కారేపల్లి, జూలై 31 : సీజనల్ వ్యాధుల నివారణ, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పంచాయతీ, వైద్య శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం కారేపల్లి మండల వ్యాప్తంగా పారిశుధ్య పనులను ముమ్మరంగా నిర్వహించారు. ఫ్రై డే డ్రై డేలో భాగంగా గ్రామాల్లో పర్యటించి మురుగు కాలువల శుభ్రత, చెత్త, పాత టైర్లు, నీటి తొట్ల తొలగింపు, దోమల నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. నివాస ప్రదేశాల్లో, చుట్టు పక్కన పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు వివరించారు. వర్షాకాలంలో అనారోగ్యాలకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను కలిసి క్రమం తప్పకుండా మందులు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో ఎం ఎల్ హెచ్ పి లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.