టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి
భువనగిరి అర్బన్, జూలై 5 : దేశ ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి సాదాగా వచ్చి.. సీదాగా వెళ్లిపోయాడని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి వస్తున్న మోదీ రాష్ర్టానికి నిధులు ప్రకటిస్తాడని తెలంగాణ ప్రజలు భావించారన్నారు. రాష్ర్టానికి ఇవ్వాల్సిన నిధులు సమావేశంలో ప్రకటించకుండా, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని చెప్పారని, రాష్ర్టానికి ఏమి ఇవ్వాలో మోదీ మరిచిపోయారని ఎద్దేవా చేశారు.
మోదీ తో రాష్ర్టానికి ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజలకు శ్రీరామరక్షగా ఉంటున్నాడని పేర్కొన్నారు. గత 8 ఏండ్లలో ప్రజలు ఆశించిన దానికన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, వీటి ద్వారా అన్నివర్గాల ప్రజలు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. దేశంలో నూతనంగా ఏర్పడిన రాష్ట్రం కేసీఆర్తో అభివృద్ధి చెందుతుందన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణలో జరిగిన అభివృద్ధి మచ్చుకైనా జరుగలేదని, ఒకవేళ జరిగితే నిరుపించాలని సవాల్ విసిరారు. బీజేపీ నాయకులు చెప్పే కాకమ్మ కథలను రాష్ట్ర ప్రజలు వినే పరిస్థితిలో లేరన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ మూడోసారి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, జడ్పీటీసీ బీరు మల్లయ్య, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు రచ్చ శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
జిల్లాలో పామాయిల్ సాగుకు అనుమతి
మంత్రి జగదీశ్రెడ్డికి కంచర్ల కృతజ్ఞతలు
మోత్కూరు : యాదాద్రి జిల్లాలో పామాయిల్ సాగుకు అనుమతి లభించిందని ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ మేరకు కృషి చేసిన మంత్రి జగదీశ్రెడ్డిని హైదరాబాదులోని మంత్రి క్వార్టర్లో మంగళవారం కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ.. జిల్లాలో 6 వేల ఎకరాల్లో సాగుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఇందు కోసం 4 లక్షల పామాయిల్ మొక్కలను పెంచుతున్నట్లు తెలిపారు. ఆయన వెంట మోత్కూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మందడి రామకృష్ణారెడ్డి, రైతులు ఉన్నారు.