50 నుంచి 75 శాతం, 447 చెరువులు 75 శాతం నుంచి 100 శాతం నీటి నిల్వలు చేరగా, 133 చెరువులు మత్తడి దుంకాయి. దాంతో ఆయా చెరువుల కింద ఆయకట్టు రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. మొత్తం 68 వేల ఎకరాల ఆయకట్టు ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
31 మండలాల్లోనూ వర్షం..
జిల్లా వ్యాప్తంగా అల్పపీడనం ప్రభావంతో బుధవారం 31 మండలాల్లోనూ వర్షం కురిసింది. గుండ్లపల్లిలో 12 మిల్లీమీటర్లు, కనగల్లో 11.3, దేవరకొండలో 10.8, చండూరులో 10.2, చిట్యాలలో 10.1, గుర్రంపోడులో 9.5, చందంపేటలో 9.3, నేరేడుగొమ్ములో 9, నకిరేకల్లో 8.7, చింతపల్లిలో 8.7, మాడ్గులపల్లిలో 7.4, కేతేపల్లిలో 7.1, నాంపల్లిలో 7.1, నల్లగొండలో 7, మునుగోడులో 6.9, మిర్యాలగూడలో 6.5, పీఏపల్లిలో 6.5, అనుములలో 6.4, పెద్దవూరలో 6.4, అడవిదేవులపల్లిలో 6.3, తిప్పర్తిలో 6.2, నార్కట్పల్లిలో 6.1, నిడమనూరులో 5.5, మర్రిగూడలో 5.4, కట్టంగూరులో 5.2, శాలిగౌరారంలో 5.1, వేములపల్లిలో 5, కొండమల్లేపల్లిలో 5, దామరచర్లలో 3.5, త్రిపురారంలో 2.7, తిరుమలగిరి(సాగర్)లో 1.3 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 218.2 మిల్లీమీటర్ల వర్షం పడగా, సగటున 7 మిల్లీమీటర్లు నమోదైంది. ఇక ఈ సీజన్లో ఇప్పటి వరకు 140.1 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా, 276.9 మిల్లీమీటర్లు కురిసి 98 శాతం అదనంగా నమోదైంది.
ఆరు గేట్ల ద్వారా మూసీ నీటి విడుదల
కేతేపల్లి, జూలై 13 : మూసీ ప్రాజెక్ట్ ఆరు గేట్ల ద్వారా బుధవారం నీటి విడుదల కొనసాగింది. 3,282.22 క్యూసెక్కుల నీరు రాగా, ప్రాజెక్ట్ 3, 4, 5, 7, 8, 10వ నంబర్ గేట్లను అడుగు మేర ఎత్తి 3,282.22 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. 53.53 క్యూసెక్కుల నీరు ఆవిరవుతుండగా, 220 క్యూసెక్కుల నీరు సీపేజ్, లీకేజీల ద్వారా దిగువకు వెళ్తుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 645(4.46 టీఎంసీలు) అడుగులు కాగా, ప్రస్తుతం 638.30(2.84 టీఎంసీలు)అడుగులుగా ఉన్నట్లు ఏఈ ఉదయ్కుమార్ తెలిపారు.
పులిచింతలకు 1,071 క్యూసెక్కుల ఇన్ఫ్లో
చింతలపాలెం, జూలై 13 : పులిచింతల ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 175(45.77 టీఎంసీలు) అడుగులకు గాను బుధవారం సాయంత్రం 6 గంటల సమాచారం మేరకు 167.616(35.0674 టీఎంసీలు)అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 1,071 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. గేట్ల లీకేజీల ద్వారా 400 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది.