ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలు గులాబీ ఖాతాలో చేరాయి. ఇంతగా అండగా నిలుస్తున్న ఉమ్మడి జిల్లా ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలువాలన్నది సీఎం కేసీఆర్ భావన. ఈ నేపథ్యంలో జిల్లాలో అభివృద్ధిని మరింతగా పరుగులు పెట్టించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తున్నది. అందులో భాగంగా గురువారం మునుగోడులో ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధిపై ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించింది. దీనికి జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి అధ్యక్షత వహించగా ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్తోపాటు మంత్రులు ప్రశాంత్రెడ్డి, దయాకర్రావు, సత్యవతిరాథోడ్ పాల్గొన్నారు.
వచ్చే ఆరేడు నెలల్లో ప్రధానమైన ఐదు శాఖల ద్వారా రూ.1,544 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా రహదారుల విస్తరణ, మరమ్మతులు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, ప్రభుత్వ భవనాలు, బ్రిడ్జిలు, చెక్డ్యామ్ల నిర్మాణం, పల్లె, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులపై దృష్టి సారించారు. ఇక జిల్లాలో పనులు జరుగుతున్న ఎత్తిపోతల పథకాలు పరుగులు పెట్టేలా దిశానిర్దేశం చేశారు. మీటింగ్లో ఎమ్మెల్యేలు చెప్పిన అంశాలపైనా అక్కడికక్కడే ఆదేశాలిస్తూ పనులు చేపట్టేలా నిర్ణయాలు తీసుకున్నారు. మరోవైపు మునుగోడు ఉప ఎన్నికలో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే చండూరును రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తూ ప్రక్రియను ప్రారంభించాలని, వంద పడకల ఆస్పత్రి నిర్మాణంపైనా దృష్టి పెట్టాలంటూ ఆదేశాలు ఇచ్చారు. ఇక చేనేత క్లస్టర్లు, గిరిజన గురుకుల పాఠశాల, బంజారాభవన్ లాంటి వాటిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మునుగోడుతోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారని, వచ్చే ఏడాది లోపు వీటన్నింటినీ పూర్తి చేసేలా చర్యలు చేపడుతామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకే సమీక్ష
2014 సంవత్సరం నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అభివృద్ధి ప్రారంభమైంది. సాగు, తాగు నీటి సమస్యను పరిష్కరించుకున్నాం. ఎనిమిదేండ్లలో జిల్లాను సస్యశ్యామలంగా మార్చుకున్నాం. పల్లె సీమలు ప్రగతిలో
పోటీ పడుతున్నాయి. సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ తీసుకొచ్చి ఫ్లోరిన్ భూతాన్ని కూకటివేళ్లతో తొలగించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీరు అందించాలనే ఆలోచన మంత్రి కేటీఆర్దే. జిల్లాలో ఇప్పటి
వరకు చేపట్టిన పనులు, చేయాల్సిన పనులను ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో తెలుసుకొని పూర్తి చేయడానికే ఈ సమీక్ష నిర్వహించాం. అందరి భాగస్వామ్యంతో అభివృద్ధి పనులను పూర్తి చేద్దాం.
– మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి
నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ.1, 544 కోట్లతో ఆరేడు నెలల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మునుగోడులో గురువారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎబ్రెల్లి దయాకర్రావుతో కలిసి మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. పల్లె, పట్టణ ప్రగతి, పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ, విద్యుత్, మిషన్ భగీరథ, రోడ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, గిరిజన సంక్షేమం, మహిళా, శిశు సంక్షేమం, నీటిపారుదల, తదితర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల మీద ప్రత్యేకంగా చర్చించారు.
అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.334 కోట్లు, రోడ్ల అభివృద్ధికి 402 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కోసం 700 కోట్లు, గిరిజన సంక్షేమం కోసం వంద కోట్లు, ఐదు విద్యుత్ సబ్ స్టేషన్లకు 8 కోట్లు.. మొత్తం రూ.1,544 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇవే కాకుండా వివిధ శాఖల ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో వేల కోట్ల రూపాయలతో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలో వంద కోట్లతో రోడ్ల అభివృద్ధి, రూ.175 కోట్లతో గ్రామీణాభివృద్ధి, తండాల అభివృద్ధికి రూ.25కోట్లు, రూ.30 కోట్లతో చండూరు మున్సిపాలిటీ, రూ.50 కోట్లతో చౌటుప్పల్ మున్సిపాలిటీని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు.
