దృష్టి లోపాలను నివారించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా సాగుతున్నది. గ్రామాలు, పట్టణాల్లో ఏర్పాటు చేసిన శిబిరాలకు ప్రజలు తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. వైద్య సిబ్బంది ఓపికగా టెస్టులు చేసి అవసరమైన వారికి వెంటనే రీడింగ్ గ్లాసులు ఇస్తున్నారు. ప్రిస్క్రిప్షన్ అద్దాలకు ఆర్డర్ ఇచ్చి అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 9,482 మందికి పరీక్షలు చేసి 1,858 మందికి కండ్ల అద్దాలు పంపిణీ చేశారు. సూర్యాపేట జిల్లాలో 6,423 మందికి పరీక్షలు చేసి 1,398 మందికి కండ్ల జోడు ఇచ్చారు. తమ దగ్గరికే వచ్చి ఉచితంగా సేవలు అందించడంపై ప్రభుత్వానికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం సోమవారం నాలుగో రోజు జిల్లా వ్యాప్తంగా కొనసాగింది. జిల్లా కలెక్టర్ వినయ్క్రిష్ణారెడ్డితోపాటు పలువురు ప్రజాప్రతినిధలు, నల్లగొండ మున్సిపల్ కమిషనర్ కేవీ రమణాచారి కంటి వెలుగు క్యాంపులను సందర్శించి అక్కడ ప్రజలతో మాట్లాడి అందుతున్న సేవల గురించి ఆరా తీశారు.
నల్లగొండ జిల్లాలో సోమవారం 9,482 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా.. అందులో 6,524 మంది దగ్గరి, దూరపు చూపు కాకుండా ఇతర కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. 1,858 మందికి దగ్గరి చూపు అద్దాలను అందజేశారు. అందులో 317 మంది 40 సంవత్సరాల్లోపువారు, 1,541 మంది 40ఏండ్లకు పైబడిన వారు ఉన్నారు. కాగా ఇప్పటి వరకు 29,537 మందికి కంటి వెలుగు పరీక్షలు చేయగా.. అందులో పురుషులు 14,158, మహిళలు 15,377, ఇతరులు ఇద్దరు ఉన్నారు. కార్యక్రమాల్లో మెడికల్ ఆఫీసర్లు, క్యాంపు మెడికల్ ఆఫీసర్లు, క్యాంపు కోఆర్డినేటర్లు, ఆఫ్తమాలజిస్టులు, ఏఎన్ఎంలు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లాలో 6,423 మందికి పరీక్షలు
సూర్యాపేట : జిల్లాలో కంటి వెలుగుకు మంచి స్పందన వస్తున్నది. నాలుగో రోజు సోమవారం జిల్లా వ్యాప్తంగా 51 బృందాలు కంటి వెలుగు పరీక్షలు చేశాయి. మొత్తంగా 6,423 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. వారిలో పురుషులు 2,987 మంది, మహిళలు 3,436 మంది ఉన్నారు. 1,398 మందికి కళ్లద్దాలు అందజేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 18,926 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 5,356 మందికి కళ్లద్దాలు అందజేశారు. సోమవారం చివ్వెంల మండలం ఉండ్రుగొండలోని కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కంటి వెలుగు జరుగుతున్న తీరును అక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం జిల్లా కేంద్రంలోని ఎంఐఎం స్కూల్లో కంటి వెలుగు కేద్రాన్ని పరిశీలించారు.
