కేతేపల్లి, ఏప్రిల్ 26 : గతంలో వేసవి వచ్చిందంటే మండల పరిధిలోని పలు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఉండేది. చెరువులు, కుంటల్లో నీరు కనిపించని పరిస్థితి. దాంతో భూగర్భజలాలు అడుగంటి చేతిపంపులు, బోరుబావులు ఎండిపోయేవి. ప్రధానంగా మూసీ ఆయకట్టేతర గ్రామాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉండేది. గత వానకాలంలో కురిసిన భారీ వర్షాలకు ఏఎమ్మార్పీ, మూసీ కాల్వల ద్వారా మార్చి చివరి వరకూ నీటి సరఫరా కొనసాగింది. దాంతో గతానికి భిన్నంగా ఈ ఏడాది మండలంలోని చెరువులు పూర్తిస్థాయిలో నిండి జలకళను సంతరించుకున్నాయి. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏఎమ్మార్పీ కాల్వల ద్వారా ఆరు నెలలుగా నిరంతరాయంగా నీటిని సరఫరా చేయడంతో ఆయా గ్రామాల పరిధిలోని చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి.
మండలంలోని 16 గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు 23 చెరువులు, కుంటలున్నాయి. ప్రస్తుతం ఇవన్నీ నిండి ఉండటంతో ఆయా గ్రామాల ప్రజలకు వేసవిలో తాగునీటి ఇబ్బంది ఏమాత్రం లేదు. గతంలో వేసవిలో మూసీ ఆయకట్టు పరిధిలోని గ్రామాలైన బొప్పారం, కొత్తపేట, చీకటిగూడెం, ఉప్పలపహాడ్, కొప్పోలు, తుంగతుర్తి, భీమారం, చెర్కుపల్లి గ్రామాల్లోని చెరువులు మూసీ నీటితో నిండుకుండల్లా ఉండేవి. ఆయకట్టేతర గ్రామాలైన గుడివాడ, ఇప్పలగూడెం, కొర్లపహాడ్, ఇనుపాముల, బండపాలెం, కొండకిందిగూడెం, కేతేపల్లి గ్రామాల్లోని చెరువుల్లో మాత్రం నీళ్లు ఉండేవి కాదు. దాంతో ఆయా గ్రామాల్లోని ప్రజలు, మూగజీవాలు తాగునీటికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ప్రైవేట్ వ్యక్తులు బోర్లు, బావులను లీజుకు తీసుకొని ఆయా గ్రామాల ప్రజలకు తాగునీటిని సరఫరా చేసేవారు. ప్రస్తుతం చెరువుల నిండా నీళ్లు ఉండడంతో తాగు, సాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేదు. దీనికితోడు మిషన్ కాకతీయ ద్వారా చెరువులు, కుంటలను బలోపేతం చేయడంతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి బోర్లు, బావుల్లోనూ నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. దాంతో ఆయా గ్రామాల ప్రజలు, రైతులు హర్షం వ్యక్త చేస్తున్నారు.
తాగు, సాగునీటికి ఇబ్బంది లేదు
గతంలో వేసవి వచ్చిందంటే మా గ్రామంలోని చెరువు పూర్తిగా ఎండిపోయేది. దాంతో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడేవారు. ఈ సారి మార్చి వరకూ ఏఎమ్మార్పీ కాల్వల ద్వారా నీరు రావడంతో ప్రస్తుతం చెరువు నిండా నీళ్లు ఉన్నాయి. తాగు, సాగునీటికి ఇబ్బందులు లేవు.
– కట్ట శ్రవణ్కుమార్, సర్పంచ్, గుడివాడ