తుంగతుర్తి, ఏప్రిల్ 15 : ఐకెపి కేంద్రాలలో త్వరగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వరి కోతలు మొదలై పది రోజులు అవుతుందని, రైతులు వడ్లు తెచ్చి ఐకెపి కేంద్రాల్లో పోశారని తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఇంకా కొన్ని గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదన్నారు. రానున్న రోజుల్లో అకాల వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా ఉన్నదని కాబట్టి రైతులు ఇబ్బంది పడకుండా వెంటనే మిల్లులు కేటాయించి బస్తాలు పంపి త్వరగా లారీలు మిల్లుల వద్ద దిగుమతి అయ్యే విధంగా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా నాయకుడు గుండగాని రాములు గౌడ్, మండల నాయకులు తునికి సాయిలు, గోపగాని రమేష్, గోపగాని వెంకన్న, భాస్కర్ పాల్గొన్నారు.