– మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి
– సూర్యాపేటలో బీఆర్ఎస్ రోడ్ షో గ్రాండ్ సక్సెస్
సూర్యాపేట, ఫిబ్రవరి 09 : మాయ మాటలు నమ్మి మరోసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మరింత గోస పడుతమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో పట్టణమంతా గులాబీమయంగా మారింది. తాళ్లగడ్డ నుంచి ప్రారంభమైన రోడ్ షో కోర్టు చౌరస్తా, పూల సెంటర్, పి ఎస్ ఆర్ చౌరస్తా, రాఘవ ప్లాజా, వాణిజ్య భవన్ సెంటర్, శంకర్ విలాస్, గాంధీ విగ్రహం, కొత్త బస్టాండ్ వరకు కొనసాగింది. అక్కడే ఏర్పాటు చేసిన వేదికపై మాజీ మంత్రి ప్రసంగించారు. కేసీఆర్ అన్నట్టుగానే మళ్లీ 2014కు ముందు రోజులోచ్చినయన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనతో ప్రజలకేం లాభం జరిగిందో అందరూ ఆలోచన చేయాలన్నారు. సీఎం, ఆయన మంత్రి వర్గమంతా దోచుకునే పనిలో పడ్డరని, మంత్రుల మధ్య సఖ్యత లేక ఒకరి బండారం ఒకరు బయట పెట్టుకుంటున్నట్లు తెలిపారు. వాళ్లల్లో పంపకాల పంచాయితే కాదు.. రాసలీలల పంచాయితీలు పెట్టుకోవడం మరీ నీచం. ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారులపై కూడా అబండాలు వేస్తున్నారని, అడ్డు అదుపులేని అరాచకాలతో రాక్షసానందం పొందుతున్నరని దుయ్యబట్టారు.

‘మరోసారి కాంగ్రెస్కు ఓటేస్తే మరింత గోసపడతం’
సూర్యాపేటకు మంజూరైనా నిధులు వెనక్కి పంపిన దుర్మారం కాంగ్రేస్ ప్రభుత్వానిదేన్నారు. స్పోట్స్ స్కూల్, స్టేడియం ఆధునీకరణకు రూ.25 కోట్లు, మహిళా పాలిటెక్నిక్ కళాశాల, హాస్టల్ భవనాలకు రూ.25 కోట్లు. భానుపూరి కళా భారతి ఏర్పాటుకు రూ.50 కోట్లు. సీఎం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ రూ.50 కోట్లు. స్కిల్ డెవలప్మెంట్కు రూ.25 కోట్లు ఇలా కోట్లాది రూపాయలను వెనక్కి పంపిన పాపం కాంగ్రెస్ ది అన్నారు. ప్రజల పట్ల, అభివృద్ధి పట్ల కాంగ్రెస్ నాయకులకు ఎంత సోయి ఉందో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చన్నారు.
మార్పు తెస్తామన్న కాంగ్రెస్ 2014 కు ముందున్న మార్పు మాత్రం తెచ్చిందన్నారు. వాళ్లు పెంచిపోసించేది దోమలు, పందులు, రౌడీయిజమే అన్నారు. 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలవుతాయానే నమ్మకం పోయిందన్నారు. అరాచక కాంగ్రెస్ ను నమ్మి అభివృద్ధి చేసే కేసీఆర్ను వదులుకున్నరన్నారు. కాంగ్రెస్ మాయమాటలు నమ్మి ఓటేస్తే ఒరిగిందేమి లేదని ప్రజలు తెలుసుకున్నరన్నారు. కాంగ్రెస్ అంటే కరువు, కష్టాలే అని ప్రజలకు అర్థమైందన్నారు. అభివృద్ధి కుంటుపడింది, కనీసం చెట్లకు నీళ్లుపొసే దిక్కులేదు. అరాచక కాంగ్రెస్ కు తగిన బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

‘మరోసారి కాంగ్రెస్కు ఓటేస్తే మరింత గోసపడతం’
మరోమారు మోసపోకుండా ఓటు అనే ఆయుధంతో సరైన సమాధానం చెప్పాలన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుందన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు సరైన బుద్ది చెప్పిండ్రు. సూర్యాపేట ప్రజలు చాలా చైతన్యవంతులు. అన్ని వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి మరొమారు చైతన్యాన్ని చాటాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు. అందుకు మీ చేతిలో ఉన్న ఓటే సరైన ఆయుధం అని, కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని పేర్కొన్నారు.

‘మరోసారి కాంగ్రెస్కు ఓటేస్తే మరింత గోసపడతం’