ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా సోమవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకొని తరించారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ చరిత్రలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి అలోల్ల ఇంద్రకరణ్రెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. నమో వేంకటేశాయ..నమో నారాయణాయ స్మరణతో ఆలయాలు మార్మోగాయి. యాదాద్రి ప్రధానాలయంలో అధ్యయనోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఉదయం వైకుంఠనాథుడిగా, మధ్యాహ్నం లక్ష్మీనరసింహస్వామిగా, సాయంత్రం మత్స్యావతారంపై విష్ణుమూర్తిగా అలంకరించారు.
– రామగిరి, జనవరి 2
ముక్కోటి ఏకాదశి వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించారు. వైష్ణవాలయాల్లో స్వామివారు ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున 5గంటల నుంచే భక్తులు ఆలయాలకు చేరుకున్నారు. దాంతో ఆలయాలు కిటకిటలాడాయి. పరమశివుడికి పంచామృతాలతో రుద్రాభిషేకం చేశారు. అనంతరం ఉత్సవమూర్తుల ఊరేగింపు నిర్వహించారు. మరో వైపు ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఆయా దేవాలయాల్లో తిరుప్పావై ప్రవచనాలు చేశారు.
– రామగిరి, జనవరి 2