తుర్కపల్లి, నవంబర్ 21 : బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే తుర్కపల్లి మండల కేంద్రంలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని బీఆర్ఎస్ ఆలేరు ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంతో పాటు గంధమల్ల, ఇందిరానగర్, బీమరిగూడెం, వీరారెడ్డిపల్లి, ఎన్జీబండల్, కొనాపురం, ఇబ్రహీంపురం, దత్తాయపల్లి, వేల్పుపల్లి, గుజ్జవాణికుంటతండా, జంగారెడ్డికుంటతండా, వెంకటాపురం, దయ్యంబండతండా, మంచిరోణిమామిళ్ల గ్రామాల్లో మంగళవారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సుధగాని హరిశంకర్గౌడ్, కల్లూరి రామచంద్రారెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ర్టాభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారన్నారు. పారిశ్రామిక ప్రగతిని గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించాలనే లక్ష్యంతో తుర్కపల్లిలోని 72 సర్వే నంబర్లో 138 ఎకరాలను సేకరించి ఇండర్స్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇండస్ట్రియల్ పార్క్ ప్రారంభమైతే నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత స్థానికంగా ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఏర్పడుతుందని వివరించారు.
కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి గోదావరి జలాలు తెచ్చి తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లో చెరువులు, కుంటలు నింపామని.. బీడుభారిన భూముల్లో గోదావరి జలాలు రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మితే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అవుతుందన్నారు. కాంగ్రెస్ నాయకులు వ్యవసాయానికి 3గంటల కరెంట్ చాలు అని రైతు బంధు తీసుకునే రైతులు బిచ్చగాళ్లు అని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామని అంటున్నారన్నారు. 24గంటల కరెంట్ ఇస్తూ రైతాంగానికి అన్ని విధాల అండగా ఉంటున్న బీఆర్ఎస్ కావాలో.. ఆహంకారపూరితంగా మాట్లాడుతున్న కాంగ్రెస్ కావాలో ప్రజలు ఆలోచించాలన్నారు. తుర్కపల్లికి కూతవేటు దూరంలో ఉన్న యాదగిరిగుట్టలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ… ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న తనను మరోసారి ఆశీర్వదించి కారుగుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ వైస్చైర్మన్ బీకునాయక్, ఎంపీపీ బూక్యా సుశీలారవీందర్, పీఏసీఎస్ చైర్మన్ సింగిరెడ్డి నర్సింహారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టు తేజస్వీనిఖిల్, సెక్రటరీ జనరల్ శ్యాగర్ల పరమేశ్, అధికార ప్రతినిధి తలారి శ్రీనివాస్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్ష, ఉపాధ్యక్షులు పోగుల ఆంజనేయులు, నామసాని సత్యనారాయణ, సర్పంచులు కల్లూరి ప్రభాకర్రెడ్డి, చాగర్ల వాణి, మహేందర్, రామోహన్శర్మ, వాణిశ్రీ, ఎంపీటీసీలు గిద్దె కర్ణాకర్, కనకలక్ష్మి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షురాలు పలుగుల ఉమారాణి, మండల మహిళాధ్యక్షురాలు శోభ, బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు ర్యాకల రమేశ్యాదవ్, సోషల్ మీడియా నియోజకవర్గ కన్వీనర్ నల్ల శ్రీకాంత్ పాల్గొన్నారు.