నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి16(నమస్తే తెలంగాణ) : సర్వజనుల ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు కంటి వెలుగు పథకాన్ని తెచ్చింది. జనవరి 19 నుంచి జూన్ 15 వరకు 100 రోజుల కార్యక్రమంగా చేపట్టిన ఈ పథకాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య, ఇతర శాఖల అధికారులు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. జిల్లాలోని 31 మండలాల్లో 844 గ్రామ పంచాయతీలు, 8 పురపాలికల్లోని 182 వార్డుల్లో 18 ఏళ్ల పైబడిన వారు 7,90,000 మందికి కంటి పరీక్షలు చేయనున్నారు. ఇందుకోసం 74 బృందాలు, ఓ బఫర్ బృందంతో కలిపి 75 బృందాలతో ఒక్కో బృందంలో 10 మందిని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఆదేశించిన మరుసటి రోజు నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రణాళికలు తయారు చేయడమే కాకుండా వాటిని అమలు చేయడం, నిరంతర పర్యవేక్షణ, రోజువారి సమీక్షలు, విశ్లేషణ, వీడియో కాన్ఫరెన్స్, సమావేశాలతో ఎప్పటికప్పుడు లోటుపాట్లు సవరించుకుంటూ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూచనలతో జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, వైద్య ఆరోగ్యశాఖతో పాటు అన్ని శాఖల అధికారులు పూర్తిస్థాయిలో భాగస్వాములై కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
దగ్గరిచూపు సమస్యలే అధికం..
జిల్లాలో అధికంగా దగ్గరి చూపు కనిపించక ఇబ్బందిపడే వారే అధికంగా ఉన్నట్లు శిబిరాలలో నమోదవుతున్న లెక్కలు చెబుతున్నాయి. 40 ఏళ్ల వయస్సు పైబడిన చాలా మందికి దగ్గర చూపు కనిపించడం లేదని శిబిరానికి వస్తున్నారు. ఇలాంటి వారికి తక్షణమే రీడింగ్ గ్లాసెస్ అందజేస్తున్నారు. జనవరి 19 నుంచి ఫిబ్రవరి 15 వరకు జిల్లా వ్యాప్తంగా 1,80,529 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో మహిళలు 87,822 మంది, పురుషులు 92,707 మంది ఉన్నారు. కంటి పరీక్షలు నిర్వహించి 29,200 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేశారు. అలాగే ప్రిస్క్రిప్షన్ అద్దాలు 18,780 మందికి అవసరం కాగా వారికి తగిన విధంగా అద్దాలు తయారు చేయించి ఇవ్వనున్నారు. ఇప్పటికే 2,135 ప్రిస్క్రి ప్షన్ అద్దాలు జిల్లాకు రాగా పంపిణీ చేయడం జరుగుతోంది. సాధారణ కంటి సమస్యలతో 79,742 మంది ఉన్నారు. కాటరాక్ట్ 22,247 మందికి, కార్నియా 2,250 మందికి, మెల్లకన్ను 603 మందికి, పేటరీజియం 12,291 మందికి, వక్రీభవన లోపంతో 46,593 మంది బాధపడుతున్నారు. ఇవి కాకుండా కంటి సమస్యలతో వస్తున్న 81,391 మందికి చుక్కల మందులతో పాటు విటమిన్ ఏ, డీ, బీ కాంప్లెక్స్ టాబ్లెట్లు పంపిణీ చేస్తున్నారు. 50 ఏళ్లు పైబడిన వారు అత్యధికంగా మోతబిందు (కాటరాక్ట్) సమస్యతో బాధపడుతున్నారు. శస్త్ర చికిత్స అవసరమైన వారికి చికిత్స చేసే సమయాన్ని సెల్ఫోన్కు సమాచారం చేరవేరుస్తామని చెబుతున్నారు. ఇదివరకే శస్త్ర చికిత్స పూర్తై ఇతర సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్యులు సలహాలు, సూచనలు అందజేస్తున్నారు.
75 బృందాలతో శిబిరాలు
కంటి శిబిరానికి వచ్చిన ప్రతి వ్యక్తి వివరాలను డీఈఓ, ఏఎన్ఎంలు ట్యాబ్ ద్వారా ఎప్పటికప్పుడు డేటా నమోదు చేస్తున్నారు. దూరదృష్టి, దగ్గరి దృష్టికి సంబంధించిన పరీక్షలు చేస్తున్నారు. కంట్లో శుక్లాలు ఉన్నాయా? ఇన్ఫెక్షన్లు ఉన్నాయా? అనే విషయాలను పరిశీలిస్తున్నారు. ఒకవేళ శుక్లాలు ఉంటే అప్టోమెట్రిస్ట్ ఆధ్వర్యంలో కంప్యూటరైజ్డ్ పరీక్షలు చేస్తున్నారు. సాధారణ దృష్టి లోపాలను గుర్తిస్తే అక్కడికక్కడే రీడింగ్ గ్లాసెస్ ఇస్తున్నారు. ముందస్తుగానే 51,249 అద్దాలు సిద్ధం చేసి పెట్టడంతో ఎక్కడా అద్దాలు, మందుల కొరత రావడం లేదు.
