ఆసరా పింఛన్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 15 నుంచి నూతన పింఛన్లు అందిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొత్తగా 1,30,248 మందికి పింఛన్ రానున్నది. ఇందులో వృద్ధాప్య పింఛన్ల వయస్సును 65 నుంచి 57కు కుదించడం ద్వారా 79,882 మందికి లబ్ధి చేకూరనున్నది. ఇప్పటి వరకు జిల్లాలో 3,77,073 మందికి ఆసరా పింఛన్ అందుతుండగా కొత్తవాటితో కలిపి 5,07,231కి చేరుకోనున్నది. వీటితోపాటు డయాలసిస్ చేయించుకునే రోగులకూ ఆసరా పింఛన్ ఇవ్వనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వీరు సుమారు 700 వరకు ఉండగా రూ.14.11లక్షలు చెల్లించనున్నారు. కొత్త పింఛన్ల ద్వారా జిల్లాపై నెలకు రూ.27 కోట్లపైనే అదనపు భారం పడనున్నది. పాత, కొత్త వాటితో కలిపి మొత్తంగా ప్రతినెలా రూ.115.59 కోట్లు పింఛన్ల కోసం ప్రభుత్వం చెల్లించనుంది. కొత్త పింఛన్ల మంజూరుపై వివిధ వర్గాలతోపాటు లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నల్లగొండ, ఆగస్టు 7 : కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు అందించారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్లు ఇస్తామని ప్రకటించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో కొత్తగా 1,30,248 మందికి పింఛన్ రాబోతున్నది. దరఖాస్తులను త్వరలోనే విచారణ చేసి అర్హుల జాబితాను తయారు చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 3,77,073 మందికి పింఛన్లు అందిస్తున్నారు. కొత్తగా అందించనున్న పింఛన్లతో రాష్ట్ర ప్రభుత్వంపై సుమారు 27కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది.
నల్లగొండ జిల్లాలో 58,633 మందికి..
స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా కొత్తగా ఆసరా పింఛన్లు అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. 57 ఏండ్లు నిండిన వృద్ధులతోపాటు ఇతర సామాజిక వర్గాలకు పింఛన్ అందించాలని నిర్ణయించారు. ఈ నెల 15నుంచి పింఛన్లతోపాటు బార్కోడ్తో ఉన్న కొత్త కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు. ఇప్పటికే పింఛన్లు పొందుతున్న వారికి కూడా బార్కోడ్తో కూడిన కార్డులు ఇస్తామని చెప్పారు. అందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 58,633 మందికి నూతనంగా ఆసరా పథకం కింద పింఛన్ అందనుంది. ఇందులో 57 ఏండ్లు నిండినవారు 41,023 మంది ఉండగా.. ఆయా సామాజిక వర్గాలవారు మరో 17,610 మంది ఉన్నారు. ఇప్పటికే జిల్లాలో అన్ని వర్గాలవారు 1,70,323 మంది రూ.42.19 కోట్ల పింఛన్ పొందుంతుండగా.. కొత్తగా మంజూరయ్యే 58,633 మందికి పింఛన్లతో సర్కార్పై రూ.12.30 కోట్ల అదనపు భారం పడనుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్ల కోసం ప్రతి నెలా 2,28,956 మందికి రూ.54.50 కోట్లు చెల్లించనుంది.
ఆగస్టు 15 నుంచి అందజేత
దరఖాస్తు చేసుకున్న అర్హులకు ఈ నెల 15నుంచి కొత్త పింఛన్లు అందిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రకటించారు. గతంలో 65 ఏండ్లు నిండిన వృద్ధులకు మాత్రమే ఆసరా పింఛన్లు ఇవ్వగా.. తాజాగా 57 ఏండ్లు నిండిన వారందరికీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకనుగుణంగా అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. వారి వివరాలు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ సైట్లో ఉండగా.. వాటన్నింటికీ మంజూరు చేయనున్నారు. ప్రస్తుతం దివ్యాంగులకు నెలకు రూ.3016, ఇతరులకు రూ.2016 పింఛన్ అందజేస్తున్నారు. వృద్ధుల వయస్సును 65 ఏండ్ల నుంచి 57 సంవత్సరాలకు కుదించగా.. 50ఏండ్లు పైబడిన గీత, చేనేత కార్మికులకు పింఛన్ అందించనున్నారు. కాగా, ఇప్పటి వరకు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, గీత, నేత, బీడీ కార్మికులు, హెచ్ఐవీ, పైలేరియా, ఒంటరి మహిళలకు మాత్రమే పెన్షన్ ఇస్తుండగా.. ఇక నుంచి డయాలసిస్ పేషెంట్లకు కూడా ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. డయాలసిస్ రోగులకు పింఛన్ల కోసం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి ఎంతో కృషి చేశారు. నేడో రేపు ప్రభుత్వం నుంచి సర్క్యులర్ రానుండగా.. ఈ నెల 15నుంచి కొత్త పింఛన్లు అందజేయనున్నారు.
