రాష్ట్ర విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ హరిత
నల్లగొండ రూరల్, జూలై 1: మన ఊరు- మన బడి, మన బడి-మనబస్తి కార్యక్రమం కింద గ్రౌండింగ్ పూర్తి చేసిన పాఠశాలల అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర విద్యా జాయింట్ సెక్రటరీ హరిత అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్లో శుక్రవారం అధికారులు, ఎస్ఎంసీ చైర్మన్లు, సర్పంచులు, ఇంజినీరింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను పరిశీలించడానికి పర్యటించినట్లు తెలిపారు. ఎస్ఎంసీ చైర్మన్లు, ప్రజాప్రతినిధుల సహకారంతో పనులు సమర్థవంతంగా జరుగుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి అన్ని హంగులతో పాఠశాలలను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జిల్లాలోని పాఠశాలల్లో జరుగుతున్న పనుల్లో ఎక్కడైనా ఇసుక కొరత ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఇంజినీర్లను ఆదేశించారు. పనుల పురోగతి నివేదికలు ఎప్పటికప్పుడు పంపిచాలని డీఈఓను ఆదేశించారు. సమావేశంలో విద్యాశాఖ అదనపు డైరెక్టర్ రమణకుమార్, స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రమేశ్, డీఈఓ భిక్షపతి, పీఆర్ఈఈ తిరుపతయ్య పాల్గొన్నారు.
మన ఊరు-మన బడితో పాఠశాలల సమగ్రాభివృద్ధి
కట్టంగూర్ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో పాఠశాలలు సమగ్రాభివృద్ధి చెందుతాయని రాష్ట్ర విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ హరిత అన్నారు. మన-ఊరు మనబడి కార్యక్రమంలో ఎంపికైన కట్టంగూర్లోని అంబేద్కర్నగర్ ప్రాథమిక, దుగినవెల్లి ఉన్నత పాఠశాలలను శుక్రవారం కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి సందర్శించారు. పాఠశాలల్లో చేపట్టిన పనులను పరిశీలించి విద్యార్థులు, ఉపాధ్యాయులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలల్లో మరుగుదొడ్లు, విద్యుత్, తాగునీటి సరఫరా, ఫర్నిచర్, మరమ్మతులు, కిచెన్ షెడ్డు, నూతన తరగతి గదులు, డైనింగ్ హాల్స్, డిజిటల్ విద్య అమలు తదితర 12 అంశాలపై పనులను విద్యా కమిటీ ద్వారా చేపడుతున్నట్లు తెలిపారు. పనుల్లో నాణ్యత పాటించే విధంగా చర్యలు చేట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీఈఓ భిక్షపతి, ఎంఈఓ మేక నాగ య్య, ఎంపీడీఓ పోరెళ్ల సునీత, తాసీల్దార్ దేశ్యానాయక్, ఎంపీఓ మహ్మద్ అథర్ పర్వేజ్, డీఈ శైలజ, ఏఈ నర్సయ్య, హెచ్ఎంలు వీరారెడ్డి, ఇందిరాదేవి, ఎస్ఎంసీ చైర్మన్ పేరపాక రవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఫుట్బాల్ క్రీడాకారులకు సత్కారం : కలెక్టర్
నల్లగొండ రూరల్, జూలై 1: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీల్లో రాణించడం జిల్లాకే గర్వకారణమని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ఫుట్బాల్ అసోసియేషన్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు ఆధ్వర్యంలో అండర్-17 జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీల్లో రాణించిన క్రీడాకారిణులు కలెక్టర్ రాహుల్ శర్మను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో పోటీల్లో రాణించిన ఫుట్బాల్ క్రీడాకారులైన నల్లగొండ జేబీఎస్ పాఠశాలకు చెందిన తిరుమల శిరి, నడిగూడెం గురుకులానికి చెందిన మహేశ్వరీని శాలువాలతో ఘనంగా సత్కారించి అభినందించారు. కార్యక్రమంలో ఫుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఫాల్గుణ, కోచ్లు ప్రకాశ్, లింగయ్యనాయక్, కరుణాకర్, గురుకుల రీజినల్ కోఆర్డినేటర్ అరుణకుమారి, ప్రిన్సిపాళ్లు విజయలక్ష్మి, ఖుర్షీద్ పాల్గొన్నారు.