నీలగిరి, డిసెంబర్ 12 : ‘నల్లగొండను ఆకుపచ్చ కొండగా మార్చేందుకు పట్టణ వాసులు నడుం కట్టాలి. భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని అందించాలి. అందుకోసం ప్రతిఒక్కరూ కర్తవ్యంగా తీసుకొని మొక్కలు నాటి సంరక్షించాలి.’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నల్లగొండ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఒక్కరోజు లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, జిల్లా కలెక్టర్ టి.వినయ్కిృష్ణారెడ్డితో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాకముందు రాష్ట్రంలో అటవీ శాతం చాలా తక్కువగా ఉన్నదని, 33 శాతానికి పెంచేందుకు సీఎం కేసీఆర్ తెలంగాణకు హరితహారం కార్యక్రమం తీసుకొచ్చారని అన్నారు. దేశంలో పాలకులు అవలంబిస్తున్న విధానాల కారణంగా వాతావరణంలో కాలుష్యం పెరిగిపోయిందన్నారు.
దేశంలో ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితులు వచ్చాయని, భవిష్యత్లో విద్యార్థులు స్కూల్ బ్యాగ్లో పుస్తకాలతోపాటు ఆక్సిజన్ సిలిండర్ తీసుకు పోవాల్సిన దుస్థితి దాపురిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో చెట్లను విపరీతంగా నరికివేయడంతోపాటు కంపెనీలు కాలుష్యకారక, ఇతర మెటీరియల్ వాడడం వల్ల ఆక్సిజన్లో సగానికిపైగా కార్బన్ను పీల్చాల్సి వస్తుందన్నారు. దీని వల్ల శ్వాసకోస వ్యాధులు వస్తున్నాయని తెలిపారు. ఈ పరిస్థితిని గుర్తించిన సీఎం కేసీఆర్ తెలంగాణలో భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించేందుకు చెట్లను పెద్ద ఎత్తున పెంచే కార్యక్రమం చేపట్టారన్నారు. అందులో భాగంగా హరితహారం కార్యక్రమంలో కోట్లాది మొక్కలు నాటారని, నల్లగొండ పట్టణంలో ఇప్పటి వరకు 15.52 లక్షల మొక్కలు నాటారని చెప్పారు.
కెనడా దేశంలో ఒక్కో మనిషికి ఆరు వేలు, అమెరికాలో మూడు వేల చెట్లు ఉన్నాయన్నారు. తెలంగాణలో ప్రతిఒక్కరూ ఆరు మొక్కలు నాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని సూచించారు. చరిత్రలో ఎక్కడా లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలు, శ్మశాన వాటికలు, పార్కులు, ఆట స్థలాలు, ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నదని చెప్పారు. నల్లగొండ పట్టణాభివృద్ధికి ఎనిమిదేండ్లలో సీఎం కేసీఆర్ సుమారు రూ.1040 కోట్లు మంజూరు చేశారని తెలిపారు.
కోట్ల రూపాయలతో నల్లగొండ అభివృద్ధి : ఎమ్మెల్యే భూపాల్రెడ్డి
ఎమ్మెల్యే భూపాల్రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ పట్టణంలో 20 ఏండ్ల దారిద్య్రాన్ని, ప్రజల గోసను తీర్చామన్నారు. తలాపున ఉదయ సముద్రం ఉన్నా గతంలో వారానికి ఒక్కరోజు కూడా మంచినీరు వచ్చేది కాదని పేర్కొన్నారు. ప్రస్తుతం రోజు తప్పి రోజు మంచినీరు అందిస్తున్నామని చెప్పారు. మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి సహకారంతో రూ.18 కోట్లతో అసంపూర్తిగా ఉన్న అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టినట్లు తెలిపారు. వందలాది కోట్లతో రోడ్ల విస్తరణ, జంక్షన్ల ఆధునీకరణ, పార్కుల అభివృద్ధి, సెంట్రల్ లైటింగ్, ఐటీ హబ్, మెడికల్ కళాశాల, ఎన్జీ కళాశాలను అభివృద్ధ్ది పథంలోకి తీసుకొచ్చామన్నారు. నల్లగొండ పట్టణంలో 15 ఉన్న అటవీ శాతాన్ని ఎనిమిదేండ్లలో 33శాతానికి పెంచినట్లు తెలిపారు.
అనంతరం ఎస్ఎల్బీసీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, కలెక్టర్ టి.వినయ్కిృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ ఖుష్భూ గుప్తా, జిల్లా అధికారులు పాల్గొని మొక్కలు నాటారు. రైల్వే ట్రాక్, లోయర్ రైల్వే ఫ్లైఓవర్, రైల్వే గెస్ట్హౌజ్ వద్ద ప్లాంటేషన్ చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ కేవీ రమణాచారి అధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, కౌన్సిలర్లు అభిమన్యు శ్రీనివాస్, మారగోని భవానీగణేశ్, ఇబ్రహీం, గోగుల శ్రీనివాస్, ఎడ్ల శ్రీనివాస్, వట్టిపల్లి శ్రీనివాస్, జిల్లా అధికారులు భిక్షపతి, కోటేశ్వర్రావు, సల్మాభాను, పుష్పలత, సురేశ్బాబు, సంగీతలక్ష్మి, అటవీశాఖ సిబ్బంది, పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.