మోతె, ఆగస్టు 19: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతున్న పేద లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందించాలని, ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులను సకాలంలో చెల్లించి పేదలను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశా రు. బుధవారం మండలంలోని మామిళ్లగూడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీల అమలులో జాప్యం చేస్తూ వస్తోందని విమర్శించారు. ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైందని, క్షేత్రస్థాయిలో పథకాల అమలు కనిపించడం లేదని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, అయితే దళారులు, కాం ట్రాక్టర్లు అక్రమంగా ఇసుకను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. మోతె మండలం విభళాపురంలో 102 మంది లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణం చేపట్టారని, అప్పు చేసి నిర్మాణాలు కొనసాగిస్తున్నప్పటికీ బిల్లులు సకాలంలో అందలేదన్నారు.
దీంతో వడ్డీలు చెల్లిస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కోదాడ ఎమ్మెల్యేకు రిబ్బన్ కటింగ్ కార్యక్రమాలు, రీల్స్ మీద ఉన్న శ్రద్ధ పేదల సమస్యల పరిష్కారంపై ఎందుకు లేదని ప్రశ్నించారు. మోతె మండలం లో 22 ఎల్ కెనాల్ డిజిటలైజేషన్ పనుల పేరుతో రూ. ఐదు వేల కోట్ల నిధులు మంజూరు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించిందని, అయితే క్షేత్రస్థాయిలో పనులు ముందుకు సాగడం లేదన్నారు. రూ. ఐదు వేల కోట్ల నిధులు మంజూరు చేశామని, చెబుతున్న ప్రభుత్వం అందులోని ఎన్ని నిధులు విడుదల చేశారో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. భూసేకరణ పూర్తయిందా.. భూములు కోల్పోయిన రైతులను నష్టపరిహారం చెల్లించారా..ప్రాజెక్టు పనులు ఎంత వరకు పూర్తయ్యాయి. అనే విషయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆరె లింగారెడ్డి, మైనంపాటి శ్రీనివాస్రెడ్డి, వెంకటేశ్, వీరస్వామి, శేషగిరి, నాయిని ఎంకన్న పాల్గొన్నారు.