నల్లగొండ ప్రతినిధి(నమస్తే తెలంగాణ)/నకిరేకల్, జూలై 11: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మంగళవారం నకిరేకల్ మండలం చందుపట్లను సందర్శించనున్నట్లు గవర్నర్ సెక్రటరీ కె.సురేంద్రబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు గవర్నర్ పర్యటన షెడ్యూల్ను విడుదల చేశారు. ఉదయం 7 గంటలకు రాజ్భవన్ నుంచి బయలుదేరి 8.45 గంటలకు చందుపట్లకు చేరుకోనున్నారు. అక్కడ కాకతీయ మహారాణి రుద్రమదేవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. అనంతరం అక్కడే ఉన్న రాణిరుద్రమ శిలా శాసనాన్ని సందర్శించనున్నారు.
తిరిగి ఉదయం 9 గంటలకు అక్కడ బయల్దేరి నార్కట్పల్లిలోని ఓసీటీఎల్ గెస్ట్హౌస్కు చేరకుంటారు. కొద్ద్దిసేపు విశాంత్రి అనంతరం 9.30 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు బయలుదేరుతారు. గవర్నర్ చందుపట్లకు రానున్న నేపథ్యంలో అధికారులు రాణి రుద్రమదేవి కాంస్య విగ్రహం వద్ద పరిసరాలను శుభ్రం చేయించారు. రెయిన్ ప్రూఫ్ టెంట్లను వేయించారు. కాగా, చందుపట్లలో కాకతీయ వైభవ సప్తాహం ఉత్సవాలను మంగళవారం నిర్వహించాల్సి ఉండగా వర్షం కారణంగా వాయిదా వేసిన విషయం విదితమే.