కేతేపల్లి : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, పల్లెలకు దండిగా నిధులు కేటాయిస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నల్లగొండ జిల్లా కేతపల్లి మండలంలో గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
మొదట ఇనుపాముల గ్రామంలో వైకుంఠ ధామం, కంపోస్ట్ షెడ్డు, రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం బండపాలెం గ్రామంలో 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులు, కొండకింది గూడెం గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం కొప్పోలు గ్రామంలో రూ.16 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి జరుగుతుందని గుర్తించిన సీఎం కేసీఆర్ అందుకు అనుగుణంగా పల్లెల ప్రగతికి విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు. పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తూ గ్రామాల రూపురేఖలే మారుస్తున్నారని ప్రశంసించారు.