మునుగోడు నియోజకవర్గానికి అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసి, అక్కడ త్వరలో వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నట్లు, చండూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. గిరిజనులు ఎక్కువగా ఉన్న సంస్థాన్ నారాయణపురం మండలంలో గిరిజన పాఠశాలను, కోటి రూపాయలతో బంజారా భవన్ నిర్మిస్తామని తెలిపారు. దండు మల్కాపురం వద్ద వంద ఎకరాల్లో పది వేల మందికి ఉపాధి కల్పించేలా టాయ్ పార్కు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. భువనగిరితోపాటు నారాయణపరం, గట్టుప్పల్, తేరుట్పల్లిలో బ్లాక్ లెవల్ హ్యాండ్లూమ్ క్లస్టర్ల ఏర్పాటకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. నేతన్నల యార్న్పై 40శాతం సబ్సిడీ విషయంలోనూ తక్షణమే అందేలా సవరణలు చేస్తూ ఉత్తర్వులు ఇస్తామన్నారు. ఇక కొత్తగా ఐదు 33/11 కేవీ సబ్స్టేషన్లను నిర్మాణం చేయనున్నట్లు ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మునుగోడు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
ఉమ్మడి జిల్లాపై వరాల జల్లు
మునుగోడులో ఎన్నికల హామీలు అమలు
ఉమ్మడి నల్లగొండ జిల్లాపై మంత్రి కేటీఆర్ వరాల జల్లు కురిపించారు. రూ.1,544 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో మున్సిపాలిటీలకు రూ.334 కోట్లు, రోడ్లకు రూ.402 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ.700 కోట్లు, గిరిజన సంక్షేమానికి రూ. 100 కోట్లు, విద్యుత్ సబ్స్టేషన్లకు రూ.8 కోట్లు ఇవ్వనున్నట్లు చెప్పారు.
మునుగోడు నియోజకవర్గానికి భారీగా నిధులు
రూ.1,544 కోట్లలో మునుగోడు నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు రానున్నాయి. రూ.100 కోట్లు రోడ్ల అభివృద్ధికి, రూ.175 కోట్లు గ్రామీణాభివృద్ధికి, రూ.30 కోట్లు చండూరు మున్సిపాలిటీకి, రూ.50 కోట్లు చౌటుప్పల్ మున్సిపాలిటీకి కేటాయించనున్నారు.
మునుగోడులో కొత్తగా ఏర్పాటు చేయనున్నవి..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వేల కోట్లతో అభివృద్ధి
రాష్ట్రం ఏర్పాటయ్యాక ఎనిమిదేండ్లలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ జిల్లాలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ లేదని, నేడు తెలంగాణకే దిక్సూచిగా నల్లగొండ, సూర్యాపేటల్లో మెడికల్ కాలేజీలను ప్రారంభించుకున్నామని తెలిపారు. ఇటీవలే సీఎం కేసీఆర్ దామరచర్లకు వచ్చి అక్కడ నుంచి ఒక మాట చెప్పారని, మొత్తం రాష్ర్టానికి విద్యుత్ వెలుగులు అందించే జిల్లాగా నల్లగొండ రాబోయే రోజుల్లో మారనుందని చెప్పారన్నారు. భవిష్యత్లో 50, వంద ఏండ్లపాటు పెరుగుతున్న అవసరాలకు తగిన విధంగా నాలుగు వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్తుతోపాటు అదనంగా సోలార్ విద్యుత్తు అందనుందని చెప్పారు.
నేడు దేశంలోనే వరి ధాన్యం అత్యధికంగా పండిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ రెండో స్థానంలో, నల్లగొండ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని గర్వంగా చెబుతున్నామన్నారు. వ్యవసాయానికి సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతోనే నల్లగొండ జిల్లా సాగు విస్తీర్ణంలో ఘనత సాధించిందని తెలిపారు. తెలంగాణ బిడ్డలు గర్వంగా చెప్పుకొనేలా యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దామని, ప్రస్తుతం రోజుకు కోటి రూపాయలకు పైగా ఆదాయంతోపాటు 80 వేల మంది భక్తులు వస్తున్నారంటే ఆ స్థాయిలో తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్దేనన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్ల విషయం, పల్లె, పట్టణ ప్రగతిలో చేపట్టిన పనులపైనా చర్చించామని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో అమలవుతున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలను నిర్ధిష్ట గడువులోగా పూర్తి చేసేలా ఆదేశాలిచ్చినట్లు తెలిపారు.