సూర్యాపేట జిల్లాలో 40,465 మందికి కొత్త పింఛన్లు..
సూర్యాపేట జిల్లాలో 40,465 మందికి కొత్తగా పింఛన్లు అందనున్నాయి. ఇందులో 57 ఏండ్లు పైబడినవారు 26,704 మంది ఉండగా, ఇతర సామాజిక వర్గాల వారు మరో 13,761 మంది ఉన్నారు. వృద్ధ్దాప్య పింఛన్ల కోసం 1,907 మంది దరఖాస్తు చేసుకోగా.. దివ్యాంగులు 2,032 మంది, వితంతువులు 8,631, చేనేత కార్మికులు 104, గీత కార్మికులు 596 మంది, ఒంటరి మహిళలు 491 మంది పింఛన్ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు జిల్లాలోని పింఛన్దారులకు ప్రభుత్వం నెలనెలా రూ.28,98,28,744 ఇస్తున్నది. కొత్తగా పెరుగబోయే పింఛన్లతో మరో 8,36,21,536 రూపాయల అదనపు భారం ప్రభుత్వంపై పడనుంది.
సీఎం కేసీఆర్ చరిత్రలో నిలుస్తారు..
57 సంవత్సరాలకే పింఛన్ ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో నిలుస్తారు. గతంలో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే 65 ఏండ్ల వరకు ఆగాల్సి వచ్చేది. 57 సంవత్సరాలకు పింఛన్ ఇవ్వడంతో మాలాంటి డ్రైవర్లకు ఎంతో ఆసరా అవుతుంది. ఏ విషయంలోనైనా సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోయేలా, సామాన్య, పేద ప్రజలకు ఉపయోగపడేలా ఉంటాయి. 57 సంవత్సరాలకే పింఛన్ ఇవ్వనున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– మాదిరెడ్డి అంజిరెడ్డి, డ్రైవర్, భువనగిరి
అర్హులందరికీ ఆసరా పింఛన్లు
తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన మేరకు జిల్లాలో వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఆసరా పింఛన్ అందిస్తాం. ఓటరు జాబితా ద్వారా 57 ఏండ్లు దాటిన వారి వివరాలు తెలుస్తాయి. అర్హత కలిగిన వారు స్థానిక అధికారులను సంప్రదించాలి. ఇప్పటి వరకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రతి నెలా పింఛన్ అందేలా చూస్తున్నాం. – సుందరి కిరణ్కుమార్, డీఆర్డీఓ, సూర్యాపేట
57 ఏండ్లు నిండిన వారందరికీ పింఛన్లు
ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 1.70 లక్షల మందికి ఆసరా పింఛన్లు అందుతున్నాయి. ఈ సారి 57 ఏండ్లు నిండిన వాళ్లకు కూడా ఇవ్వనుండటంతో ఆసరా లబ్ధిదారుల సంఖ్య బారీగా పెరుగనుంది. ఇప్పటికే గుర్తించిన వాళ్లలో 57 ఏండ్లు పైబడిన వారు 43వేలకు పైగా ఉన్నారు. వీరితోపాటు ఇతర సామాజిక వర్గాల వారు మరో 17వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అర్హులందరికీ పింఛన్ మంజూరు కానుంది. ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చి నిధులు, పింఛన్ మంజూరు కాగానే అందజేస్తాం.
– కాళిందిని, డీఆర్డీఓ, నల్లగొండ