పాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలు, మండలాలు, గ్రామపంచాయతీలను ఏర్పాటుచేసిన లక్ష్యం నెరవేరుతున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయంలో పని పడితే మండల కేంద్రానికో, జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం కొత్త మండలమైన అడవిదేవులపల్లిలో స్థానిక ఎమ్మెల్యే భాస్కర్రావుతో కలిసి మండలి చైర్మన్ సుపరిపాలన దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో మారుమూల గ్రామాలు, తండాలు సైతం ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టాలని కోరారు. విపక్ష నాయకుల మాయ మాటలు విని మోసపోతే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరవుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే భాస్కర్రావు మాట్లాడుతూ ఒక్క అడవిదేవులపల్లి మండలానికే 575కోట్ల రూపాయలను మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్ది అని కొనియాడారు.
– అడవిదేవులపల్లి, జూన్ 10
అడవిదేవులపల్లి, జూన్ 10 : ప్రజలు సుపరిపాలన చేసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రజలకు అన్నీ అందుబాటులో ఉండేలా నూతన జిల్లాలు, మండలాలను ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో శనివారం ఏర్పాటు చేసిన తెలంగాణ సుపరిపాలన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్వపరిపాలనలో రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో ప్రజలు ఆలోచించాలన్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ చేపట్టని దున్నపోతుల గండి ప్రాజెక్ట్కు రూ.220 కోట్లు కేటాయించిందని, పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి వినూత్న పథకాలు ప్రజలకు అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. హరితహారం కార్యక్రమం చేపట్టి ప్రతి పల్లెను, పట్టణాన్ని హరితవనంగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు.
ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు మాట్లాడుతూ రైతుబంధు పథకం కింద 9 సీజన్లలో 500 మందికి రూ.54 కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు.
రైతుబీమా పథకం కింద 82 మంది రైతులకు రూ.4.10 కోట్లు, ఆసరా పింఛన్ల కింద 2,375 మందికి రూ.44 కోట్లు, కల్యాణలక్ష్మి కింద 648 మందికి రూ.6 కోట్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల రూపంలో 490 మంది లబ్ధిదారులకు రూ.3 కోట్లు పంపిణీ చేసినట్లు గుర్తుచేశారు. సాధారణంగా 30 నుంచి 40 వేల జనాభా ఉంటేనే నూతన మండలం ఏర్పాటు చేశారని, అలాంటిది 13వేల జనాభా ఉన్నప్పటికీ అడవిదేవులపల్లిని మండలంగా ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. ప్రభుత్వం ప్రజలకు అన్నీ అందుబాటులో ఉంచిందని, వాటిని అధికారులు, ప్రజాప్రతినిధుల సాయంతో సక్రమంగా వినియోగించుకోవాలని కార్యక్రమంలో ఎంపీపీ ధనావత్ బాలాజీనాయక్, జడ్పీటీసీ కుర్ర సేవ్యానాయక్, తాసీల్దార్ దేశ్యానాయక్, ఎంపీడీఓ మసూద్ షరీఫ్, మండల వైద్యాధికారి ఉపేందర్, ఏఓ అర్చన, అంగన్వాడీ సూపర్వైజర్ నాగమణి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కొత్త మర్రెడ్డి, మాజీ ఎంపీపీ కూరాకుల మంగమ్మ, కో ఆప్షన్ సభ్యుడు షేక్ బాబు జానీ, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు సూర్యానాయక్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.