నల్లగొండ, సెప్టెంబర్ 4 : ప్రతి ఏడాది వానకాలంతో పాటు యాసంగిలో రైతులు పండించిన ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసి అనంతరం ఎఫ్సీఐకి అందజేస్తున్నది. ఈ ధాన్యాన్ని మిల్లర్లు మర ఆడించి సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) రూపంలో ఎఫ్సీఐకి ఇస్తారు. ఈ సారి బియ్యం కొనుగోలు విషయంలో తొలి నుంచి కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఎఫ్సీఐ ధాన్యం కొనుగోళ్లలో కొర్రీలు పెడుతున్నది. జిల్లాలో 2020-21 యాసంగి, 2021-22 వానకాలం సీజన్లకు సంబంధించిన బియ్యం మిల్లర్ల నుంచి తీసుకొని ఎఫ్సీఐకి సివిల్ సప్లయ్ శాఖ సీఎంఆర్ను పెట్టాల్సి ఉండగా ఎఫ్సీఐ కొర్రీల కారణంగా ఆలస్యమైంది. ఒకానొక తరుణంలో కేంద్రం ఆదేశాల మేరకు 40 రోజుల పాటు ఎఫ్సీఐ కొనుగోళ్లు నిలిపివేసింది.
ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితో కేంద్రం సీఎంఆర్ సేకరించమని ఎఫ్సీఐకి సూచనలు చేస్తూ ఆగస్టు 31 గడువు విధించింది. అయితే మిల్లర్లను జిల్లా అధికార యంత్రాంగం ఒత్తిడి చేసి సీఎంఆర్ తీసుకొచ్చే పనిలో పడగా ఎఫ్సీఐ మాత్రం పలు కారణాలతో తిరస్కరణ చేస్తూ మిల్లర్లను నష్టపరిచినప్పటికీ 2020-21యాసంగి సీజన్కు సంబంధించిన సీఎంఆర్ను మాత్రం అధికార యంత్రాంగం గడువు (ఆగస్టు 31,2022) లోపు పూర్తి చేయగలిగింది. 2022-21 వానకాలం సీజన్కు సంబంధించి మొత్తంగా 4.53లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా 3.03 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించాల్సి ఉంది. అందులో ఇప్పటి వరకు 71శాతం సేకరణ పూర్తి కాగా ఇంకా 88 ,740 మెట్రిక్ టన్నుల బియ్యం పెండింగ్లో ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు..కేంద్రం తలొగ్గి ఎఫ్సీఐ ద్వారా సేకరణకు ఈ నెల 30 వరకు అవకాశం ఇచ్చింది.
మిల్లింగ్లో నష్టం భరిస్తూ..
2020-21 యాసంగి ధాన్యం కొనుగోలు చేసి 16 నెలలు కాగా… 2021-22 వానకాలం ధాన్యం కొనుగోలు చేసి 10 నెలలు అవుతున్నది. ఈ నేపథ్యంలో 2020-21యాసంగి ధాన్యం రంగు మారి కొంత మేరకు దెబ్బతిన్నది. దాంతో పాటు వర్షాల కారణంగా కూడా కొంత మేరకు మొలక వచ్చింది. ఈ ధాన్యాన్ని ఇప్పటి దాక కొనుగోలు చేయకుండా తాత్సారం చేసిన నేపథ్యంలో క్వింటా ధాన్యం మర ఆడిస్తే మూడు నుంచి ఐదు కిలోల వరకు తక్కువ తూకం వచ్చినప్పటికీ… ప్రస్తుతం తవుడు, పొట్టు, నూకలకు కాస్త ధర బాగానే ఉన్నందున ఆ నష్టం అందులో పూడ్చుకోవచ్చు అనుకోని మిల్లింగ్ చేసి అదికారుల సూచన మేరకు యాసంగి సీఎంఆర్ పూర్తి చేశారు. అయితే ఇదే సమస్య 2020-21 వానకాలం రా రైస్ సీఎంఆర్ విషయంలోనూ పునరావృతం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నది ఎఫ్సీఐ.
