‘ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరి ఊహలకూ అందని రీతిలో అందిస్తున్న పాలనలో అన్నీ సంచలనాత్మకాలే. తొమ్మిదేండ్లుగా జోరుగా కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమమే అందుకు నిదర్శనం. ఆయన ముందు
చూపుతోనే అన్ని రంగాల అభివృద్ధితోపాటు మెరుగైన ప్రభుత్వ వైద్యం, వైద్య విద్య మరింత చేరువయ్యాయి’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో రూ.200 కోట్లతో నిర్మించనున్న వెయ్యి పడకల ప్రభుత్వ సర్వజన వైద్యశాల (టీచింగ్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి) భవనానికి ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్తో కలిసి మంత్రి గురువారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ అన్ని రంగాల అభివృద్ధితోపాటు వైద్యారోగ్య సేవల్లోనూ యావత్ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. మారుమూల ప్రాంతాలకు వైద్య సైవలను విస్తరించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పల్లె, బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. అంతకుముందు మంత్రి పెన్ పహాడ్లో 10వేల మెట్రిక్ టన్నుల గోదాము, దురాజ్పల్లిలో లింగమంతుల ఆలయ రాజగోపురాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
సూర్యాపేట టౌన్, అక్టోబర్ 5 : ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో అన్ని రంగాల అభివృద్ధితో పాటు మెరుగైన ప్రభుత్వ వైద్యం, వైద్య విద్య మరింత చేరువయ్యాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలో సుమారు రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన వెయ్యి పడకల ప్రభుత్వ సర్వజన వైద్యశాల (టీచింగ్ ఆస్పత్రి, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి) భవనానికి గురువారం మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడారు. పోరాడి సాదించిన తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడం కోసం నూతన జిల్లాలను ఏర్పాటు చేయడమే కాకుండా జిల్లాకో మెడికల్ కళాశాల ప్రసాదించడంతో అన్ని రంగాల అభివృద్ధితో పాటు వైద్య ఆరోగ్య సేవల్లోనూ యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు.
ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా కేంద్రంగా ప్రకటించబడి మెడికల్ కళాశాల ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలతో పాటు వైద్య విద్య మరింత చేరువైందన్నారు. దేశానికి మరో 150 మంది వైద్యులను అందించే అవకాశాన్ని కోల్పోవద్దన్న సంకల్పంతో ప్రకటించిన ఏడాదిలోనే కళాశాల ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సూర్యాపేట జనరల్ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది, విద్యార్థులు, వైద్యేతర సిబ్బంది కృషితో కొవిడ్ కాలంలో వేలాది మంది రోగుల ప్రాణాలు నిలబెట్టగలిగామన్నారు. సూర్యాపేట ఆస్పత్రిలో చుట్టు పక్కల జిల్లాల నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి వచ్చి వైద్య సేవలు పొందడం గొప్ప విషయమన్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల సౌకర్యాలు జిల్లా జనరల్ ఆస్పత్రిలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అంతేకాకుండా మారుమూల ప్రాంతాలకు సైతం వైద్య సైవలను విస్తరించాలనే లక్ష్యంతో పల్లె, బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. వందల రకాల పరీక్షలను ఉచితంగా అందించాలనే సంకల్పంతో మెడికల్ హబ్లను ఏర్పాటు చేయగా ప్రజలంతా సద్వినియోగం చేసుకుంటున్నట్లు వెల్లడించారు. భవిష్యత్లోనూ మరిన్ని సేవలను కొనసాగిస్తూ సూర్యాపేటను చరిత్రలో నిలిచేలా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ శారదాదేవి, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ దండ మురళీధర్రెడ్డి, వైద్యులు రమేశ్నాయక్, యశ్వంత్, బైరు వెంకన్న, కౌన్సిలర్ సిరువేళ్ల లక్ష్మీకాంతమ్మ పాల్గొన్నారు.