పూజలు చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి
అంబరాన్నంటే సంబురాల నడుమ నీలగిరి పుర వీధుల్లో జగన్నాథ రథ చక్రాల్ ముందుకు సాగాయి. ఇస్కాన్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన రథయాత్రలో చిన్నాపెద్ద ఉత్సాహంగా పాల్గొన్నారు. భజనలు, కోలాటాలు, సంకీర్తనలతో ఆధ్యాత్మిక శోభ ప్రభవిల్లింది. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి దంపతులు హాజరై వర్షంలోనూ రథం లాగారు.
రామగిరి, జూలై 5 : కూకట్పల్లికి చెందిన ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నల్లగొండ పట్టణంలో జగన్నాథ రథయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు. హోటల్ మనోరమ వద్ద రథానికి స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, రమాదేవి దంపతులు, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డితో ఇస్కాన్ అధ్యక్షుడు మహా శృంగదాస్ పూజలు చేయించారు. అనంతరం రథం ముందు గుమ్మడికాయ కొట్టి ఎమ్మెల్యే దంపతులు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రముఖులు రథాన్ని లాగారు. నల్లగొండలోని హైదరాబాద్ రోడ్డు, ఎన్టీఆర్ విగ్రహం, శివాజీనగర్, బస్టాండ్, గడియారం సెంటర్ మీదుగా రామగిరిలోని సీతారామచంద్రస్వామి ఆలయం వరకు రథయాత్ర నిర్వహించారు.
వర్షంలోనూ రథయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి మాట్లాడుతూ… కృష్ణ భగవానుడి దయతో సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని వేడుకున్నారు. జిల్లా ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. జగన్నాథుడి రథయాత్ర అవకాశం కల్పించిన ఇస్కాన్ ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా 21 దేశాల నుంచి వచ్చిన ఇస్కాన్ బృందం సభ్యులు చేసిన విన్యాసలు చూపరులను ఆకట్టుకున్నాయి. కోలాటం, భజన బృందం కీర్తనలతో రథయాత్ర సాగిన ప్రాంతాలు మార్మోగాయి. పట్టణవాసులు రథాన్ని లాగేందుకు పోటీపడ్డారు. కార్యక్రమంలో కౌన్సిలర్ యామా కవితాదయాకర్, ఛాయా సోమేశ్వరస్వామి ఆలయ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, తులసీనగర్ ఆలయ చైర్మన్ నేలపట్ల రమేశ్, టీఆర్ఎస్ నాయకులు, పట్టణవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.