ఒక్క లోడుతో రూ.20వేల నుంచి రూ.30వేల నష్టం
2020-21 వానకాలానికి సంబంధించిన రా రైస్ మిల్లర్ల నుంచి ఇంకా 88,740 వేలు (39శాతం) రావాల్సి ఉంది. ఈ బియ్యాన్ని గత నెల 31 వరకు ఎఫ్సీఐకి పూర్తి స్థాయిలో పెట్టాలని కేంద్రం నిబంధన విధించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి నేపథ్యంలో ఈ నెల 30 వరకు గడువు పెంచారు. ఈ నేపథ్యంలో జిల్లా పౌరసరఫరాల శాఖ యంత్రాంగం నిత్యం మిల్లులను సందర్శించి పెండింగ్ ఉన్న మిల్లర్లు గడువు లోపల సీఎంఆర్ పూర్తి చేయాలని పురమాయిస్తున్నారు. మిల్లర్లు సైతం ధాన్యం మిల్లింగ్ చేసి పోర్టిఫైడ్ రైస్ను ఎఫ్సీఐకి పెడుతున్నప్పటికీ అక్కడ అనేక కొర్రీలతో తిరస్కరిస్తున్నది .ఎఫ్సీఐ యంత్రాంగం. అయితే మిల్లరు ఒక్కో లోడును ఎఫ్సీఐకి తీసుకెళ్ల్లాలంటే…మిల్లులో లోడింగ్, లారీకి రోజుకు రూ.10 వేలు, ఎఫ్సీఐలో దింపింనందుకు ఖర్చు చేసిన తర్వాత అధికారులు తిరస్కరిస్తే మళ్లీ ఆ బియ్యాన్ని లోడింగ్ చేసుకోని మిల్లుకు తీసుకెళ్లాలి. దీనికి మొత్తంగా సుమారు రూ.20నుంచి రూ.30వేల వరకు ఖర్చు అవుతుండడంతో తిరస్కరిస్త్తారేమోనని మిల్లర్లు జంకి సీఎంఆర్ పెట్టడానికే ఇష్టపడడం లేదు.
పలు కారణాలతో కొర్రీలు..
సీఎంఆర్ సేకరణలో ఎప్పుడూ లేనంతగా ఎఫ్సీఐ ఈ సారి అనేక కొర్రీలతో మిల్లర్లు, అధికార యంత్రాంగానికి చుక్కలు చూపించింది. కర్నెల్స్( పోషక విలువలు కలిగిన గింజలు)…కస్టమ్ మిల్లింగ్ రైస్లో కలిపి ఎఫ్సీఐకి పోర్టిఫైడ్ రైస్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నిబంధన. క్వింటా బియ్యంలో కిలో కర్నెల్స్ (పోషక విలువలు కలిగిన గింజలు)ను ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తున్న సమయంలో కలపాల్సి ఉంది. ఈ కర్నెల్స్ గుజరాత్ నుంచి దిగుమతి అవుతున్నాయి. మిల్లింగ్ చేసే సమయంలో మిల్లర్లు కర్నెల్స్ కలుపుతున్నప్పటికీ ఎఫ్సీఐ యంత్రాంగం టెస్టింగ్ చేసే సమయంలో అవిక నిపించకపోతే కర్నెల్స్ ఎఫ్సీఐకి తెచ్చిన బియ్యాన్ని తిరస్కరించి వెనక్కి పంపిస్తున్నారు. దాంతో పాటు బస్తాలు పాడై పోయాయని, చినిగి పోయాయని, బియ్యం నాణ్యంగా లేవనే సాకులు చూపిస్తూ తిరస్కరిస్తున్నారు. ఇప్పటి దాక ధాన్యం కొనుగోలు చేయమని మొండిగా చెప్పిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో స్వీకరణ ప్రారంభించినప్పటికీ ఎఫ్సీఐ ద్వారా కొనలేక పలు కొర్రీలు పెడుతూ బియ్యం సేకరణలో నిర్లక్ష్యం చేస్తున్నది.
గడువు లోపు లక్ష్యాన్ని పూర్తి చేస్తాం
2020-21 యాసంగి సీజన్కు సంబంధించిన సీఎంఆర్ను గత నెల 31 వరకే పూర్తి చేశాం. అదే ఏడాదికి సంబంధించి వానకాలం సీజన్ సీఎంఆర్ను ఈ నెల 30 వరకు ఇవ్వాలని ఎఫ్సీఐ గడువు పెట్టింది. దీనికి అనుగుణంగా పెండింగ్లో ఉన్న 88వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించే విధంగా చర్యలు చేపడుతున్నాం. అంతేకాకుండా 2021-22 యాసంగి సీజన్కు సంబంధించిన బాయిల్డ్ రైస్ను కూడా 88వేల మెట్రిక్ టన్నులు తీసుకుంటామని ప్రకటించిన నేపథ్యంలో దీంతో పాటు ఈ ఏడాది యాసంగి బియ్యం కూడా సేకరిస్తున్నాం. మిల్లర్లు నిత్యం సీఎంఆర్ను ఇవ్వడానికే ఎక్కువ సమయం మిల్లింగ్ చేస్తున్నారు. గడువులోపల లక్ష్యాన్ని పూర్తి చేస్తాం.
-వెంకటేశ్వర్లు, జిల్లా సివిల్ సప్లయ్ శాఖ అధికారి, నల్లగొండ