రోజుకు 120 నుంచి 150 మంది
పురపాలిక వార్డుల్లో, గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన కంటి శిబిరాలకు స్థానికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఒక్కో శిబిరంలో రోజుకు 120 నుంచి 150 మంది పరీక్షల కోసం వస్తున్నారు. శని, ఆదివారం సెలవు కావడంతో సోమవారం రద్దీ అధికంగా ఉంటుంది.
కంటి వెలుగుకు విశేష స్పందన..
కంటి వెలుగు శిబిరాలకు విశేష స్పందన వస్తున్నది. రూపాయి ఖర్చు లేకుండా కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు, కళ్లద్దాలు ఇస్తుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పైసల్లేక దవాఖానకు వెళ్లలేదని కొందరు, కుటుంబ సభ్యులు పట్టించుకోక చూపించుకోలేదని మరికొందరు చెబుతున్నారు. కానీ ఇప్పుడు తమ ఊరికే వచ్చి ఉచితంగా పరీక్షలు చేస్తుండడంతో సంతోష పడుతున్నారు. కేసీఆర్ సారు పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకే కంటి వెలుగు పథకం తెచ్చారని, తమ కళ్లలో కొత్త కాంతులు నింపుతున్నారని ఆనంద బాష్పాలు రాలుస్తున్నారు. సీఎం సారు మేలు మరువలేమనీ, సారు సల్లంగుండాలె అంటూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
పేదలకు వరం
గ్రామాల్లో కంటి సమస్యలతో ఎంతోమంది సతమతమవుతున్నారు. అలాంటి వారికి సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన కంటి వెలుగు పథకం వరంగా మారింది. కంటి పరీక్షలకు జనం భారీగా తరలివస్తున్నారు. ఆర్థిక సమస్యలతో ఆస్పత్రులకు వెళ్లలేని ఎంతో మందికి ఈ కేంద్రాల ద్వారా ఉచితంగా మం దులు, అద్దాలు అందుతున్నాయి. అవసరం ఉన్న వారికి ఆపరేషన్లు చేసేందుకు ఎంపిక చేస్తున్నారు. కంటి పరీక్షలు చేయించుకున్న నాకు కూడా కంటి అద్దాలు వచ్చాయి.
– కొలను సునీతావెంకటేశ్గౌడ్, ఎంపీపీ, చిట్యాల
బహుత్ అచ్చా హై..
కంటి వెలుగు పథకం బహుత్ అచ్చా హై. ఉపాధి కోసం ఇక్కడికి వచ్చి పరిశ్రమల్లో పని చేస్తున్నాం. చూపు సరిగ్గా కనబడనందున మా పరిశ్రమలో పనిచేసే కార్మికులతో కలిసి ఇక్కడకు వచ్చాం. డాక్టర్లు కంటి పరీక్షలు చేసి దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించి ఉచితంగా కళ్లద్దాలు ఇచ్చారు. గతంలో కంటే ఇప్పుడు చూపు స్పష్టంగా కనిపిస్తున్నది. సీఎం కేసీఆర్ చేపట్టిన ఈ పథకంతో మాలాంటి పేదలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.
– మహమ్మద్ నసీం, శ్యామ్చంద్ర వలస కూలీలు, ఉత్తరప్రదేశ్
పేదలకు ప్రయోజనకరం
నేను వృత్తిరీత్యా డ్రైవర్. కండ్లు చూయించుకునేందుకు వైద్య శిబిరానికి వచ్చాను. డాక్టరు కండ్లను పరీక్ష చేసి అద్దాలు ఇచ్చారు. ఇప్పు డు చూపు మంచిగా కనబడుతున్నది. దిక్కు, దీము లేనోళ్లకు పైసా ఖర్చు లేకుండా మందులు, అద్దాలు ఉచితంగా ఇస్తున్నారు.
– చీమల లింగస్వామి, వెలిమినేడు
ప్రజల నుంచి విశేష స్పందన
కంటివెలుగుకు గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గ్రామంలో మా లక్ష్యం 2,450 మంది ఉండగా 2,057 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించి, 306 మందికి రీడింగ్ అద్దాలు పంపిణీ చేశాం. అలాగే 191 మందికి ప్రి స్క్రిప్షన్ అద్దాల ను ఇచ్చేందుకు ఆర్డర్ చేశాం. ఎక్కువగా కాటరాక్టు సమస్యతో 348 మంది, టెరిజీయం సమస్యతో 119 మంది బాధపడుతున్నారు. వీరికి శస్త్ర చికిత్సలు అవసరమని గుర్తించారు.
– డాక్టర్ ఉబ్బు నరసింహ, పీహెచ్సీ వైద్యాధికారి, వెలిమినేడు