ఎనిమిదేండ్లలో సస్యశ్యామలం : మంత్రి జగదీశ్రెడ్డి
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ కింద ఎక్కువ పని దినాలను కల్పించిన ఘనత తెలంగాణదేనని, నిధుల విడుదలలో కేంద్రం ఎన్నో అవాంతరాలను సృష్టిస్తున్నదని అన్నారు. 2014 నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అభివృద్ధి ప్రారంభమైందని, మంచినీటి, సాగునీటి సమస్యలు తీర్చుకున్నామని చెప్పారు. ఎనిమిదేండ్లలో ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేశామని, ఇంటింటికీ మంచినీరు అందించి ఫ్లోరిన్ మహమ్మారిని కూకటి వేళ్లతో తొలగించామని, ఇందుకు కృషి చేసిన కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీరు అందించాలనే ఆలోచన కేటీఆర్దని, వారు ఎంతో ముందు చూపుతో దీని మీద దృష్టి పెట్టారని అన్నారు. జిల్లాకు అన్ని శాఖల ద్వారా ఎక్కువ నిధులు అందుతున్నాయని, తద్వారా వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలను దిగ్విజయంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు.
రోడ్ల కోసం రూ.20వేల కోట్లు : మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 907 కి.మీ. సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చామన్నారు. ఉమ్మడి జిల్లాలో రూ.69.9 కోట్ల విలువైన 70 రోడ్డు పనులు టెండర్ స్టేజీలో ఉన్నాయని, మునుగోడు నియోజకవర్గంలో 136 కి.మీ. సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 40 బ్రిడ్జి పనులు పూర్తయ్యాయన్నారు. ఎనిమిదేండ్లలో రాష్ట్రం మొత్తం మీద రోడ్ల కోసం రూ.20 వేల కోట్లు, భవనాలకు రూ.5వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. చిట్యాల నుంచి రామన్నపేట వరకు రోడ్డు వెడల్పు పనులకు నిధులు మంజూరయ్యాయన్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 6,391 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తయ్యాయని, ఇందులో 880 మంది లబ్ధిదారులకు అందించామని తెలిపారు. పూర్తయిన ఇండ్లను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయాలని, అంతర్గత పనులు కూడా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
8వేల ఎకరాల పోడు భూములకు పట్టాలు : మంత్రి సత్యవతి రాథోడ్
మహిళా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటైన పంచాయతీలకు రోడ్లు వేసేందుకు ఈ సంవత్సరం బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయించినట్లు తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా మూడు గిరిజన భవన్లను కోటీ 20 లక్షలతో మంజూరు చేసినట్లు తెలిపారు. పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర సబ్ కమిటీ నియమించినట్లు తెలిపారు అర్ఓఎఫ్అర్ చట్టం వచ్చిన తర్వాత 8వేల పైచిలుకు ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ భూములకు రైతు బంధు అందిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోడు సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని, 55,763 ఎకరాలకు గాను 20,449 దరఖాస్తులు వచ్చాయని, వాటి పరిశీలన 70 శాతం పూర్తయిందని, ఇంకా 30 శాతం పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. నల్లగొండ జిల్లాలో ఆలస్యంగా పోడు భూముల పరిశీలన మొదలు పెట్టారని, త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
సీసీ రోడ్లకు రూ.209కోట్లు : మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎబ్రెల్లి దయాకర్రావు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో పీఎంజీఎస్వై కింద సీసీ రోడ్ల కోసం రూ.209 కోట్లు మంజూరు చేశామన్నారు. సీఆర్ఆర్ కింద రూ.19 కోట్లు మంజూరు చేశామని, రోడ్ల పనులు, మరమ్మతులు, పెండింగ్ పనులను పూర్తి చేయాలని చెప్పారు. రోడ్లను నష్టపరిచే కేజీ వీల్స్ను కట్టడి చేస్తూ గ్రామ పంచాయతీ సెక్రటరీలు తగిన చర్యలు తీసుకునేలా చూడాలన్నారు. తండాల నుంచి గ్రామ పంచాయతీలకు వెళ్లే లింకు రోడ్లను పూర్తి చేస్తామని తెలిపారు. ఉపాధి హామీ పనులను గ్రామ పంచాయతీ ట్రాక్టర్ల ద్వారా చేపట్టి పంచాయతీలకు ఆదాయం పెరిగేలా, ట్రాక్టర్ బకాయిలు తీర్చుకునేలా చూడాలన్నారు. చెత్తతో డంపింగ్ యార్డుల్లో ఎరువు తయారీతో గ్రామపంచాయతీల ఆదాయం పెంచుకోవాలని సూచించారు. ఎనిమిదేండ్లలో ఉమ్మడి జిల్లాలో పంచాయతీరాజ్ కింద రూ.1200 కోట్లు ఖర్చు చేశామన్నారు.
