ఉప ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ మునుగోడు నియోజకవర్గ రాజకీయం మరింత వేడెక్కుతున్నది. ఇప్పటికే ప్రచారంలో ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందనతో టీఆర్ఎస్ మరింత దూకుడును కొనసాగిస్తున్నది. అందులో భాగంగా సీఎం కేసీఆర్ సభకు సిద్ధమైంది. ఆదివారం మధ్యాహ్నం 3గంటలకు చండూరు మండలం బంగారిగడ్డలో సభ కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది. సభకు పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చేందుకు సిద్ధమవుతుండగా అందుకనుగుణంగా ఏర్పాట్లపై దృష్టి సారించారు. సభ ఏర్పాట్లను శుక్రవారం మంత్రులు జగదీశ్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు పరిశీలించి తగు సూచనలు చేశారు. సభ నిర్వహణ, ఏర్పాట్లను పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్28(నమస్తే తెలంగాణ) : మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆదివారం చండూరు మండలానికి రానున్నారు. బంగారిగడ్డ వద్ద ఆ పార్టీ ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగసభ ప్రారంభం కానున్నది. ఈ సభలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ నేరుగా చండూరుకు చేరుకోనున్నారు. కేసీఆర్ రాక కోసం సభా ప్రాంగణం సమీపంలోనే ముందస్తుగా హెలిప్యాడ్ను సైతం సిద్ధం చేస్తున్నారు. బంగారిగడ్డ నుంచి చండూరు వచ్చే దారిలో రోడ్డుకు కుడి వైపున ఉన్న విశాల స్థలంలో సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సభా స్థలాన్ని చదును చేయడంతోపాటు వేదిక నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి.
గ్యాలరీల వారీగా బారికేడ్లను సైతం సిద్ధం చేస్తున్నారు. ఇక సభాస్థలికి నలువైపుల నుంచి ప్రజలు తరలిరానున్న నేపథ్యంలో వాహనాల పార్కింగ్కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు అవసరమైన స్థలాలను ఇప్పటికే గుర్తించారు. సభా స్థలానికి కొద్ది దూరంలోని పార్కింగ్ ఏరియాల్లోనే వాహనాలను నిలిపి ప్రజలు అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేలా జాగ్రత్తలు తీసుకోనున్నట్లు తెలిసింది. మరోవైపు ఇప్పటికే నెల రోజులకు పైగా సాగుతున్న ప్రచారంలో టీఆర్ఎస్కు విశేషమైన స్పందన వస్తున్నది. గ్రామగ్రామాన సబ్బండ వర్గాల ప్రజలు టీఆర్ఎస్కు జై కొడుతున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపధ్యంలో నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ సభకు కూడా వేలాది మంది ప్రజలు తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే ఎంపీటీసీ స్థానాల వారీగా పార్టీ ఇన్చార్జీలు సభకు విస్తృత ప్రచారం కల్పించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రతి ఆవాసం నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
సభపై సర్వత్రా ఆసక్తి
సీఎం కేసీఆర్ పాల్గొననున్న సభపై మునుగోడు నియోజవర్గంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగానూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓ వైపు మునుగోడు అభివృద్ధిపై కేసీఆర్ ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారన్న దానితోపాటు రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే సంచలనంగా మారిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బీజేపీని ఎలా ఏకిపారేస్తారన్న దానిపైనా అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఇప్పటికే బీజేపీ విధానాలపై పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రకటించిన కేసీఆర్, ఈ సభ ద్వారా ఏమి చెప్పబోతున్నాడన్న చర్చ కూడా జోరుగా సాగుతుంది. మోదీ సర్కారుపై కేసీఆర్ విధానపరమైన పోరాటాన్ని ఎదుర్కోలేక బీజేపీ రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారును అస్థిర పర్చాలని బీజేపీ చేస్తున్న కుట్రలు ఇప్పటికే బట్టబయలయ్యాయి. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ దూతలు సాగించిన చర్చల ఆడియో టేపులు సైతం శుక్రవారం వెలుగు చూడడంతో బీజేపీ కూల్చుడు కుట్రల రాజకీయాలపై ప్రజలు భగ్గుమంటున్నారు. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న అభివృద్ధి, సంక్షేమ సర్కారును కూల్చివేసేందుకు చేస్తున్న బహిర్గతమైన కుట్రల నేపథ్యంలో సీఎం కేసీఆర్ సభ జరుగుతుంది. ఈ నేపథ్యంలో బంగారిగడ్డ సభ వేదికగా కేసీఆర్ ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు స్పందిస్తూ.. ఈ సభకు అంత్యంత ప్రాధాన్యం ఉంటుందన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఎలా వచ్చింది? దాని వెనక ఉన్న బీజేపీ కుట్ర కోణం ఏంటి? దానికి కొససాగింపుగా బీజేపీ చేస్తున్న ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రలు? తదితర అనేక అంశాలపై కేసీఆర్ ఈ సభ ద్వారా ప్రజలకు వివరిస్తారని తక్కెళ్లపల్లి రవీందర్రావు వివరించారు. ఇప్పటికే మునుగోడులో టీఆర్ఎస్ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని, కేసీఆర్ సభకు కూడా అదే స్థాయిలో తరలివచ్చేందుకు ప్రజలు సన్నద్ధం అవుతున్నారని చెప్పారు.
పాదయాత్రల ద్వారా సభాస్థలికి..
బంగారిగడ్డ చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు సభకు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఐదారు కిలోమీటర్ల పరిధిలోని జనమంతా తమ గ్రామాల నుంచి పాదయాత్రల ద్వారా బయల్దేరి సభా ప్రాంగణానికి చేరుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. తమ అభిమాన నేత, సంక్షేమ సారథి కేసీఆర్ మీద అభిమానం ప్రదర్శించేందుకు తమకు ఇదొక మంచి సందర్భమని సమీప గ్రామాల ప్రజలు భావిస్తున్నారు. చండూరు మున్సిపాలిటీతోపాటు సమీప గ్రామాల నుంచి ప్రజలు నడుచుకుంటూ నేరుగా సభకు చేరుకోనున్నట్లు తెలిసింది.