సూర్యాపేట, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలోనే రెండో అతిపెద్దదిగా పేరొందిన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు సొంత రాష్ట్రంలో నిధుల వరద పారుతోంది. నాటి పాలకులు పట్టించుకోక పోవడంతో ఉమ్మడి రాష్ట్రంలో జాతరకు వచ్చే భక్తులు అసౌకర్యాల నడుమ అవస్థలు పడేవారు. ఉమ్మడి రాష్ట్రంలో అనాదిగా జరిగిన జాతరలన్నింటికీ కలిపి కూడా 2014 తరువాత జరిగిన ఒక్క జాతరకు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసినన్ని నిధులు ఇవ్వలేదని యాదవ పెద్దలు చెబుతున్నారు.
అబ్బుర పడేలా అభివృద్ధి
తెలంగాణ ఏర్పాటు అనంతరం లింగమంతుల స్వామి గట్టుపై భక్తులు అబ్బురపడేలా సకల సౌకర్యాలు కలుగుతున్నాయి. మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జాతరకు కోట్లాది రూపాయలు విడుదల చేస్తున్నది. రాష్ట్రం ఏర్పాటు అనంతరం 2015 ఫిబ్రవరిలో మొదటి జాతర జరుగగా భక్తులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు మంత్రి జగదీశ్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ను ఒప్పించి సీఎం స్పెషల్ డెవల్మెంట్ ఫండ్ నుంచి రూ.2.10కోట్లు విడుదల చేయించారు. 2017 జాతరను మరింత వైభవంగా నిర్వహించేదుకు రూ.1.29 కోట్లు, 2019లో జాతరకు రూ.1.75 కోట్లు, 2021లో రూ.2కోట్లు తీసుకువచ్చారు. తాజాగా మరో రూ.5 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.
భక్తులకు సకల సౌకర్యాలు
మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో నిధులు భారీగా వస్తుండడంతో పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు శాశ్వత సౌకర్యాలు పెద్దఎత్తన జరిగాయి. పాత గుడి స్థానంలో కొత్తగా గుడి నిర్మాణం పూర్తి చేసి గుట్టపైన ఫ్లోరింగ్ వేశారు. గట్టు పైవరకు ప్రత్యేకంగా భగీరథ పైప్లైన్ ఏర్పాటు చేసి లక్ష లీటర్ల నీటి కెపాసిటీ కలిగిన ట్యాంక్ నిర్మించారు. మంగలి వారి కోసం శాశ్వత నిర్మాణాలు, ఈఓ కార్యాలయం, భారీ గెస్ట్ హౌస్ నిర్మించారు. భక్తుల సౌకర్యార్థం గుట్ట చుట్టూ నీటి సంపులు, నల్లాలు ఏర్పాటు చేసి భగీరథ నీటిని అందిస్తున్నారు. ప్రత్యేకంగా విద్యుత్ సబ్ స్టేషన్, విద్యుత్ లైన్లు, గుట్ట వద్దకు వెళ్లేందుకు ఉన్న రెండు రహదారులను సీసీలుగా మార్చారు. అన్నింటికీ మించి గుట్ట పక్కన ఉన్న పాత కోనేరును రాష్ట్రంలోనే అతి పెద్దదిగా, ప్రత్యేక ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఇటీవల జాతర నిర్వహణ కోసం జరిగిన సమీక్ష సమావేశంలో పెద్దగట్టును ఆనుకొని ఉన్న చెరువును మినీట్యాంక్బండ్గా తీర్చిదిద్దుతానని మంత్రి జగదీశ్రెడ్డి హామీ ఇచ్చారు. రూ. 50 లక్షలతో యాదవ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయించేందుకు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ హామీ ఇచ్చారు. దాంతో గట్టు మరింత అభివృద్ధి చెందనున్నది.
మంత్రి కృషితోనే రూ.5కోట్ల నిధులు
మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కృషితోనే పెద్దగట్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 కోట్లు కేటాయించిది. రాష్ట్రం ఏర్పాటు నుంచి లింగమంతుల స్వామి ఆలయానికి కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్న ఘనత మంత్రికే దక్కుతుంది. జాతరకు భారీగా నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్కు, సహకరించిన మంత్రి జగదీశ్రెడ్డికి జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు. ఈ నిధులతో భక్తులకు సకల సౌకర్యాల కల్పన సాధ్యమవుతుంది.
– పోలెబోయిన నర్సయ్య యాదవ్, ఉమ్మడియజిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ మాజీ చైర్మన్
స్వరాష్ట్రంలో పెద్దగట్టు ప్రాశస్త్యం పెరిగింది
మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో కోట్లాది రూపాయల నిధులు రావడంతో ఎవరూ ఊహించని రీతిలో పెద్దగట్టు ఆలయం అభివృద్ధి చెందింది. దాంతో లింగమంతుల స్వామి ప్రాశస్త్యం మరింతగా పెరిగింది. యాదవుల ఆరాధ్యదైవమైన లింగమంతుల స్వామికి రెండేండ్లకోసారి జరిగే జాతరకు స్వరాష్ట్రంలోనే భక్తుల తాకిడి పెరిగింది. లక్షలాదిగా భక్తులు తరలి వచ్చినా వారికి ఇబ్బందులు కలుగకుండా సకల సౌకర్యాలు కల్పించడంతో సంతోషంగా దైవదర్శనం చేసుకొని వెళ్తున్నారు.
– కోడి సైదులు యాదవ్, లింగమంతుల స్వామి ఆలయ చైర్మన్