కంటి సమస్య తీరింది
నాకు కండ్లు సరిగ్గా కనిపించకపోవడంతో చాలా సార్లు ప్రైవేటు దవాఖానలకు వెళ్లా. దాంతో చాలా డబ్బు ఖర్చు అయ్యింది తప్ప సమస్య తీరలేదు. ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమం పెట్టి మా ఊరికే డాక్టర్లు వచ్చి పరీక్షలు చేస్తున్నారని చెప్పడంతో చూపించుకుందామని పోయిన. అక్కడ పూర్తిస్థాయి పరీక్షలు చేసి కళ్లద్దాలు ఇచ్చారు. ఇప్పుడు కండ్లు బాగా కన్పిస్తున్నాయి. ఎటువంటి ఇబ్బందీ లేదు. నా సమస్యకు పరిష్కారం దొరికింది. ప్రైవేటు దవాఖానకు వెళ్తే డబ్బుల ఖర్చు తప్పితే వైద్యం అంతంత మాత్రమే. ఇటువంటి ఆలోచన చేసిన సీఎం కేసీఆర్ పది కాలాలు చల్లగా ఉండాలి.
– సుదర్శన్, కల్మల్చెర్వు, గరిడేపల్లి మండలం
పరీక్షలు చేసి కళ్లజోడు ఇచ్చిండ్రు
నాకు కొంతకాలంగా దగ్గరి అక్షరాలు సరిగా కనిపిస్తలేవు. పేపర్ చదువడం ఇబ్బందిగా ఉంది. వస్తువులు మసకగా కనిపిస్తున్నాయి. మా ఊళ్లోనే గవర్నమెంటోళ్లు కంటి వెలుగు పెట్టి అద్దాలు ఇస్తున్నరని తెలిసి పరీక్షల కోసం వచ్చిన. పరీక్షలు చేసిన వైద్యులు దగ్గరి చూపునకు అద్దాలు ఇచ్చారు. చాలా సంతోషం. డబ్బులు లేకుండా సమస్య పరిష్కారమైంది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమం బాగుంది. దూర ప్రాంతానికి వెళ్లి చూపించుకునే ఆర్థిక స్థోమత లేని వాళ్లకు ఇది ఎంతో ఉపయోగం.
– ఉల్లి సుబ్బారావు, మేళ్లచెర్వు
రూపాయి ఖర్చు లేకుండా పరీక్షలు
నేను కంటి వెలుగు పరీక్ష కేంద్రానికి వెళ్లగానే పేరు నమోదు చేసుకున్నారు. ఆలస్యం చేయకుండా వెంటనే కంటి పరీక్షలు చేశారు. పరీక్షలు అవ్వగానే కళ్లద్దాలు ఇచ్చారు. రూపాయి కూడా ఖర్చు లేకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకోవాలంటే సుమారు రూ.3వేల నుంచి నాలుగు వేల వరకు ఖర్చు వస్తుంది. ఇటువంటి కార్యక్రమాలు నిరుపేదలకు వరం.
– నూకల జానకిరాంరెడ్డి, నేరేడుచర్ల
ఇప్పుడు తేటగ కనపడుతున్నది
నాకు 65 ఏండ్లుంటయ్. కొన్ని రోజుల నుంచి దూరపు, దగ్గరి సూపు సరిగా కనపడుతలేదు. దవాఖానలో సూపెట్టుకుందామనుకుంటే చేతిలో పైసలు లేవు. కండ్ల పరీక్షలు చేయించుకుందామని గ్రామపంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన శిబిరానికి వచ్చిన. అక్కడ నా పేరు రాసుకొని లోపలికి తీసుకెళ్లి కుర్చీలో కూర్చోపెట్టిండ్రు. కొద్దిసేపటి తరువాత డాక్టరమ్మ మిషిన్లో కండ్లు పెట్టించి పరీక్షలు చేసింది. తర్వాత అద్దాలు, మందులు ఇచ్చిన్రు. అద్దాలు పెట్టుకున్నాక తేటగ కనపడుతున్నది. మా లాంటి బీదోళ్లకు కండ్ల పరీక్షలు చేసి అద్దాలు ఇచ్చిన కేసీఆర్ సార్ దేవునసోంటోడు.
