యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 14 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో ఇండ్లు, స్థలాలు, షాపులు కోల్పోయిన బాధితుల కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. వైటీడీఏ పరిధిలో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో సర్కారు అందజేసిన పరిహారంతో అత్యద్భుతమైన భవనాలను నిర్మించుకుంటూ ఆనందపడుతున్నారు. దీంతో సర్వే నంబర్ 314లో నూతన కాలనీ రూపుదిద్దుకుంటున్నది. దీంతోపాటు రోడ్డుకు ఇరువైపులా షాపులు కోల్పోయిన బాధితులకు కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో విశాలమైన షాపింగ్ కాంప్లెక్స్లను ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి ఇటీవల కేటాయించారు. పాత షాపులు, ఇండ్లు కోల్పోయిన వారికి తగినంత పరిహారంతోపాటు స్థలం, షాపులు రావడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడిన సీఎం కేసీఆర్, అండగా నిలిచిన ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు చెప్తున్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూ.1,300 కోట్లతో పునర్నిర్మించి ప్రపంచ పటంలో నిలిపింది. దేశ విదేశాల ప్రతినిధులు సైతం ఔరా అనే విధంగా స్వామివారి క్షేత్రం రూపుదిద్దుకుని భక్తులకు కనువిందు చేస్తున్నది. యాదగిరిగుట్టకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా పాతగుట్ట చౌరస్తా నుంచి వైకుంఠ ద్వారం రోడ్డు విస్తరించడంతోపాటు కొండ చుట్టూ ఆరు లైన్ల రోడ్లను నిర్మించారు. ఈ క్రమంలో పాతగుట్ట చౌరస్తా నుంచి వైకుంఠ ద్వారం వరకు, వైకుంఠ ద్వారం నుంచి గాంధీనగర్, పాత రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద అంజనాద్రి కాలనీలో సుమారు 517 మంది ఇండ్లు, 139 మంది షాపులు, స్థలాలు కోల్పోయారు.
ప్రభుత్వం వారికి స్థలానికి స్థలం, షాపునకు షాపు, ఇండ్లు కోల్పోయిన వారికి 89,91,71,656 రూపాయల నష్టపరిహారం అందజేసింది. అంతేకాకుండా వైటీడీఏ పరిధిలోని ప్రెసిడెన్సియల్ సూట్ పక్కనే సర్వే నంబర్ 314లో 169, సైదాపురం సర్వే నంబర్ 329లో 148 ప్లాట్లను అందజేశారు. సర్వే నంబర్ 119లో దేవాదాయ ధర్మాదాయ శాఖ 2వేల గజానికి సంబంధించిన నిధులను ఇవ్వలేదు. కొండ కింద ఉత్తర ప్రాంతంలో లక్ష్మీ పుష్కరిణి, కల్యాణకట్ట, నిత్యన్నదానం సత్రం, పార్కింగ్ ప్రాంతంలో షాపింగ్ కాంప్లెక్స్ను 139 మంది లబ్ధ్దిదారులకు కేటాయించారు. దీంతో లబ్ధిదారులు చేపట్టిన షాపింగ్ నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి. కార్తిక మాసంలో షాపులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతోపాటు స్థలం కోల్పోయిన వారికి గజానికి రూ.12వేల చొప్పున నష్టపరిహారం అందజేశారు. మొత్తం 69,183 గజాలకుగాను ప్రభుత్వం రూ.89,91,71,656 ఖర్చు చేసింది.
రింగురోడ్డు నిర్మాణంలో మా ఇండ్లు కోల్పోయాం. స్వామివారి కార్యం జరిగే సమయంలో మా సాయం ఉంటుందని సహకరించాం. ప్రభుత్వం మాకు నష్టపరిహారం అందజేయడంతోపాటు ప్రెసిడెన్సియల్ సూట్ పక్కనే వైటీడీఏ లేఅవుట్లో ప్లాట్లను కేటాయించింది. మౌలిక వసతులు కల్పించింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన నష్టపరిహారంతో ఇండ్లు నిర్మించుకుంటున్నాం. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నాం. సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు.
– నర్సింహగౌడ్, అంజనాద్రిపురి కాలనీ, యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం చరిత్రలో నిలిచిపోయేలా రూపుదిద్దుకున్నది. ప్రధాన రోడ్డు విస్తరణ, రింగురోడ్డు నిర్మాణంలో పట్టణవాసులు షాపులు, ఇండ్లు కోల్పోయారు. స్వామివారి కార్యంలో ఎవరూ ఇబ్బందులు పడొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం బాధితులకు అండగా నిలిచాం. ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్తో మాట్లాడి అభివృద్ధి చెందే ప్రాంతంలోనే ప్లాట్లను కేటాయించాం. వైటీడీఏ ఆధ్వర్యంలో లే అవుట్ సిద్ధం చేసి వెంటనే ఇళ్లు నిర్మించే విధంగా అభివృద్ధి చేసి ఇచ్చాం. గజం భూమి కోల్పోయిన వారికి సైతం 100, 150 గజాల స్థలాన్ని ఇచ్చాం. ప్రెసిడెన్సియల్ సూట్ పక్కన కొంత మందికి, పోలీస్ హెడ్ క్వార్టర్ పక్కన మరికొంత మందికి అందజేశాం. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది.
– గొంగిడి సునీతామహేందర్రెడ్డి, ప్రభుత్వ విప్
రింగు రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన అంజనాద్రి కాలనీ వాసులకు ప్రెసిడెన్సియల్ సూట్ పక్కనే గల సర్వే నంబర్ 314లో 12 ఎకరాలు వైటీడీఏ కేటాయించగా.. బాధితులు తమకు వచ్చిన నష్టపరిహారంతో అద్భుతమైన భవనాలను నిర్మించుకుంటున్నారు. అంజనాద్రి కాలనీగా పిలుచుకుంటున్న ఆ ప్రాంతం మరో బంజారాహిల్స్గా రూపుదిద్దుకుంటున్నది. పక్కనే ప్రెసిడెన్సియల్ సూట్, ఇటు రాజాపేట, అటు యాదగిరిగుట్ట పట్టణానికి వెళ్లేందుకు డబుల్ రోడ్డు.. కాలనీలో డ్రైనేజీలు, 40 ఫీట్ల రోడ్డు, చుట్టూ ఆహ్లాదకరమైన ప్రాంతం కావడంతో లబ్ధ్దిదారులు సంబురపడుతున్నారు. పక్కా వైటీడీఏ లే అవుట్ను తయారు చేయడంతో లబ్ధిదారులు వెంటనే నిర్మాణాలు ప్రారంభించారు.
ప్రధాన రోడ్డు విస్తరణలో షాపులు కోల్పోయిన 139 మంది లబ్ధిదారులకు ఇటీవలే ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు. కొండ కింద ఉత్తర ప్రాంతంలో లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట, నిత్యన్నదాన సత్రం, పార్కింగ్ ప్రాంతంలో షాపింగ్ కాంప్లెక్స్ను 25 ఫీట్ల వెడల్పు, 40 ఫీట్ల పొడవుతో నిర్మించగా పనులు పూర్తయ్యాయి. కార్తిక మాసంలో షాపులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.