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి మాట్లాడుతూ యాదగిరిగుట్టలో మిషన్ భగీరథ గ్రిడ్ లైన్ డ్యామేజ్ అయ్యిందని, మరమ్మతులు చేపట్టాలని అన్నారు. హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో పోడు సమస్య ఉందని, పోడు దరఖాస్తులకు రసీదు ఇచ్చారని, ఎంఅర్ఓ కార్యాలయంలో ఆన్లైన్ చేయలేదని మంత్రి దృష్టికి తెచ్చారు. ఎడిట్ ఆప్షన్ ఇస్తే తిరిగి అప్లోడ్ చేస్తామని సూర్యాపేట జిల్లా కలెక్టర్ చెప్పారు. మిషన్ భగీరథ, రహదారులు, బ్రిడ్జిలు, భవనాల నిర్మాణంలో టెండర్లు, పనుల నిర్వహణపై పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. వాటన్నింటిపైనా ఎప్పటికప్పుడు అధికారులు స్పందిస్తూ చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖ మంత్రులు ఆదేశాలిచ్చారు. సమీక్షా సమావేశంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ చైర్మన్లు బండా నరేందర్రెడ్డి, ఎలిమినేటి సందీప్రెడ్డి, గుజ్జ దీపిక, ఎమ్మెల్సీలు ఎ.నర్సిరెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, పైళ్ల శేఖర్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గాదరి కిశోర్కుమార్, నల్లమోతు భాస్కర్రావు, కంచర్ల భూపాల్రెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, నోముల భగత్, కార్పొరేషన్ చైర్మన్లు దూదిమెట్ల బాలరాజుయాదవ్, రాంచందర్నాయక్, కంచర్ల రామకృష్ణారెడ్డి, కలెక్టర్లు టి.వినయ్ కృష్ణారెడ్డి, పమేలా సత్పతి, హేమంత్ కేశవ్ పాటిల్, వివిధ శాఖల రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఐదున్నర గంటలు కొనసాగిన సమీక్ష
మునుగోడు, డిసెంబర్ 1 : ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు మునుగోడు నియోజకవర్గంలో గతంలో చేపట్టిన, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో గురువారం మునుగోడులో ఐదు శాఖల మంత్రులతో నిర్వహించిన సమీక్షా సమావేశం సుమారు ఐదున్నర గంటల పాటు కొనసాగింది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11:5గంటలకు మునుగోడు చేరుకున్న మంత్రులు 11:15కు అధికారులతో సమీక్ష ప్రారంభించారు. ముందుగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో ప్రారంభించిన సమీక్ష ఒక్కొక్కరుగా మధ్యాహ్నం 2:18గంటల వరకు కొనసాగించారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, గిరిజన అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ ఆయా శాఖల అధికారులతో గతంలో చేసిన అభివృద్ధి పనులు, రానున్న రోజుల్లో చేపట్టాల్సిన పనుల వివరాలు, అందుకు అవసరమైన నిధుల అంచనాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత గంటపాటు భోజన విరామం తీసుకున్న మంత్రులు తిరిగి 3:40గంటలకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని సూచించారు. మునుగోడు ఉప ఎన్నికలో ఇచ్చిన హామీలను త్వరలో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రధానంగా రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్లు, వీధుల్లో సీసీ, డ్రైనేజీ నిర్మాణ పనుల్లో జాప్యం చేయొద్దన్నారు. ఐదున్నర గంటలు కొనసాగిన సమీక్ష సాయంత్రం 5:30గంటలకు ముగిసింది. అనంతరం మంత్రులు, ఎంపీ, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రానున్న రోజుల్లో చేపట్టే పనులపై వివరించారు. అనంతరం సాయంత్రం 6గంటలకు మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులు మునుగోడు నుంచి హైదరాబాద్కు బయల్దేరారు. ఆ సమయంలో ఫంక్షన్హాల్ వద్ద నిలబడి ఉన్న ప్రజలను చూసి మంత్రి కేటీఆర్ తన కాన్వాయ్ని ఆపి వినతి పత్రాలు స్వీకరించారు.
రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై హర్షం
ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చండూరు సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. దాంతో చండూరు ఎంపీపీ పల్లె కళ్యాణి, మునుగోడు ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్, చండూరు మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళ, నియోజకవర్గంలోని పలువురు ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలో సంస్థాన్ నారాయణపురం మండల ఇన్చార్జిగా వ్యవహరించిన మంత్రి సత్యవతి రాథోడ్ ఇచ్చిన హామీ మేరకు గిరిజన గురుకుల పాఠశాల, బంజారా భవనాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించడంతో గిరిజన నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ను సన్మాంచి కృతజ్ఞతలు తెలిపారు.
సమస్యలపై పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక నుంచి వినతిపత్రాలు ఇచ్చే పని ఉండదన్నారు. నియోజకవర్గాన్ని ఆరేడు నెలల్లో అభివృద్ధి పథంలో నడిపించడానికే ఈ సమీక్ష సమావేశమని తెలిపారు.