భీమదేవరపల్లి, ఆగస్టు 9 : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఆదిమ మానవుడి ఆనవాళ్లు బయటపడ్డాయి. ముల్కనూరులోని సమ్మక్క-సారలమ్మ గద్దె సమీపంలో, శ్మశాన వాటిక సమీపంలో, కొత్తకొండలోని వద్ది గుట్ట వద్ద పరుపు బండలపై ననీన శిలాయుగపు ఆదిమ మానవుల ఆనవాళ్లు ఉన్నాయి. పరుపు బండలపై ఆదిమ మానవుడు ఉపయోగించిన నూరుడు గుంతలు కనిపిస్తున్నాయి. రాతి గొడ్డళ్లను పదును చేసుకోవడం వల్ల ఈ గుంతలు ఏర్పడుతాయి. వీటిని పురావస్తు పరిభాషలో గ్రూవ్స్ అంటారు.
ఇనుపరాతి యుగానికి ముందు మానవుడు రాళ్లతోనే గొడ్డళ్లు, కత్తి వంటి ఆయుధాలను తయారు చేసుకున్నారు. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున నూరుడు గుంతలు ఉండటంతో ఇక్కడ పెద్ద ఎత్తున రాతి పరికరాల కర్మాగారానికి కేంద్రంగా ఉండేదని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు ప్రతాప్, సిద్దమల్ల రమేశ్ తెలిపారు. చారిత్రక ఆనవాళ్లు కలిగిన ఈ పరుపు బండలు ధ్వంసం కాకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.