తల్లిదండ్రులు లేని పిల్లలతోపాటు పేద బాలికలకు విద్యనందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసినవే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు. వీటిల్లో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు హాస్టల్ వసతితో రెసిడెన్షియల్ తరహాలో విద్యనందిస్తున్నారు. అయితే.. గతంలో పదో తరగతి వరకు ఉన్న కేజీబీవీలను రాష్ట్ర ప్రభుత్వం అప్గ్రేడ్ చేస్తూ వస్తున్నది. ఈ క్రమంలో వచ్చే ఏడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐదు విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ విద్యను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.
నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 56 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో 27 ఉండగా, 11 విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ వరకు విద్య అందిస్తున్నారు. ఈ సారి మరో పాఠశాల అప్గ్రేడ్ అయ్యింది. సూర్యాపేటలో 18 కేజీబీవీలు ఉండగా, నాలుగింటిలో ఇంటర్మీడియట్ విద్య అందుబాటులో ఉన్నది. ఈ పర్యాయం మరో పాఠశాల అప్గ్రేడ్ అయ్యింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 11 విద్యాలయాలు ఉండగా.. ఏడింటిలో ఇంటర్మీడియట్ విద్య అందిస్తున్నారు. ఈ సారి ఒక పాఠశాలను అప్గ్రేడ్ చేశారు.
అప్గ్రేడ్ అయిన కేజీబీవీలు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వచ్చే ఏడాది ఐదు కేజీబీవీలు ఇంటర్మీడియట్ వరకు అప్గ్రేడ్ అవుతున్నాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండ జిల్లాలో నాంపల్లి, మర్రిగూడ, మిర్యాలగూడ, సూర్యాపేటలో పెన్పహాడ్, యాదాద్రి భువనగిరి జిల్లాలో భూదాన్ పోచంపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు అప్గ్రేడ్ కానున్నాయి. దీంతో ఆయా పాఠశాలల్లో పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అదే పాఠశాలలో ఇంటర్మీడియట్ చదివే అవకాశం ఉన్నది. ప్రతి పాఠశాలలో రెండు కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఆయా పాఠశాలల్లో ఎంపీసీ, బీపీసీ, సీఈసీ, ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సులు ప్రారంభం కానున్నాయి. ఏ కోర్సులు ఏ పాఠశాలలో ప్రారంభిస్తారనేది స్పష్టత రావాల్సి ఉంది.