నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఒక్కో పంచాయతీకి రూ.25 లక్షలు
ఉమ్మడి జిల్లాలో 249 గ్రామాలకు రూ.62.25 కోట్లు
ఇప్పటికే 218 గ్రామాల్లో స్థలం గుర్తించిన రెవెన్యూ యంత్రాంగం
త్వరలో పరిపాలనా అనుమతులు.. టెండర్లు
తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి గిరిజనులకు అధికారాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రభుత్వం పాలనకు ఇబ్బందులు లేకుండా వసతుల కల్పనకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే కొత్త గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమంలో అభివృద్ధి పనులు కొనసాగుతుండగా పక్కా గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించేందుకు నిర్ణయించింది. ఇందుకోసం ఒక్కో పంచాయతీ భవనానికి రూ.25లక్షల చొప్పున ఎస్టీ సబ్ ప్లాన్ నుంచి నిధులు విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలో 249 పంచాయతీలకు రూ.62.25 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం 218 పంచాయతీ భవనాల నిర్మాణానికి రెవెన్యూ యంత్రాంగం స్థలాలను గుర్తించింది. త్వరలో పరిపాలనా అనుమతులు ఇచ్చి ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో టెండర్లు నిర్వహించనుంది. వీటి నిర్మాణంతో అద్దె భవనాల్లో కొనసాగుతున్న గ్రామాలకు ఊరట కలుగనుంది.
నల్లగొండ, జూలై 1 : గిరిజన తండాలు, మారుమూల గూడేలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి పాలన చేరువ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. వాటి అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తున్నది. దాంతో పారిశుధ్యం మెరుగు పడడంతోపాటు వసతులు సమకూరాయి. ఇప్పుడు తండాల్లో పంచాయతీ భవనాల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం ఎస్టీ సబ్ ప్లాన్ నుంచి ఒక్కో భవనానికి రూ.25లక్షల చొప్పున నిధులు విడుదల చేసింది.
249 పంచాయతీల్లో పక్కా భవనాలు..
ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,740 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 249 గిరిజన గ్రామాలు ఉండగా.. వాటిల్లో పంచాయతీ పక్కా భవనాలు నిర్మిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో 104, సూర్యాపేటలో 101, యాదాద్రి భువనగిరి జిల్లాలో 44 గ్రామ పంచాయతీల్లో భవనాల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ సబ్ప్లాన్ కింద నిధులు విడుదల చేసింది. పంచాయతీకి రూ.25లక్షల చొప్పున మొత్తం రూ.62.25కోట్లు విడుదల చేసిన సర్కారు.. త్వరలో పరిపాలనా అనుమతులు ఇవ్వనుంది. ఆ వెంటనే భవనాల నిర్మాణాలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే 218 గ్రామ పంచాయతీల్లో స్థలాలను రెవెన్యూ యంత్రాంగం గుర్తించింది. భూమి గుర్తింపు తుది నివేదికను జిల్లా పంచాయతీ అధికారులు ప్రభుత్వానికి పంపించారు. త్వరలో ఆయా పంచాయతీలకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసి పీఆర్ ఇంజినీరింగ్ శాఖ ద్వారా టెండర్లు నిర్వహించనున్నారు. పంచాయతీ భవనంలో సర్పంచ్, కార్యదర్శికి ఒక్కో గదితోపాటు సమావేశాలకు హాల్, మరుగుదొడ్లు నిర్మించే విధంగా డిజైన్ చేస్తున్నారు.
స్వపరి పాలన కోసమే..
పరిపాలనా వికేంద్రీకరణతోనే అభివృద్ధి జరుగుతుందని విశ్వసించిన సీఎం కేసీఆర్ గిరిజనులకు స్వపరిపాలన అవకాశం కల్పించాలనే ఆలోచనతో తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. ఈ డిమాండ్ ఏండ్ల తరబడి గిరిజనుల్లో ఉన్నప్పటికీ గత పాలకులు పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 500 జనాభా కలిగిన ప్రతి తండాను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. దాంతో ఆయా తండాల్లో గిరిజనులే సర్పంచులుగా ఎన్నికై స్వపరిపాలన చేసుకుంటున్నారు.
నిధులు విడుదలయ్యాయి..
గిరిజన గ్రామ పంచాయతీల్లో పక్కా భవనాలు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ సబ్ప్లాన్ నుంచి రూ.25లక్షల చొప్పున విడుదల చేసింది. నల్లగొండలో 104 గ్రామాలు ఉండగా.. అందులో ఇప్పటికే 95 గ్రామ పంచాయతీల్లో భూమిని గుర్తించి ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం నుంచి పరిపాలనా అనుమతులు రాగానే ఇంజినీరింగ్ విభాగం ద్వారా టెండర్లు నిర్వహించి నిర్మాణాలు చేపడుతాం.
– దేప విష్ణువర్ధన్రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి, నల్లగొండ