యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 22 : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి తిరుకల్యాణ బ్రహోత్సవాల్లో భాగంగా స్వామివారి అలంకార సేవోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. స్వామివారి నిత్యపూజా కైంకర్యం జరిగిన అనంతరం స్వామిని సర్వాంగ సుందరంగా శ్రీమన్నారాయణుడి పూర్వఅవతారం శ్రీకృష్ణావతారం(మురళీకృష్ణుడు)గా అలంకరించారు. మెడలో స్వర్ణ, వజ్ర, ముత్యాల ఆభరణాలు.. చేతిలో పిల్లనగ్రోవి.. ఒంటిపై పట్టుపీతాంబరాలు.. సుగంధ పరిమళ పుష్పాలతో అలంకరించిన దివ్య మంగళ రూపులో సకల జనావళిని సమ్మోహనం చేస్తూ నారసింహుడు శ్రీకృష్ణావతారం(మురళీకృష్ణుడు)లో భక్తులకు దర్శనమిచ్చారు.
నారసింహుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అయిదో రోజు ఆదివారం ఉదయం 10.30 గంటలకు పెండ్లి కుమారునిగా ముస్తాబైన స్వామివారు శ్రీకృష్ణాలంకారంలో దర్శనమిచ్చారు. స్వామివారికి నిత్యపూజా కైంకర్యం యధావిధిగా జరిగిన అనంతరం ఆలయ ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, ఉప ప్రధానార్చకులు, అర్చక బృందం, పారాయణికులు అంత్యంత వైభవంగా వేతమంత్ర పఠనాలు, మూలమంత్రం, మూర్తి మంత్ర హోమాలు జరిపారు. సర్వాంగ సుందరంగా మురళీకృష్ణుని అలంకారంలో నారసింహుడిని తీర్చిదిద్దారు. సంగీతం, సాహిత్యం, శాస్త్రం, వేదం, నాదం వంటి వైదృశ్యాలతో స్వామివారి మహోత్సవం, ప్రధానాలయ తిరుమాడవీధుల్లో స్వామివారి ఊరేగింపు సేవ అత్యంత వైభవంగా చేపట్టారు. పంచసూక్తాలు, ఉపనిషత్తులు రుత్వికులు పఠిస్తుండగా ఆలయ తిరుమాడవీధుల్లో స్వామివారి సేవ ఊరేగింది. అలంకార విశిష్టతను ప్రధానార్చకులు వెంకటాచార్యులు వివరించారు.
లోక కల్యాణార్థం అవతరించిన శ్రీమహా విష్ణువు వివిధ రూపాల్లో దివ్య వాహన సేవలు అందుకుంటున్నాడు. రాత్రి ప్రధానాలయంలో స్వామివారి నిత్యకైంకర్యాల అనంతరం ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, ఉప ప్రధానార్చకులు, అర్చక బృందం, పారాయణికులు స్వామివారిని అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి భవానీ శంకర్, కలెక్టర్ హనుమంతరావు, డీఈవో దోర్బల భాస్కర్ శర్మ, ఆలయ ప్రధానార్చకులు కాండూరి వేంకటాచార్యులు, భట్టర్ సురేంద్రాచార్యులు ఆలయ ఉప ప్రధానార్చకులు, అర్చకులు, సహాయ కార్యనిర్వహణాధికారి తదితరులు పాల్గొన్నారు.