రామగిరి , మార్చి 24 : వసంత రుతువు ఆగమనం మనసుల్లో ఉత్సాహమే కాదు.. ప్రకృతిలో సరికొత్త సొగసులు కూడా తెస్తుంది. ఎండిన చెట్లు చిగురించి పువ్వులతో పాటు కొమ్మలు కనువిందు చేస్తాయి. మల్లెలు విరబూస్తు సువాసనలు వెదజల్లుతాయి. ప్రకృతిలోని అందాలన్నీ ఆవిష్కరించే వసంత రుతువు ప్రవేశించిన తర్వాత జరుపుకొనే తొలి వేడుక హోలీ. ఇంద్రధనస్సులోని రంగులు ఒకచోట కుప్ప పోసినట్లు అందంగా, ఆహ్లాదంగా రంగోళిని చిన్న, పెద్ద తేడా లేకుండా జరుపుకొనే వేడుక ఇది. సోమవారం హోలీ సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేడుకకు చిన్నా, పెద్ద సిద్ధం చేసుకున్నాడు.
ఆదివారం రాత్రి కాముని దహనం చేశారు. ఆటపాటలతో యువత ఉత్సాహంగా గడిపారు. హోలీలో రసాయనాలకు బదులు సహజ సిద్ధంగా లభించే రంగులను వాడడం శరీరానికి మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. వసంత కాలంలో మోదుగు చెట్లు విపరీతంగా పూస్తాయి. జిల్లా ప్రజలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. పచ్చని చిగురులతో కొత్తదనం సంతరించుకొని, వినూత్నంగా పున:ప్రారంభమయ్యే ప్రకృతి కాలచక్రానికి హోలీ పండుగ స్వాగతం పలుకుతుందని వారు చెప్పారు. ప్రేమ, ఆప్యాయత, సౌభ్రాతృత్వానికి ప్రతీక అయిన రంగుల పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు.