నల్లగొండ : దేశభక్తి ముసుగులో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని, దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు హోల్సేల్గా అమ్మేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు.
బీజేపీ మతోన్మాద, అరాచాక పాలనకు వ్యతిరేకంగా పోరాడే ప్రగతి శీల, లౌకిక, ప్రజాస్వామ్య పార్టీలతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక సీపీఎం జిల్లా కార్యాలయంలో నారి అయిలయ్య అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ పోరాటాన్ని హిందూ -ముస్లిం ఘర్షణ గా వక్రీకరించి ప్రజల్లో మతోన్మాద బీజాలు నాటేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నారని జూలకంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ వాటికి కేటాయించాల్సిన బడ్జెట్ ను దశలవారీగా తగ్గిస్తూ నష్టాల పేరుతో ప్రైవేటు వ్యక్తులకు ఉదారంగా అమ్మేస్తున్నారన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మడం కోసమే మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయడం దుర్మార్గమన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు జరపాలని, నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.