కరువు నేలకు సాగునీరు అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం సాకారమైంది. సాగునీటికి ఆమడ దూరంలో ఉన్న గుండాల మండలానికి కాళేశ్వరం జలాలు వచ్చి నాలుగేండ్లు పూర్తయ్యింది. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న ఆ మండల రైతాంగం తమ చెంతకు చేరిన జలాలను చూసి మురిసిపోతున్నారు. నాలుగేండ్లలో 4 దఫాలుగా సాగు జలాలు రావడంతో రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. 2019లో మొదటిసారిగా మండలానికి తాకిన కాళేశ్వరం గంగ వారం రోజుల క్రితం నాలుగోసారి వచ్చింది. దీనికితోడు ఇటీవల కురిసిన వర్షాలతో 36 చెరువుల్లో జలకళ సంతరించుకున్నది. దీంతో ఈ ఏడాది 25వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి.
గుండాల మండలంలో 2014కు ముందు సాగునీళ్లు లేక ఎక్కడ చూసినా ఎండిపోయిన చెరువులే దర్శనమిచ్చేది. అప్పట్లో మండల వ్యాప్తంగా 10వేల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యేది. దాంతో చాలా మంది రైతులు పనుల కోసం వలస బాట పట్టారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ సాగునీటికి ప్రాధాన్యమిచ్చి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా జనగామ జిల్లా నవాబ్పేటలో 0.5 టీఎంసీల సామర్థ్యంతో జలాశయాన్ని నిర్మించారు. అక్కడి నుంచి ప్రధాన డిస్ట్రిబ్యూటరీ కాల్వల ద్వారా ఆలేరు నియోజకవర్గంలోని గుండాల మండలానికి సాగు జలాలను అందిస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాకు సాగు జలాలు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తుర్కపల్లి, ఎం-తుర్కపల్లి ప్రధాన కాల్వలు నిర్మించింది. తుర్కపల్లి ప్రధాన కాల్వను ప్రభుత్వ విప్ గొంగిడి సునీత 2020లో ప్రారంభించారు. ఈ కాల్వలతో తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లోని 17,680 ఎకరాల ఆయకట్టుకు కాళేశ్వరం జలాలు అందుతున్నాయి. తుర్కపల్లి మండలంలోని గోపాలపురం, నాగాయిపల్లి, చిన్న లక్ష్మాపూర్, మాదాపూర్, బొమ్మలరామారం మండలంలోని బొమ్మాయిపల్లి, తిమ్మాపురం, చీకటిమామిడి, సోలిపేట, ప్యారారం గ్రామాల్లోని 14 చెరువుల్లోకి నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ఈ కాల్వ ద్వారా 1,285 ఎకరాలు సాగులోకి వచ్చాయి. ఎం.తుర్కపల్లి ప్రధాన కాల్వ ద్వారా తుర్కపల్లి మండలంలోని చిన్న లక్ష్మాపూర్, ధర్మారం, కొండాపూర్, తుర్కపల్లి(ఎం), ముల్కలపల్లి, పల్లెపహాడ్, రుస్తాపూర్, శ్రీనివాసపురం, తిరుమలాపూర్, వాసాలమర్రి, వీరారెడ్డిపల్లి, వెంకటాపురం గ్రామాల్లో 11,380 ఎకరాలు, బొమ్మలరామారం మండలంలోని చికటిమామిడి, మర్యాల గ్రామాల్లో 5,015 ఎకరాలకు సాగునీరు అందుతున్నది.
గుండాల మండలానికి కాళేశ్వరం జలాలు చేరుకుని నాలుగేండ్లు అయ్యింది. 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో తొలిసారిగా 2019 సెప్టెంబర్ 23న ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి గుండాల మండలానికి నీటిని విడుదల చేశారు. అప్పటి నుంచి విడుతల వారీగా సాగునీటిని వదులుతున్నారు. కాళేశ్వరం జలాలతోపాటు ఇటీవల కురిసిన వర్షాలకు మండలంలోని 36 చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. ఈ చెరువులు నిండటంతో 31వేల ఎకరాల ఆయకట్టుకు సాగు జలాలు అందనున్నాయి.
