హాలియా: సాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఈ నెల 2న గ్రామగ్రామాన జెండా పండుగ నిర్వహించాలని సాగర్ నియోజక వర్గ ఎమ్మెల్యే నోముల భగత్ కోరారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్య కర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2001 లో ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ 13 సంవత్సరాల్లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించిందన్నారు. 2014 నుంచి నేటి వరకూ గడిచిన ఏడేండ్లలో తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనన్నారు.
రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 20 సంవత్సరాల కాలంలో తెలంగాణలోని ప్రతి మూలకు పార్టీని విస్తరించడం జరిగిందన్నారు. దేశంలో రూ.60లక్షల సభ్యత్వం కల్గిన ఏకైక ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ అన్నారు. నాగార్జునసాగర్లో టీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉందన్నారు.
ఈనెల 2 నుంచి 12వరకు గ్రామ కమిటీలు, 12 నుంచి 20 వరకూ మండల కమిటీలు ఆ తర్వాత జిల్లా కమిటీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు 51 శాతం రిజర్వేషన్లు కల్పించడం జరుగుతుందన్నారు. పార్టీలో క్రమశిక్షణతో పనిచేసిన వారికి విధేయతకు పార్టీ పదవుల్లో అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. సమావేశంలో జెడ్పీ వైస్ చైర్మ న్ ఇరిగి పెద్దులు, జెడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్పర్పన్ వెంపటి పార్వతమ్మ శంకరయ్య, మండల పార్టీ అధ్యక్షులు కూరాకుల వెంకటేశ్వర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.