నల్లగొండ, ఏప్రిల్ 4: నల్లగొండ మున్సిపాలిటీలోని పానగల్లో యథేచ్ఛగా ధాన్యం దందా కొనసాగుతున్నది. అక్కడ ఇటీవల అనధికారికంగా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. సాధారణంగా అర్బన్ ప్రాంతాల్లో పీఏసీఎస్లు మాత్రమే ఈ కొనుగోళ్లు చేపట్టాల్సి ఉండగా నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి కొనుగోళ్లు చేస్తున్నారు. ఈ కొనుగోలు కేంద్రంలో ప్రైవేటు తూకం యంత్రాల ద్వారా కొనుగోళ్లు జరుపుతూ రైతుల నుంచి ధాన్యం ఎక్కువ మొత్తంలో తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. నల్లగొండ మండలంలోని చందనపల్లి, పానగల్కు చెందిన రైతులు ఆంజనేయస్వామి ఆలయం పక్కన పోయగా ఖాజీరామారం వీఓఏ ఈ ధాన్యం తూకం వేయిస్తున్నట్లు అక్కడున్న రైతులు పేర్కొంటున్నారు.
కొనుగోలు కేంద్రం అనేది సంబంధిత శాఖ ద్వారా అనుమతి తీసుకొని పట్టణాల్లో అయితే పీఏసీఎస్ల ద్వారా, గ్రామాల్లో అయితే ఐకేపీల ద్వారా కొనుగోళ్లు జరుగుతాయి. అన్నింటిని విస్మరించి చేస్తున్న ఈ దందాలో తూకం పేరుతో రైతులు బలవుతున్నారు. ఇది ఖాజీరామారం వీఓఏ ద్వారా కొనుగోళ్లు చేస్తున్నట్లు స్థానిక రైతులు తెలిపారు. పక్కనే ఆర్జాలబావిలో పీఏసీఎస్ సెంటర్ ఉండగా ఇక్కడ అనాధికారికంగా కొనాల్సిన అవసరమేంటని అర్థం కాని ప్రశ్న. ఇది డీఆర్డీఏ యంత్రాంగం కనుసన్నల్లోనే జరుపుతున్నట్లు సమాచారం. ఇక్కడ ధాన్యం ఖాజీరామారం ద్వారా ట్రక్ షీట్స్ జనరేట్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఐకేపీకి సంబంధం లేదు పానగల్లో ఐకేపీలకు సంబంధించి ఎలాంటి సబ్ సెంటర్లు ప్రారంభించలేదు. ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం రాశులు ఎవరివో తెలియదు. ఆ ధాన్యానికి మాకు సంబంధం లేదు. అయినా ఐకేపీలు పట్టణాల్లో ఏర్పాటు చేయలేదు.
– వినోద, ఏపీఎం, నల్లగొండ