60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఆలేరు ప్రాంతం బీడుబారింది. చుక్క నీళ్లు లేక రైతులు వలసబాట పట్టారు. నాటి పాలకులు సాగునీటిని అందించాలన్న ఆలోచన చేయలేదు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సాగు జలాలను అందించాలన్న లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. అక్కడి నుంచి దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా నవాబ్పేట జలాశయం నుంచి ఆలేరు నియోజకవర్గంలోని గుండాలకు సాగుజలాలు వచ్చే అవకాశం ఉన్నదని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాం. జనగామ జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలను ఒప్పించి 2019లోనే గోదావరి జలాలను గుండాలకు అందించాం. ఇప్పుడా ప్రాంతం పచ్చని పైర్లతో సస్యశ్యామలమైంది. వలస పోయిన రైతులు వాపస్ వచ్చి సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. కొండపోచమ్మ సాగర్ జలాశయంలో భాగంగా నిర్మితమైన మన్నెవారి తుర్కపల్లి, తుర్కపల్లి ప్రధాన కాల్వల ద్వారా తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాలకు సాగు జలాలు అందించాం. నాలుగేండ్ల క్రితమే గుండాలకు సాగునీళ్లు అందించి సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.
మా తాతల నాటి నుంచి వ్యవసాయం చేసుకొనే బతుకుతున్నాం. మాకు 16 ఎకరాల భూమి ఉంది. గతంలో నీళ్లులేక నాలుగు ఎకరాల్లోనే సాగు చేసేది. మిగతా భూమి పడావు పెట్టేది. వ్యవసాయంపై ఆధారపడి జీవించే మేము ఆర్థికంగా ఎంతో నష్టపోయి వలసబాట పట్టాం. స్వరాష్ట్రంలో మా ఎమ్మెల్యే సునీతమ్మ పట్టుబట్టి సీఎం కేసీఆర్ సహకారంతో మా మండలానికి నీళ్లు తెచ్చారు. ఇప్పుడు దండిగ నీళ్లు అందుతుండటంతో ఏడాదికి రెండు పంటలు పండిస్తున్నాం. ప్రస్తుతం 12 ఎకరాలు సాగు చేస్తున్నాం. ఎక్కడో ఉన్న మాకొస్తాయా? అనుకున్నాం. సాగు జలాలు అందించిన సీఎం కేసీఆర్ చరిత్రలో అపర భగీరథుడిగా నిలిచిపోతారు.
కాళేశ్వరం 7వ ప్యాకేజీలో భాగంగా నిర్మించిన దేవాదుల ఎత్తిపోతల పథకంతో ధర్మసాగర్తోపాటు ఎగువ ప్రాంతాలకు నీళ్లు వస్తున్నాయి. దేవాదుల రీ ఇంజినీరింగ్ తర్వాత 415 మీటర్ల మట్టానికి ఎగువన ఉన్న భీం ఘన్పూర్, అక్కడి నుంచి పాలకుర్తి పంప్హౌస్కు నీటిని తరలించి ధర్మసాగర్ జలాశయాన్ని నింపుతున్నారు. ధర్మసాగర్ ఎగువ ప్రాంతంలోని జలాశయాలకు మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. ధర్మసాగర్ జలాశయం నిల్వ సామర్థ్యం 1.4 టీఎంసీలు కాగా, ఇది నిండిన తర్వాత ఆర్ఎస్ ఘన్పూర్ జలాశయం (1.57 టీఎంసీ) నింపుతున్నారు. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా జనగామ జిల్లాలోని నవాబ్పేట జలాశయాన్ని (0.5 టీఎంసీ) నింపుతున్నారు. ఆ జలాశయం నుంచి ఎల్26, ఎల్6 డిస్ట్రిబ్యూటరీల ప్రధాన కాల్వ ద్వారా 16 కిలోమీటర్లు ప్రవహించిన జలాలు గుండాల మండలానికి చేరుతున్నాయి.
మాకు 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంటే.. అప్పట్లో రెండున్నర ఎకరాలకు కూడా నీళ్లు అందలేదు. వరి నాట్లు వేసి వర్షం వైపు చూసేది. వర్షాలు పడక చెరువులు, కుంటలు ఎండిపోయేది. చాలా సార్లు పంట ఎండిపోయి నష్టపోయాం. ఇప్పుడా పరిస్థితి లేదు. కాళేశ్వరం జలాలతో మా చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. ఇప్పుడు 10 ఎకరాలు సాగు చేస్తున్నాం. ఇందులో 7 ఎకరాల్లో వరి, 3 ఎకరాల్లో పత్తి పంట వేశాం. ఎకరానికి 35 బస్తాల ధాన్యం దిగుబడి వస్తుంది. కాళేశ్వరం జలాలను మా గ్రామానికి వచ్చేలా కృషి చేసిన సీఎం కేసీఆర్కే మా మద్దతు.