గుండాల, ఫిబ్రవరి 25 : గత కొన్ని రోజులుగా ఎండలు పెరుగడంతో రైతులకు సాగు నీటి కష్టాలు మొదలయ్యాయి. బోర్లు, బావుల్లో నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. గుండాల మండలంలోని వెల్మజాల, మాసాన్పల్లి, బ్రాహ్మణపల్లి, సీతారాంపురం, తుర్కలశాపురం, పెద్దపడిశాల, అంబాల, అనంతారం తదితర గ్రామాల్లో రైతులు గతంలో మాదిరిగానే ఈ ఏడాది యాసంగి సీజన్లో వరి పంట సాగు చేశారు. ప్రస్తుతం పంట పొట్ట దశలో ఉన్నది. బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో నీళ్లు ఆగిఆగి పోస్తున్నాయి. పొలానికి నీళ్లు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి దాపురించింది. ఈ క్రమంలో రైతులు పొలాలను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. రాత్రి వేళ సైతం వ్యవసాయ పొలాల వద్ద పడుకుని నీటిని సర్దుబాటు చేసుకుంటున్నారు. దానికి తోడు కరెంట్ సరఫరాలో పదే పదే ట్రిప్ అవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నవాబ్పేట రిజర్వాయర్ నుంచి కాల్వల ద్వారా మండలంలోని పలు గ్రామాలు సాగునీరు అందించారు. గతేడాది యాసంగిలో అన్ని చెరువులు, కుంటల్లో నీరు పుష్కలంగా ఉండడంతో భూగర్భ జలాలు పెరిగి బోర్లు, బావుల్లో నీటి లభ్యత బాగుండేది. పంటలకు ఏ ఇబ్బంది రాలేదు.
గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఎండాకాలానికి ముందస్తుగానే భూగర్భ జలాలు పడిపోయాయి. దాంతో రైతులు పంటలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. మండలంలోని బిక్కేరు వాగు పరిసర ప్రాంతాల రైతులు కొత్తగా బోర్లు వేస్తున్నారు. బావుల్లో పూడికలు తీయిస్తున్నారు.
మా ఊరిలో 4 ఎకరాలు కౌలుకు తీసుకొని వరిసాగు చేసిన. పంట పొట్టదశకు వచ్చాక నీళ్లు లేక పొలం అంతా ఎండిపోయింది. గతేడాది తీవ్రంగా ఎండలు ఉన్నా పంటలు ఎండిపోలేదు. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే బావులు, బోర్లలో నీరు లేకుండా పోయింది. ఎంత శ్రమించి వరుస తడుల ద్వారా నీటిని సర్దుబాటు చేసినా లాభం లేదు. చేసేదేమీ లేక పొట్టకొచ్చిన వరి చేనులో గొర్లను మేపుతున్నా. నవాబ్పేట రిజర్వాయర్ ద్వారా సాగునీరు అందిస్తే రైతులకు మేలు జరుగుతుంది.
నేను 5 ఎకరాల్లో వరి సాగు చేసిన. పంట పొట్టదశలో ఉన్నది. బావిలో నీరు పూర్తిగా అడుగంటిపోవడంతో పొలం పారడం లేదు. పొలం అంతా నెర్రెలు వారిపోయింది. బావిలో కొద్దో గొప్పో ఊట ద్వారా వచ్చిన నీటిని మోటర్ పెట్టిన కొద్దిసేపటికే అయిపోతున్నది. పోయిన ఏడాది నా బావి ఎండిపోలేదు. ప్రభుత్వం నుంచి పంట పెట్టుబడి డబ్బులు అందకపోవడంతో అప్పులు చేసి వరిసాగు చేసిన. ఇప్పుడు నీళ్లు లేక పంట ఎండిపోతే అప్పులపాలు కాక తప్పదు.
ఇదే సీజన్లో గతేడాదికి ప్రస్తుతం పూర్తిగా విరుద్ధంగా ఉందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం పెట్టుబడికి రైతు బంధు వేయకపోవడంతో సాగుకు వ్యాపారుల వద్ద వడ్డీకి తీసుకువచ్చి వరి సాగు చేశారు. అటు రైతుబంధు రాకపోగా ఇటు పంట పండక పోవడంతో రైతులకు అప్పులే మిగలనున్నాయి. ఇప్పటికే పలు గ్రామాల్లో పొట్టదశలో ఉన్న వరి పొలాలకు నీరందక ఎండిపోతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పంటలను పశువులు, గొర్రెలకు వదిలేస్తున్నారు. నవాబ్పేట రిజర్వాయర్ ద్వారా సాగునీరు విడుదల చేస్తే ఈ పరిస్థితి ఉండదని, వెంటనే నీరు అందించాలని రైతులు కోరుతున్నారు.