– ఎల్లమ్మ, కట్టంగూర్
ఖర్చు తప్పింది.. మసక పోయింది
నాకు కండ్లు మసకగా ఉండేవి. నల్లగొండకు పోయి కంటి పరీక్షలు చేయించుకోవాలంటే ఖర్చవుతుందని వెళ్లలేదు. దీంతో కంటి పరీక్షలు చేయించుకోలేకపోతున్నా. ఇప్పుడు మా ఊళ్లోనే సర్కారు ఏర్పాటు చేసిన శిబిరం వద్ద కంటి పరీక్షలు చేయించుకున్నా. పరీక్షించడంతోపాటు ఉచితంగానే అద్దాలు కూడా ఇచ్చారు. ఇప్పుడు మసక పోయింది. పైసల ఖర్చు కూడా తప్పింది. మాలాంటి వారి కోసం పెట్టిన ఇలాంటి పథకం చాలా బాగుంది.
– వెంకటేశ్వరమ్మ, నూకలవారిగూడెం, తిప్పర్తి మండలం
సైట్ చెక్ చేసి అద్దాలు ఇచ్చారు
నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నా. నాకు ఈ మధ్య బుక్స్ రీడింగ్ చేసేటప్పుడు తొలనొప్పి వస్తున్నది. చికిత్స కోసం ప్రైవేటు దవాఖానకు వెళ్దామనుకున్నా. కానీ కాలేజీ ఉండటంతో వీలు కాలేదు. దానికితోడు ఖర్చుతో కూడుకున్న పని అవడంతో వాయిదా వేసుకుంటూ వస్తున్నా.
ఈ రోజు మా ఇంటి సమీపంలోనే కంటి వెలుగు కేంద్రంలో పరీక్ష చేయించుకున్నా. డాక్టర్లు సైట్ చెక్ చేసి అద్దాలు ఇచ్చారు. ఫ్రీగా పరీక్షలు చేసి, కళ్లజోడు ఇవ్వడం బాగుంది.
– బొమ్మిరెడ్డి మనీషా, లింగారెడ్డిగూడెం (చౌటుప్పల్ రూరల్)
కంటి చూపు మెరుగుపడింది
చూపు మసక కొడుతుండడంతో కంటి వెలుగు శిబిరానికి వెళ్లి చూపించుకున్నా. కంటి పరీక్షలు చేసి అద్దాలు ఉచితంగా ఇచ్చారు. ఇప్పుడు చూపు మెరుగుపడింది. సీఎం కేసీఆర్ ముందు చూపుతో తీసుకొచ్చిన కంటి వెలుగు కార్యక్రమంతో ఎంతో మంది పైసా ఖర్చు లేకుండానే కంటి సమస్యలకు పరిష్కారం పొందుతున్నారు.
పేదలకు వెలుగు పంచుతున్న సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు ఉచితంగా కంటి పరీక్షలు చేయించి వారి బతుకుల్లో వెలుగులు నింపుతున్నారు. నాకు కండ్ల జబ్బు వస్తే ప్రైవేటు దవాఖానకు పోయా. అక్కడ వేల రూపాయలు ఖర్చయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లోనే కంటి వెలుగు శిబిరం పెట్టడంతో కంటి పరీక్ష చేయించుకున్నా. మంచిగా చూశారు. ఉచితంగానే కళ్లద్దాలు ఇచ్చారు. పైసా ఖర్చు లేకుండా కంటి సమస్య నయమైంది.
కంటి వెలుగు పేదోళ్లకు ఎంతో మేలు
ఆటో మెకానిక్ అయిన నాకు కొన్ని నెలల నుంచి దగ్గరి చూపు సరిగా కనిపించక ఇబ్బంది పడుతున్నా. ఊళ్లో కంటి పరీక్షలు చేస్తున్నారని తెలిసి అక్కడికి పోయిన. పెద్ద మిషన్లతో అన్ని పరీక్షలు చేసిన డాక్టర్లు కళ్లద్దాలు, మందులు ఫ్రీగా ఇచ్చారు. ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది. మాలాంటోళ్ల కోసం ఇంత శ్రద్ధ తీసుకొని పరీక్షలు చేయిస్తున్న కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం. ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన కంటి వెలుగు కార్యక్రమం పేదోళ్లకు ఎంతో మేలు చేస్తుంది.